RAINS: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వరుణుడు.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం!

author img

By

Published : Sep 6, 2021, 3:52 AM IST

RAINS: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వరుణుడు.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం!

రెండు, మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం తడిసిముద్దయింది. పలు ప్రాంతాల్లో జనజీవనం అతలాకుతలమైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మరణించగా... మరో నలుగురు గల్లంతయ్యారు. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

రెండు, మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో పలుచోట్ల జనజీవనం అతలాకుతలమైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మరణించగా... మరో నలుగురు గల్లంతయ్యారు. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద నీరు చేరి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం బందనకల్‌ శివారులో రోడ్డు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ జలమయమైంది. కరీంనగర్‌లోనూ భారీ వర్షంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్న పైర్లు ఎర్రబారి పాడవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నేడూ రేపూ భారీ నుంచి అతిభారీ వర్షాలు

సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. తెలంగాణ పక్కనే మరఠ్వాడాపై 4.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. రుతుపవనాల గాలుల ద్రోణి దిల్లీ బాలంగీర్‌, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ వ్యాపించింది. భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణశాఖ సూచించింది.

గణనీయంగా పడిపోయిన విద్యుత్​ డిమాండు

శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకూ అత్యధికంగా నాగిరెడ్డిపేట(కామారెడ్డి జిల్లా)లో 17, బోయిన్‌పల్లి(సిరిసిల్ల)లో 15.4, సర్దన(మెదక్‌)లో 14.4, అబ్దుల్లాపూర్‌మెట్‌(రంగారెడ్డి)లో 14.1, కొండపాక(సిద్దిపేట)లో 11.4, మోమిన్‌పేట(వికారాబాద్‌)లో 10, న్యాల్‌కల్‌(సంగారెడ్డి)లో 10, గంగాధర(కరీంనగర్‌)లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం పగలు 431 ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 4 డిగ్రీల వరకూ తక్కువగా ఉన్నాయి. శనివారం రాత్రి మెదక్‌లో అత్యల్పంగా 19.2 డిగ్రీలుంది. ఆదివారం పగలు హైదరాబాద్‌లో 28 డిగ్రీలే గరిష్ఠంగా నమోదైంది. ఇది సాధారణంకన్నా 2.7 డిగ్రీలు తక్కువ. కరెంటు డిమాండు, వినియోగం గణనీయంగా పడిపోయినట్లు విద్యుత్‌ సంస్థలు తెలిపాయి. ఆదివారం గరిష్ఠ డిమాండు 7,241 మెగావాట్లుంది. గతేడాది ఇదేరోజున(సెప్టెంబరు 5న) 10,716 మెగావాట్లు నమోదవడం గమనార్హం.

డప్పు వాయించేందుకు వెళ్లి...

వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం దోర్నాల్‌కు చెందిన ఎనిమిది మంది ధారూర్‌ స్టేషన్‌లో నిర్వహించే పీర్ల పండుగలో డప్పులు వాయించేందుకు శనివారం సాయంత్రం వెళ్లి రాత్రి వరకు అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరారు. దారి మధ్యలో వాగు ఉద్ధృతితో సమీపంలోని చెక్‌డ్యాంపై నుంచి అవతలి ఒడ్డుకు వెళ్లవచ్చని ప్రయత్నించారు. వీరిలో గోరయ్య (35), కృష్ణ చెక్‌డ్యాంపై నుంచి నడుచుకుంటూ వెళుతూ ప్రవాహంలో పడిపోయారు. అనంతయ్య అనే వ్యక్తి కృష్ణను కాపాడాడు. గోరయ్య మాత్రం కొట్టుకపోయారు. సీఐ తిరుపతిరాజు బోటింగ్‌ సిబ్బందితో గాలించగా ఆరు గంటల తర్వాత ఘటనా స్థలం నుంచి కిలోమీటరు దూరంలో గోరయ్య మృతదేహం లభించింది.

భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం రేజింతల్‌ శివారులోని మామిడి చెరువు మత్తడి ఉద్ధృతమైంది. ఆదివారం మధ్యాహ్నం స్థానికులు వారిస్తున్నా గుర్తుతెలియని యువకుడు(30) ద్విచక్ర వాహనంపై వరద దాటేందుకు ప్రయత్నిస్తూ కొట్టుకుపోయాడు.

సరదాగా వచ్చి.. విషాదం మిగిల్చి..

సిద్దిపేటలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కీర్తి, సురేశ్‌(24) దంపతులు, వారి బంధువు తోమర్‌ జైసింగ్‌(19)తో సహా పది మంది కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి సమీప వాగు గడ్డ వద్దకు సరదాగా వెళ్లారు. సురేశ్‌, జైసింగ్‌, ఆకాశ్‌, కుల్‌దీప్‌ రాజేశ్‌సింగ్‌లు వాగులో స్నానం చేసేందుకు దిగారు. వాగులో అడ్డంగా పడి ఉన్న తాడి చెట్టుపై నడుచుకుంటూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో నుంచి చెక్‌డ్యాం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సురేశ్‌, జైసింగ్‌ నీటిలో పడి గల్లంతయ్యారు. ఆకాశ్‌, కుల్‌దీప్‌లు వాగు మధ్యలోని గడ్డ పైకి ఎక్కి రక్షించమంటూ కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న గ్రామస్థుడు శ్రీకాంత్‌ వారిని కాపాడారు. ఆ ఇద్దరి ఆచూకీ దొరకలేదు.

భళా యువత.. గర్భిణికి చేయూత

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలో బెల్కటూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో తాండూరు-కరణ్‌కోట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న కరణ్‌కోటకు చెందిన మనీషాను తాండూరు తరలించలేకపోయారు. ఈక్రమంలో కరణ్‌కోటకు చెందిన కళాకారిణి అర్చన, బెల్కటూరుకు చెందిన యువకులు నవీన్‌, విజయ్‌, ప్రభు, ప్రకాశ్‌లు గ్రామ శివారు నుంచి పొలాల మీదుగా మనీషాను రైలు పట్టాల వరకు తరలించి, చక్రాల బండిపై పట్టాల మీదుగా వాగు అవతల రహదారికి చేర్చారు. అటుగా వస్తున్న కొడంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు వాహనంలో తాండూరు ఆసుపత్రికి తరలించారు.

ఆయువు తీసిన సెల్ఫీ సరదా

మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం అయ్యవారిపల్లికి చెందిన యశోధ, కృష్ణయ్య దంపతుల కుమారుడు శివప్రసాద్‌ (23)తన పెదనాన్న కుమార్తె గీతామధుతో కలిసి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న దుందుభి వాగు వద్దకు వెళ్లాడు. ఒడ్డున నిలబడి స్వీయ చిత్రం తీసుకొంటుండగా.. ప్రమాదవశాత్తు కాలుజారి నీళ్లలో పడిపోయాడు. అక్కడ ఉన్నవారు ప్రయత్నించినా కాపాడలేకపోయారు. గ్రామస్థులు గాలించడంతో కొంతదూరంలో మృతదేహం లభించింది.

ఇదీ చదవండి: RAIN EFFECT: తడిసిముద్దయిన రాష్ట్రం.. మత్తడి దూకుతున్న చెరువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.