JNTU: జేఎన్​టీయూ ఫీజులు పెంచేసింది.. ఎంతో తెలుసా?

author img

By

Published : Oct 19, 2021, 10:51 AM IST

JNTU

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పీజీ కోర్సుల్లో ఫీజుల మోత మోగించింది. గత నెలలో బీటెక్‌, బీఫార్మసీ రుసుములను పెంచిన ఈ వర్సిటీ తాజాగా పీజీ కోర్సుల్లోను పెంచింది. స్వయంపోషక కోర్సుల్లో ఏకంగా రూ.లక్ష మొత్తాన్ని ఫీజుగా నిర్ణయించడం గమనార్హం. ఫెలోషిప్‌ రానివారు, ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు అర్హత లేనివారికి జేఎన్‌టీయూ ప్రాంగణ కళాశాలల్లో పీజీ చదవడం మరింత భారమే.

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూహెచ్‌) ఎంటెక్‌ ఫీజుల్ని సైతం భారీగా పెంచింది. గత నెలలో బీటెక్‌, బీఫార్మసీ రుసుములను పెంచిన ఈ వర్సిటీ తాజాగా పీజీ కోర్సుల్లోని సీట్లను నాలుగు రకాలుగా విభజించి, ఫీజుల మోత మోగించింది. ఇప్పటివరకు ఫీజు చెల్లించినా అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి వచ్చే ఫెలోషిప్‌ సొమ్ము విద్యార్థులకు చాలా వరకు మిగిలేది. ఇప్పుడిక గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌), గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్టు(జీప్యాట్‌) ర్యాంకర్లు కూడా.. తాము పొందే ఫెలోషిప్‌లో సింహభాగం రుసుములకు చెల్లించాల్సి ఉంటుంది. స్వయంపోషక(సెల్ఫ్‌ ఫైనాన్స్‌) కోర్సుల్లో అయిదు సీట్లకు ఏకంగా రూ.లక్ష మొత్తాన్ని ఫీజుగా నిర్ణయించడం గమనార్హం. ఆ స్థాయి ఫీజు ఉన్న ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలు అయిదారు కంటే లేకపోవడం విశేషం.

సీట్లను విభజించి...

ఇప్పటి వరకు విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులే ఉండేవి. వాటిని తాజాగా నాలుగు రకాలుగా విభజించారు. రెగ్యులర్‌ కోర్సులోని సీట్లను రెగ్యులర్‌, రెగ్యులర్‌-1గా, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులోని సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌-1గా విడగొట్టారు. ఒక్కో పీజీ కోర్సులో మొత్తం 18 సీట్లుంటాయి. వాటిలో 13 సీట్లను రెగ్యులర్‌, మిగిలిన అయిదును రెగ్యులర్‌-1గా విభజించారు. రెగ్యులర్‌- 1 ఫీజును రూ.12 వేలు ఎక్కువ చేశారు. అలాగే సెల్ఫ్‌ ఫైనాన్స్‌లోనూ సీట్లను చీల్చి సెల్ఫ్‌ ఫైనాన్స్‌-1 ఫీజును రూ.లక్ష చేశారు. అంటే రూ.28 వేలు అధికం.

జేఎన్‌టీయూ కూకట్‌పల్లి, జగిత్యాల ప్రాంగణాల్లో పీజీ సీట్లున్నాయి. అధ్యాపకులకు వేతనాలు పెంచుతున్నందున ఫీజులు పెంచుకోవచ్చని గత జులైలో ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో విశ్వవిద్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. గేట్‌, జీప్యాట్‌ ర్యాంకర్లకు ఫెలోషిప్‌ వస్తుంది కాబట్టి సమస్య లేదు. వారికి ఏఐసీటీఈ నెలకు రూ.12,400 చొప్పున రెండేళ్లపాటు ఆర్థిక సహకారం అందిస్తుంది. అంటే సంవత్సరానికి రూ.1,48,800 అందుతుంది. ఒకవేళ ఆ విద్యార్థులకు సెల్ఫ్‌ ఫైనాన్స్‌-1 కేటగిరీ సీటు వస్తే ఫీజుకు రూ.లక్ష పోగా ఇక మిగిలేది రూ.48,800. ఫెలోషిప్‌ రానివారు, ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు అర్హత లేనివారికి జేఎన్‌టీయూ ప్రాంగణ కళాశాలల్లో పీజీ చదవడం మరింత భారమే.

ఇదీ చదవండి: Mp Uttam Comments: కేసీఆర్ కుటుంబంలో కొలువులు... నిరుద్యోగులకేవి కొలువులు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.