OIL PALM: '20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు'

author img

By

Published : Jul 17, 2021, 3:46 PM IST

'20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేయాలని నిర్ణయం'

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగుకు మంచి భవిష్యత్ ఉందని మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిపారు. ఎకరాకు రూ.36 వేలను ప్రభుత్వం రాయితీగా ఇస్తోందన్న మంత్రి.. ప్రభుత్వ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పంట సాగుకు మంచి భవిష్యత్ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఆయిల్‌ పామ్ సాగు విస్తరణపై టీ-శాట్ ద్వారా 'మన టీవీ' నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్లొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్​ పామ్​ పంట సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. టన్ను ఆయిల్‌పామ్ గెలలకు రూ.19 వేలు ధర పలుకుతుండటంతో ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుందని వివరించారు. ఎకరాకు రూ.36 వేల రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నువ్వులు, కుసుమ, వేరు శనగ తదితర నూనె గింజల సాగు ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ అవసరాల కోసం ఏటా 70 వేల కోట్ల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నందున.. స్వయం సమృద్ధి సాధించాలంటే 80 లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్​ సాగు చేపట్టాల్సి ఉంది. కానీ 8 లక్షల ఎకరాలే సాగవుతుందని ప్రస్తావన వచ్చింది. ఇది దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్​ పంట సాగు చేయాలని నిర్ణయించాం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి​

నా మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేశారు..

మరోవైపు వ్యవసాయ రంగంలో వచ్చిన ఉపాధి అవకాశాల గురించి తాను ప్రస్తావిస్తే.. ఆ మాటలను కొందరు వక్రీకరించి దుష్ప్రచారం చేశారని మంత్రి ఆక్షేపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ తమ స్థాయికి తగిన అవకాశాలు, ఉద్యోగాలు రావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. 14 ఏళ్లు ఉద్యమంలో పని చేసి, అవమానాలు భరించి తెలంగాణ సాధించుకున్నామని.. ప్రజల కష్టాలు తెలిసిన వాళ్లం-ప్రజల అవసరాల కోసం పని చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అవాకులు, చివాకులు పేల్చే వారంతా ఉద్యమంలో ఆంధ్రా పాలకుల తొత్తులుగా పని చేసిన వారేనంటూ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.

  • ఇదీ చూడండి: Harish Rao: 'రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు'

కార్యక్రమంలో మంత్రి నిరంజన్​రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆయిల్‌ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్​రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్, జాయింట్ డైరెక్టర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: భవిష్యత్​లో ఆయిల్​పామ్​ సాగు పెరుగుతుంది: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.