దావోస్​ వేదికగా... తెలంగాణ పెవిలియన్​కు పెట్టుబడుల ప్రవాహం

author img

By

Published : Jan 17, 2023, 2:51 PM IST

ktr

KTR davos tour: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వ బృందం పెట్టుబడుల వేట మొదలైంది. ఇందులో భాగంగానే ఆర్థిక వేదికపై తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.... రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా పలువురు వ్యాపార దిగ్గజాలు, సీఈవోలతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే పెప్సికో పాటు మరో 2 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

KTR davos tour: తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ సంస్థ పెప్సికో ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్ లోని తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్​తో సమావేశం అనంతరం, ఆ సంస్థ ఉపాధ్యక్షులు రాబర్డో అజేవేడో ప్రకటించారు. 250 మందితో 2019లో ప్రారంభమైన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్‌లో.. ప్రస్తుతం 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు పెప్సికో వెల్లడించారు. ఈ సంఖ్యను 4 వేలకు పెంచనున్నట్లు స్పష్టం చేశారు.

ఏడాదికాలంలో అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ విస్తరణతో పాటు రాష్ట్రంలో పెప్సీకో ఇతర విభాగాల విస్తరణ అవకాశాలపైన కేటీఆర్, రాబర్టో చర్చించారు. పెప్సికో నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్... విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు.

అలాక్స్  బ్యాటరీల తయారీ సంస్థతో ఒప్పందం
అలాక్స్ బ్యాటరీల తయారీ సంస్థతో ఒప్పందం

అలాక్స్ నుంచి రూ.750కోట్ల పెట్టుబడి: మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు బ్యాటరీల తయారీలో ఎంతో పేరున్న అలాక్స్ సంస్థ ముందుకొచ్చింది. 750 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఉత్పత్తి చేయనున్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో అలాక్స్ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట 210 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగావాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామన్న అలాక్స్ ప్రతినిధులు... భవిష్యత్తులో పది గిగావాట్ల సామర్థ్యానికి పెంచి 2030 నాటికి మొత్తంగా 750 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది. లండన్ తరువాత తమ రెండో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. దావోస్‌లో మంత్రి KTR సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ VC, ఎండీ నీరజ్ కన్వర్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా వినూత్న సాంకేతికతలతో కొత్త వ్యాపార నమూనాలు అభివృద్ధి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుందని అపోలో టైర్స్ పేర్కొంది. వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా రాష్ట్రంలో ఏర్పడిన అద్భుత వ్యవస్థకు అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ సరైన జోడింపుగా కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.