కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు: కేటీఆర్‌

author img

By

Published : Jul 29, 2022, 3:08 PM IST

Minister Ktr on Cancellation of ITIR

KTR on ITIR: హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయంగా విభేదిస్తున్నామన్న కారణంతో మోదీ సర్కార్‌ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి.... తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింతగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్నారు.

KTR on ITIR:హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు పార్లమెంట్​లో కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. కుంచిత రాజకీయాల కోసం ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన భాజపా ప్రభుత్వం... ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్​లో అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. భాజపా డీఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటి లాగే... అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారని కేటీఆర్ విమర్శించారు.

KTR fires on modi: ఆ ఒక్క కారణంతోనే... రాజకీయంగా విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి మోదీ సర్కార్ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐటీఐఆర్ రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింతగా ఎదిగే అవకాశాన్ని కోల్పొయిందన్న కేటీఆర్.... ప్రస్తుతం ప్రగతికి కేంద్రం చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల తరహాలోనే ఐటీఐఆర్‌ను కూడా మూలకు పెట్టిందని ఆక్షేపించారు.

50 సార్లు కేంద్రానికి విజ్ఞప్తి.. ముఖ్యమంత్రి కేసీఆర్, తాను వివిధ సందర్భాల్లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను ఐటీఐఆర్ గురించి ఎన్నోసార్లు కోరినప్పటికీ ఈ కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీ రంగానికి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరినట్లు కేటీఆర్ వివరించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ రంగానికి నయా పైసా కూడా సాయం చేయలేదని అన్నారు.

ఐటీఐఆర్ ఉండి ఉంటే... కేంద్రానికి హైదరాబాద్ ఐటీ పరిశ్రమ అభివృద్దిపై చిత్తశుద్ది లేకే ఐటీఐఆర్​కు ప్రత్యామ్నాయం చూపలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలైన నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్, పాలసీ పారలసిస్‌లతో ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశసగటును మించిన అద్భుతమైన ప్రగతిని తెలంగాణ ఐటీ పరిశ్రమ సాధించిందని కేటీఆర్ వివరించారు. ఒకవేళ ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉండి ఉంటే గడచిన ఏడేళ్లలో హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టం ఆకాశమే హద్దుగా అద్భుతంగా ఎదిగేదని అభిప్రాయపడ్డారు.

క్షమాపణ చెప్పాల్సిందే... ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మోదీ ప్రభుత్వం... రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న ఏకైక కారణంతోనే ఐటీఐఆర్‌ను రద్దుచేసిందని ఆరోపించారు. ఆధునిక భారత్​ను నిర్మించడంపై తమకున్న విధానపర అశక్తతను పార్లమెంట్​లో ఒప్పుకుని తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వృత్తినిపుణులు, యువతకు మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ రద్దుతో ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలని అన్నారు.

తెలంగాణకు ఏం చేసింది? స్మార్ట్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్​లను తెలంగాణకు మంజూరు చేసినందుకే ఐటీఐఆర్​ను రద్దు చేశామని కేంద్రం చెప్పడం వారి మేధోపర దివాళాకోరుతనానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఐటీఐఆర్ రద్దుకు కేంద్రం పేర్కొంటున్న పథకాల్లోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదని చెప్పారు. భాజపా పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్​లకు లెక్కలేనన్ని కేంద్ర పథకాలను మంజూరు చేస్తున్న మోదీ సర్కారు... తెలంగాణకు వస్తున్న చారానా, ఆఠానా మందం పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. ఐటీఐఆర్​కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోదీ సర్కార్ ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోసారి రాష్ట్రానికి అన్యాయమే.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఇక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా... ప్రధానమంత్రిలో చలనం రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటీరంగ ప్రగతిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వ రాజకీయానికి ఇటీవల ప్రకటించిన సాఫ్ట్​వేర్ పార్క్​లే సాక్ష్యమని మంత్రి ఆక్షేపించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హరియాణ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బిహార్, పంజాబ్, ఝార్ఖండ్, కేరళ రాష్ట్రాలకు సాఫ్ట్​వేర్ పార్క్​లను కేటాయించిన కేంద్రం... తెలంగాణకు మరోసారి అన్యాయం చేసిందని ఆరోపించారు.

నయా పైసా సాయంలేదు... దేశవ్యాప్తంగా 22 సాప్ట్​వేర్ పార్కులను ప్రకటించి తెలంగాణకు మెండిచేయి చూపడం భాజపా ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్, సాప్ట్​వేర్ పార్కుల్లో తెలంగాణకు స్ధానం ఇవ్వని కేంద్రం... తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టీహబ్ రెండో దశ నిర్మాణాన్ని 450 కోట్లతో పూర్తి చేస్తే దానికి కూడా కేంద్రం నుంచి పైసా సాయం చేయలేదని మండిపడ్డారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి ముందుచూపు లేదన్న కేటీఆర్... ఉపాధికల్పన, శిక్షణారంగాల్లో కేంద్రం విఫలమైన విషయాన్ని దేశంలోని యువత, నిరుద్యోగులు గమనిస్తున్నారని అన్నారు.

ఇప్పటికైనా యువత మేలుకో... తెలంగాణ ఐటీరంగంతో పాటు అన్ని అంశాల్లోనూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఇక్కడి యువత గమనించాలని మంత్రి కోరారు. కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ, వివక్ష చూపుతున్నఉపాధి కల్పనలో తెలంగాణ ముందువరుసలో ఉన్నవిషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటీ రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటీఐఆర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీ ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్ సూచించారు.

ఇదీ చూడండి: KTR Tweet Today: 'మోదీకి ముందుచూపు లేకే దేశంలో బొగ్గు కొరత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.