Farmer Income: హెక్టారు భూమి ఉన్న రైతుకు సగటు రాబడి ఎంతో తెలుసా?

author img

By

Published : Sep 19, 2021, 8:28 AM IST

Farmer Income

మన రైతుల ఆదాయం నానాటికి దిగజారిపోతోంది. దేశంలో మొత్తం 10.18 కోట్ల భూమి కమతాలుంటే అందులో 2.50 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులే 72.6 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో అయితే 2.50 ఎకరాల్లోపు ఉన్నవారు 53 శాతం, తెలంగాణలో 42.2 శాతం మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూములు, రైతు కుటుంబాలు, పంటల మద్దతు ధరలు తదితర అంశాలపై జాతీయ నమూనా సర్వే చేసింది. ఈ వివరాలను కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసింది.

ఆరుగాలం శ్రమ... బండెడు చాకిరీ... ఆదాయం చూస్తే అరకొర. భూమినే నమ్ముకుని ఏటికేడూ పట్టు వదలక సాగు చేస్తే వారికి దక్కేదెంతో తెలుసా? రోజు కూలి కంటే తక్కువ. కనీస ధర లభించకపోయినా.. గత్యంతరం లేక... భవిష్యత్తుపై ఆశతో మళ్లీ మళ్లీ పంటలు వేసే రైతులు చివరకు గిట్టుబాటు కాక అప్పుల పాలవుతున్నారు. కొండంత కష్టపడినా వారికి దక్కేది గోరంతే. హెక్టారు (2.50 ఎకరాల్లోపు) భూమి ఉన్న రైతు కుటుంబానికి రోజుకు సగటున రూ.224 మాత్రమే ఆదాయం వస్తోంది. రోజు కూలి చేసే వారికి గ్రామాల్లో రూ.300- 500, నగరాల్లో రూ.600-700 వస్తోంది. ప్రభుత్వంలో చిన్నస్థాయి ఏ ఉద్యోగికైనా నెలకు కనీసం రూ.20 వేలు వస్తుంది. కానీ పంటలు పండించిన రైతు సగటు ఆదాయం చూస్తే విస్మయం చెందాల్సిందే. 2018 జులై నుంచి 2019 జూన్‌ వరకూ ఎకరం నుంచి 2.50 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతు కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం రూ.6,951 చొప్పున వచ్చింది. రైతాంగంలో సగం మంది అప్పుల్లోనే ఉంటున్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం జులై 2018 నుంచి జూన్‌ 2019 మధ్య కాలంలో చేపట్టిన జాతీయ నమూనా సర్వేలో వెల్లడయ్యాయి.

  • ప్రతి 100 మంది రైతుల్లో 50.2 శాతం మంది అప్పుల్లో ఉన్నారు.
  • ప్రతి రైతు కుటుంబానికి సగటున రూ.74,121 రుణం ఉంది.

ఆదాయం లేక.. కూలీకీ కొరగాక!

  • రైతు కుటుంబాలు ఏ పెద్ద అవసరం వచ్చినా అప్పు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. అయిదెకరాల్లోపు భూమి ఉన్న రైతుల నెల సగటు ఆదాయం రూ.9,189. దేశంలో 88.5 శాతం, ఏపీలో 77.3, తెలంగాణలో 75.5 శాతం రైతు కుటుంబాలు నెలకు వచ్చే ఈ కాస్త రూ.9,189తోనే ఖర్చులు నెట్టుకురావాలి.
  • పంటల సాగుకు నెలకు సగటున రూ.6960 చొప్పున రైతు కుటుంబం ఖర్చు పెడుతోంది.
  • పాడి పశువుల పెంపకం, వ్యవసాయేతర పనులు, కూలికెళ్లడం వంటివన్నీ కలిపితే నెలకు సగటు ఆదాయం రూ.10,218 ఉంది. కేవలం పంటల సాగునే పరిగణనలోకి తీసుకుంటే సగటు ఆదాయం నెలకు రూ.8,337 మాత్రమే ఉంది.
  • రైతులకు ఉన్న అప్పుల్లో 69.6 శాతం బ్యాంకులు, సంఘాల నుంచి తీసుకున్నవి 20.5 శాతం. మిగిలినవారు వడ్డీ వ్యాపారుల వద్ద తెచ్చుకున్నారు.
  • రైతు కుటుంబాల్లో 14.2 శాతం మంది రోజువారీ కూలీలుగా పనులకు వెళుతున్నారు. ఈ కుటుంబాల్లో 7.7 శాతం మంది నెలవారీ జీతాలు పొందే ఉపాధిలో ఉన్నారు.
  • గ్రామాల్లో వ్యవసాయేతర కుటుంబాల్లో 48.6 శాతం మంది కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ కుటుంబాల్లో 17.7 శాతం మంది నెలవారీ వేతనం పొందే ఉద్యోగాలు చేస్తున్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం భూముల్లో ఎస్సీల పేరుతో 14.1 శాతం, ఎస్టీలకు 10.2, బీసీల పేరిట 47.2, ఓసీ వర్గాలకు 28.5 శాతం భూమి ఉంది.
పంటలు

