One Rupee Hospital Hyderabad: సీజన్ మారిందంటే చాలు.. రకరకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వర్షాకాలంలో డెంగీ, వేసవిలో మలేరియా, చలికాలంలో జలుబు, దగ్గు లాంటి వ్యాధులు దరిచేరుతుంటాయి. ఇలాంటి సాధారణ లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే.. వైద్యులు దాదాపు రూ.200 నుంచి రూ.600 వరకు ఫీజు తీసుకుంటారు. ఫీజుకు తోడు రోగ నిర్ధారణ పరీక్షలు, ఔషదాల ఖర్చు తప్పదు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం భారంగా మారుతోంది. కానీ హైదరాబాద్లోని రాంనగర్లోని జీజీ ఛారిటీ హాస్పిటల్లో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు వసూలు చేసి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం నగర ప్రజలకు తెలియడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు జీజీ ఆస్పత్రికి తరలివస్తున్నారు.
జీజీ ఆస్పత్రిలో ఒక్క రూపాయి ఫీజు మాత్రమే కాదు.. ఇక్కడ నిర్వహించే అన్ని రోగ నిర్ధారణ పరీక్షలకు 50 శాతం రాయితీ ఇస్తున్నారు. వైద్యుని పరీక్షల అనంతరం అక్కడే ఉన్న ఫార్మసీలో మందులు కొనుగోలు చేస్తే 40 శాతం రాయితీ ఇస్తున్నారు. సామాన్యులకు అతి తక్కువ ధరలో వైద్యం అందించాలన్న గంగయ్య స్ఫూర్తితోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆసుపత్రి ఛైర్మన్ గంగాధర్ గుప్తా తెలిపారు. ఒక్క రూపాయి వైద్యంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి..
బతుకమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి: గవర్నర్
'ప్రత్యేక సేవలు' నిరాకరించిందని రిసెప్షనిస్ట్ హత్య.. భాజపా నేత కుమారుడి ఘాతుకం