ఎన్నికల వేళ పార్టీ మారుతున్న నాయకులు - సందిగ్ధంలో అనుచరులు

ఎన్నికల వేళ పార్టీ మారుతున్న నాయకులు - సందిగ్ధంలో అనుచరులు
Party Jumpings in Telangana Elections 2023 : రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం కామన్. అయితే పార్టీని, తమ నాయకుడిని నమ్ముకుని ఉన్న అనుచరులు ఒక్కసారిగా తన నేత పార్టీ మారడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఇన్నాళ్లు నమ్మిన పార్టీ సిద్ధాంతాలకు లోబడి అందులోనే ఉండాలా.. లేక నాయకుడితో పార్టీ మారాలా అనే సందిగ్ధంలో పడుతున్నారు. స్వలాభం కోసం పార్టీ మారుతున్న తమ నేతల బాటలో నడిచేందుకు కొన్నిచోట్ల అనుచరులు సిద్ధంగా ఉండటం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోని పలు నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది.
Party Jumpings in Telangana Elections : రాజకీయాల్లో నేతలు ఎన్ని పార్టీలు మార్చినా.. అసలు సిసలైన అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఒకే జెండాకు జై కొడుతుంటారు. వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు.. ఇబ్బందికర పరిస్థితి తలెత్తినపుడు మాత్రమే ఇతర పార్టీ వైపు మొగ్గుచూపుతారు. తమ నాయకుల బాటలో నడుస్తారు. స్వలాభం కోసం నాయకులు పదే పదే పార్టీలు మారుతుంటే మాత్రం వీళ్లంతా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతుంటారు. ప్రస్తుతం నగరంలోని పలు శాసనసభ నియోజకవర్గాల్లో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. గెలుపోటములను ప్రభావితం చేసే వీరి ఓట్లు ఎవరికి పడతాయనేది ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిసోంది. ఇన్నాళ్లు తమ వెంట ఉన్న వాళ్లకు ఓటు వేస్తారా.. లేక నమ్ముకున్న పార్టీకి వేస్తారా అన్న ప్రశ్న అందరిలో మొదలైంది.
జూబ్లీహిల్స్ పరిధిలో నామినేషన్ల పర్వం తర్వాత ప్రధాన పార్టీ నాయకుడు ప్రత్యర్థి పార్టీలోకి చేరారు. ఆయనతోపాటు సుమారు 200 మంది కీలక అనుచరులు కార్యకర్తలు కండువాలు కప్పుకొన్నారు. రోజుల వ్యవధిలోనే నాయకుడు మరో పార్టీకి జై కొట్టడంతో అతని అనుచరులు ఆలోచనలో పడ్డారు. కొందరు దీనికి మౌనం వహిస్తే.. మరికొందరు సారీ అన్నా అంటు నాయకుడి నుంచి దూరం జరిగారు.
అదే నియోజకవర్గ పరిధిలోని ద్వితీయశ్రేణి నాయకులు తమ పార్టీ వ్యవహారశైలి నచ్చకపోవడంతో పక్క పార్టీకి మద్ధతు పలుకుతున్నట్లు తెలిపారు. వారంతా ఎవరు నచ్చక పార్టీ మారారో.. ఆ నేత కూడా అదే పార్టీలోకి రావడం వల్ల వారికి ఏం చేయాలో పాలుపోకుండా ఉందంటూ రెహ్మత్నగర్కు చెందిన చోటా నాయకుడు అవేదన వ్యక్తం చేశారు. ఇలా స్వలాభం కోసం పార్టీ మారుతున్న నేతల వల్ల అనుచరులు గందరగోళానికి గురవుతున్నారు.
Candidates Party Jumpings Issue in Telangana : ఖైరతాబాద్ పరిధిలోని తాము కొత్తగా చేరిన పార్టీలో నాయకుడి వ్యవహారశైలి నచ్చక కొంత మంది కార్యకర్తలు కొన్నాళ్లకు తిరిగి పాత పార్టీలోకి చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాత పార్టీ అధిష్ఠానం తమ నాయకుడుకి టికెట్ ఇవ్వనందున ఆగ్రహించిన సదరు నేత హఠాత్తుగా ఇతర పార్టీ కండువా కప్పుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కార్యకర్తలు ఉన్నారు.
ఎల్బీనగర్ పరిధిలో వింత పరిస్థితి జరిగింది. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీ తరఫున పోటీ చేసిన నాయకుడి నోటి దురుసు నచ్చక కొందరు సీనియర్ నేతలు వేరే పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సదరు నాయకుడు కూడా వీరున్న పార్టీలోకి చేరడంతో వారు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. వీరికి సీనియర్లు ఎంత నచ్చజెప్పినా లాభం లేకుండా పోయింది. మరోవైపు జూబ్లీహిల్స్ సీటు తనకే కేటాయిస్తుందంటూ ప్రధాన పార్టీపై నమ్మకం పెట్టుకున్న ఒక నాయకురిరాలికి చుక్కెదురైంది. నాయకులు మారినంత తేలికగా కేడర్ మారరని గుర్తించిన నేతలు.. కార్యకర్తలను తమకు ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
