Mogulaiah: చేయూత నివ్వాల్సింది పోయి.. చేతివాటం చూపెట్టారు..

author img

By

Published : May 10, 2022, 10:46 AM IST

mogulaiah

Mogulaiah: రెండు కాళ్లూ చచ్చుబడిపోయి.. అచేతనంగా మారిపోయిన వ్యక్తికి సర్కార్ కొంత భూమిని కేటాయించింది. ఆయనకు చెందిన భూమిని అక్రమార్కులు గుట్టుగా అమ్మేసుకున్నారు. తనకు కేటాయించిన స్థలం వద్దకు వెళ్లి చూస్తే అక్కడ ఇళ్లు నిర్మించి ఉంది. కంగుతిన్న ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

Mogulaiah: పుట్టుకతోనే రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే చేతులకు చెప్పులు తొడుక్కొని పడుతూ లేస్తూ పోవాల్సిందే. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన 65 ఏళ్ల మొగులయ్య దైన్య పరిస్థితి ఇది. అలాంటి వ్యక్తికి చేయూత ఇవ్వాల్సిందిపోయి.. కొందరు ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని గుట్టుగా అమ్మేసుకున్నారు. తనకు గతంలో అధికారులు అందజేసిన జాగా వద్దకు ఇటీవల మొగులయ్య వెళ్లారు. అక్కడ ఇతరులు ఇల్లు నిర్మించుకుని ఉండడంతో కంగుతిన్నారు. లబోదిబోమంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

mogulaiah
ప్రజావాణికి వచ్చిన మొగులయ్య

సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సర్వే సంఖ్య 615లో 57వ నంబరుతో 100 గజాల ఇంటి స్థలాన్ని మొగులయ్యకు ఇచ్చారు. 2003లో దానికి పట్టా అందజేశారు. ఆయన భార్య అంధురాలు. కన్న కొడుకూ దూరమయ్యాడు. మొగులయ్య ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయారు. ఇంటి స్థలం ఖాళీగా ఉండటంతో కొందరు దీనిపై కన్నేశారు. ఇక్కడ గజం రూ.25వేలకు పైగా పలుకుతుండటంతో ఆయనకు తెలియకుండానే ఇతరులకు అమ్మేశారు. అధికారులు స్పందించి తన స్థలం తిరిగి ఇప్పించాలంటూ సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి ఆయన తన ఆవేదన వెళ్లగక్కారు.

mogulaiah
అప్పటి ప్రభుత్వం ఇచ్చిన స్థల పత్రం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.