సలహాలిచ్చేది తోటి రైతులే

పంటల సాగులో ఆధునిక విధానాలపై సాంకేతిక సలహాలను తోటి ఆదర్శ రైతుల నుంచే తీసుకుంటున్నట్లు 91.2 శాతం మంది రైతులు చెప్పారు. పురుగుమందులు, విత్తనాలు, ఎరువులు విక్రయించే డీలర్లు చెప్పినవి 92.4 శాతం మంది పాటిస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సమాచారం 73.8 శాతం, కృషి విజ్ఞాన కేంద్రాల సూచనలను పాటించినట్లు 72 శాతం, స్మార్ట్‌ఫోన్ల యాప్‌లలో లభించే వివరాలను పంటల సాగులో ఉపయోగించినట్లు 62.8 శాతం మంది తెలిపారు. వ్యవసాయశాఖ సిబ్బంది సమాచారాన్ని వాడుకున్నట్లు 86.2 శాతం రైతులు స్పష్టం చేశారు.

సగటు ఆదాయం
  • ప్రతి 100 రైతు కుటుంబాలకు సగటున 21.9 శాతమే పాడి పశువులు, 134 కోళ్లు ఉన్నాయి.
  • గ్రామాల్లో 25 ఎకరాల భూమి ఉన్న వారిని భూస్వామి అంటారు. అలాంటి రైతు కుటుంబం నెల సగటు ఆదాయం రూ.60,758 మాత్రమే.

గిట్టుబాటు ధర ఏదీ!

పంటల అమ్మకాలు

పంటలకు మద్దతు ధర ఇస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా జాతీయ నమూనా సర్వేలో మాత్రం ఎక్కువశాతం మంది తమకు మద్దతు ధర దక్కలేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్వహించే వ్యవసాయ మార్కెట్లలో గానీ, ప్రభుత్వ సంస్థలు ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లో గానీ పంటలు అమ్ముతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. 2019లో జనవరి నుంచి జూన్‌ మధ్యలో పంట అమ్మకాలపై సర్వే చేయగా పత్తి పంటను అమ్మిన ప్రతి వెయ్యి మంది రైతుల్లో తెలంగాణలో కేవలం 274 మంది మాత్రమే తమకు సరైన ధర వచ్చిందని సంతృప్తి తెలిపారు. ఏపీలో పెసలు అమ్మిన రైతుల్లో వెయ్యికి 427 మంది మాత్రమే సంతృప్తి చెందారు. దేశవ్యాప్తంగా గిట్టుబాటు ధర రావడం లేదని ఎక్కువ శాతం కర్షకులు చెప్పారు.

ఇదీ చూడండి: CM KCR On Rice crop: యాసంగిలో వరిసాగు వద్దని తేల్చిచెప్పిన సీఎం.. ఎందుకంటే..

CROP DAMAGE: పంట నష్టం లెక్కింపు, పరిహారం గురించి ప్రస్తావనేదీ?

Crop losses: వేల ఎకరాల్లో మునిగిన పైర్లు.. పెట్టుబడి రాయితీ కోల్పోతున్న రైతులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.