హైదరాబాద్​లో ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురి అరెస్టు​.. పాకిస్థాన్ గ్రనేడ్లు స్వాధీనం

author img

By

Published : Oct 3, 2022, 8:56 AM IST

terror plot

Terrorist conspiracy foiled in Hyderabad: హైదరాబాద్‌ జంటనగరాల్లో పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్‌ కేంద్రంగా జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పథకం ప్రకారం అలజడి సృష్టించేందుకు కశ్మీర్‌ నుంచి గ్రనేడ్లను నగరానికి తీసుకువచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. మూసారాంబాగ్‌ వాసి అబ్దుల్‌ జాహెద్‌ పాక్‌ ముష్కరులతో నిత్యం సంప్రదింపులు సాగిస్తున్నాడు. స్థానిక యువకులతో తరచూ సమావేశమవుతూ వారిని ఆకట్టుకునేందుకు ఆర్ధిక సహకారం అందిస్తున్నాడు. నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రహస్యంగా ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని పట్టుకున్నారు.

హైదరాబాద్​లో ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురి అరెస్టు​.. పాకిస్థాన్ గ్రనేడ్లు స్వాధీనం

Terrorist conspiracy foiled in Hyderabad: హైదరాబాద్‌లో పేలుళ్ల ద్వారా విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైన ముగ్గురిని నగర పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ముగ్గురి కదలికలపై డేగ కన్ను వేశారు. నిందితులకు ఏ మాత్రం అనుమానం వచ్చినా వారు పరారయ్యే అవకాశం ఉండడంతో.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అరెస్టు చేశారు.

ఇటీవల నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలను అవకాశంగా చేసుకుని మతఘర్షణలు రెచ్చగొట్టేందుకు మూసారాంబాగ్‌కు చెందిన జాహెద్‌కు పాకిస్థాన్‌ నుంచి ఆదేశాలు అందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను కూడా ఇందుకోసం ఇతను వాడుకుంటున్నట్టు భావిస్తున్నారు. హిందూ పండుగలు, భాజపా, ఆర్​ఎస్​ఎస్​ బహిరంగ సభలు లక్ష్యంగా బాంబు పేలుళ్లతో విధ్వంసం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాన్ని అమలు చేసేందుకు దసరా పండుగను అవకాశంగా మలచుకోవాలనుకున్నారు.

నీలిరంగు గ్రనేడ్లతో దాడులతో దాడికి యత్నం: భారీ ఎత్తున పేలుళ్ల కోసం బాంబు తయారీకి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేవారు. అవతలి వైపు నుంచి ఇంటర్‌నెట్‌, ఫోన్‌ ద్వారా తయారీపై సూచనలు చేసేవారు. పోలీసు నిఘా పెరగడం, తయారీలో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో దాడులకు గ్రనేడ్లను వినియోగించాలనుకున్నారు. ఇటీవల కశ్మీర్‌లో సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఉగ్రవాదులు నీలిరంగు గ్రనేడ్లతో దాడులు చేశారు. ఆ గ్రనేడ్లు చైనాలో తయారైనట్టు బయటపడింది. రెండు నెలల క్రితం అవే గ్రనేడ్లు పాకిస్థాన్‌ నుంచి కశ్మీర్‌ చేరాయి.

నెల రోజుల క్రితం అక్కడి నుంచి వ్యాన్‌లో గ్రనేడ్లు నిల్వ చేసిన పెట్టెను నగర శివార్లలో జాహెద్‌కు అందినట్టు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా గ్రనేడ్లను భద్రపరిచారు. నిందితుల నుంచి నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న గ్రనేడ్లు నీలి రంగులో ఉన్నాయి. చైనాలో తయారయిన ఈ గ్రనేడ్లు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దాడులకు ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 2006లో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓడియన్‌ థియేటర్‌లో జరిగిన దాడి మొదటి సారి గ్రనేడ్‌తో జరిగింది.

పాక్‌ ఆదేశాల కోసం వెయిటింగ్: గ్రనేడ్లు ఎక్కడ విసరాలి, ఎవరిని రంగంలోకి దించాలి. ప్రాణనష్టం కలిగించేందుకు ఉన్న అవకాశాలపై ఉగ్రమూకలు చర్చించుకున్నాయి. పోలీసు నిఘా నుంచి తప్పించుకుని తమ ప్రణాళిక అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పాక్‌ నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. వరుస ఘటనలు, పండుగలతో కేంద్ర నిఘా వర్గాలు నగర పోలీసులను అప్రమత్తం చేశాయి. పాత నేరస్తులు, అనుమానితుల పై నిఘా ఉంచిన సిట్‌, సీసీఎస్​, స్పెషల్ బ్రాంచ్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు... దాడుల గురించి తెలవడంతో అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో రహస్యంగా ఆపరేషన్‌ చేసి జాహెద్‌, సమీయుద్దీన్‌, హసన్‌ ఫారూక్‌లను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.