ప్రత్యర్థుల కదలికపై పటిష్ఠ నిఘా - గెలుపు కోసం అభ్యర్థుల ఎత్తుగడలు మామూలుగా లేవుగా

ప్రత్యర్థుల కదలికపై పటిష్ఠ నిఘా - గెలుపు కోసం అభ్యర్థుల ఎత్తుగడలు మామూలుగా లేవుగా
MLA Candidates Spy on Opposition Leaders in Telangana : ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రత్యర్థుల కదలికలు తెలుసుకునేందుకు వీలుగా తమకు నమ్మకమైన వారిని ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. వారి కార్యాచరణ, ఎవరెవరిని కలుస్తున్నారు.. ఇవన్నీ తెలుసుకునేందుకు ప్రత్యర్థుల నివాసాల వద్ద వసతి ఏర్పాట్లు చేసి మరీ నిఘా పెడుతున్నారు.
MLA Candidates Spy on Opposition Leaders in Telangana : నగరంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు వివిధ రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గుట్టు చప్పుడు కాకుండా గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. తమ అనుచరులను రంగంలోకి దింపి వారి నివాసం వద్ద జరిగే ప్రతి సంఘటనపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి చేరవేస్తున్నారు. దానికి తగినట్టుగా తమ వ్యూహాలను.. ప్రచారాలను మార్చుకుంటున్నారు. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభిమానుల మధ్య గొడవలు జరిగినప్పుడు ఈ నిఘా గుట్టు వెలుగు చూసింది.
రాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఓటరు నాడి పట్టుకోవడం అభ్యర్థులకు సవాలుగా మారింది. నియోజకవర్గంలో సీటు ఆశించి భంగపడిన నేతలు, నాయకుల మాటలతో అలకబూనిన అనుచరులు.. ఇతర పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. పార్టీలు, అభ్యర్థులతో విభేదించిన ప్రధాన అనుచరులు, ఓటింగ్పై ప్రభావం చూపగల కాలనీలను, కుల సంఘాల నేతలను ముందుగానే పసిగట్టేందుకు పలువురు అభ్యర్థులు వేగులను ఏర్పాటు చేసుకున్నారు.
MLA Candidates Spy Activity in Telangana : ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థులు, ప్రధాన అనుచరుల నివాసాల వద్ద పాగా వేసి.. కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఫొటోలు తీసి.. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం వీరి బాధ్యత. కీలక నాయకులు వచ్చినప్పుడు వారికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. స్థానికులైతే వారిని గుర్తించే అవకాశం ఉండటం వల్ల బయటి వాళ్లను రప్పించి వారికి వసతి కల్పిస్తున్నారు.
అటు నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ప్రత్యర్థి పార్టీలో వ్యతిరేకులను ముందుగానే కలిసి ఒప్పందం చేసుకుంటున్నారు. తమ పార్టీ కండువా కప్పి ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ పరిధిలో సుమారు 10 వేల ఓటర్లపై ప్రభావం చూపే నాయకులు పార్టీ మారబోతున్నారనే సమాచారం ప్రధాన పార్టీ నేత ఒకరు ముందుగానే గుర్తించినట్లు సమాచారం.
రాజేంద్రనగర్ పరిధిలో ప్రస్తుతం పోటీలో ఉన్న ఓ పార్టీ అభ్యర్థి ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తచ్చాడటం, తమ నాయకుడి ప్రచారంలో తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీయటం, అభ్యర్థి అనుచరులు గుర్తించి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఒకరి రహస్యాలు మరొకరు తెలుసుకునేందుకు నమ్మకస్తులను నియమించుకోవటం సాధారణమని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కాగా.. అభ్యర్థులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి షేర్ చేయటం మాత్రం నేరమని హెచ్చరించారు.
