Telangana Tourism : పర్యాటక ప్రదేశాల్లో టాయ్‌ ట్రైన్‌లు

author img

By

Published : Jan 23, 2023, 8:51 AM IST

Telangana Tourism

Toy trains at Telangana tourist spots : తెలంగాణలో పర్యాటక రంగం వేగంగా ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక మార్ట్‌లో ఆయన పాల్గొన్నారు. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల్ని వృద్ధి చేయడంపై దృష్టి పెడతామన్నారు

Toy trains at Telangana tourist spots : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలతో తెలంగాణలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల్ని వృద్ధి చేయడంపై దృష్టి పెడతామన్నారు. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక మార్ట్‌లో ఆదివారం వివిధ దేశాల పర్యాటక శాఖలు ఏర్పాటు చేసిన సమాచార స్టాళ్లను ఆయన పరిశీలించారు.

Telangana Tourism : ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర పర్యాటక అధికారులతో మాట్లాడుతూ.. తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పర్యాటకుల కోసం ఆధునిక బస్సులను, టాయ్‌ ట్రైన్‌లను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టే అంశంపై చర్చించారు. డబుల్‌ డెక్కర్‌ బస్సు, టాయ్‌ ట్రైన్‌లను మంత్రి, అధికారులు పరిశీలించారు. మంత్రి వెంట పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, టూరిజం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మనోహర్‌, టూరిజం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఓం ప్రకాశ్‌ తదితరులున్నారు.

తెలంగాణలో 246 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం, లక్నవరం మూడో ద్వీపంలో ఎకోటూరిజం పనులు జరుగుతున్నాయని తెలిపారు. సోమశిల, సింగోటం రిజర్వాయర్‌లు, అక్కమహాదేవి గుహలు, ఈగలపెంట, మన్ననూర్‌, మల్లెలతీర్థం, ఉమామహేశ్వర ఆలయం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగత జలపాతం, బమ్మెరపోతన, పాకాల, అలీసాగర్‌, జోడెఘాట్‌, కొమురంభీమ్‌ మెమోరియల్‌ పార్క్‌, కేసీఆర్ అర్బన్‌ ఎకోపార్క్ పనులు చేపట్టామన్నారు. వీటితో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలోనూ అర్భన్‌ పార్కులు ఏర్పాటు చేశామని చెప్పారు.

మరోవైపు తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం.. ఉజ్వలమైన సంస్కృతి, సంప్రదాయాలు, అనేక అద్భుత కళలకు పుట్టినిల్లని కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలు, దర్శనీయ ప్రదేశాల గురించి వివరాలు సేకరించి.. రాష్ట్ర పర్యాటకాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందన్న కేసీఆర్.. ఈ విషయంపై ప్రధాని మోదీతో గొడవపడ్డానని తెలిపారు. అవసరమైతే కేంద్రంతో కొట్లాడైనా.. తెలంగాణకు దక్కాల్సిన గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు.

రాష్ట్రంలో.. రామప్ప ఆలయమే కాకుండా వారసత్వ పరంపరలో వచ్చిన చాలా కట్టడాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాటిని గుర్తించి పునర్​వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని అష్టాదశ పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా పాలకులు పట్టించుకోలేదని, కృష్ణా, గోదావరి పుష్కరాలకు కూడా ఆదరణ లభించలేదని కేసీఆర్ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.