ఆదాయం పెంపు మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

author img

By

Published : Sep 20, 2022, 7:58 AM IST

Cabinet Subcommittee meeting

Cabinet Subcommittee meeting : ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే కసరత్తు వేగవంతం చేయాలని మంత్రివర్గం ఉపసంఘం అధికారులను ఆదేశించింది. పురోగతిని సమీక్షించిన సబ్‌కమిటీ.. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ఫలితాలు, ఉన్న ఇబ్బందులపై చర్చించింది. విక్రయించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తి చేయాలని సూచించింది. గనుల వేలానికి సంబంధించిన విధివిధానాలు వీలైనంత త్వరగా ప్రకటించాలని అధికారులకు మంత్రులు స్పష్టం చేశారు.

ఆదాయం పెంపు మార్గాలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు

Cabinet Subcommittee meeting : ఆదాయవనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మరోదఫా సమావేశమైంది. ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో జరిగిన సమావేశంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కోత, ఆంక్షల నేపథ్యంలో.. ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేలా ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది.

Source of Revenue for TS : ఇటీవల శాసనసభ వేదికగా కూడా మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, వాటి పురోగతి, వచ్చిన ఆదాయం గురించి మంత్రులు ఆరా తీశారు. ప్రక్రియలో ఉన్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఎక్సైజ్, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ఆదాయం, పరిస్థితులను అధికారులు సమావేశంలో వివరించారు.

నిరుపయోగంగా ఉన్న భూముల విక్రయం: నిరుపయోగంగా ఉన్న భూముల విక్రయం, పురోగతిని తెలుసుకున్నారు. బాహ్య వలయ రహదారి టోల్​కు సంబంధింటి టీఓటీ పద్ధతి అమలుపై చర్చించారు. రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం పురోగతిని సమీక్షించారు. వేలం పూర్తైనప్పటికీ సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్లు పూర్తి కానందున ప్రభుత్వానికి ఇంకా డబ్బు అందలేదు. ఇబ్బందులను అధిగమించి రిజిస్ట్రేషన్ల ప్రక్రకియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

గృహనిర్మాణ సంస్థకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న భూములను హెచ్​ఎండీఏతో కలిసి లేఅవుట్లుగా అభివృద్ధి చేసే విషయమై సమావేశంలో చర్చ జరిగింది. అజామాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో భూముల క్రమబద్దీకరణ అంశం మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన చట్టసవరణ బిల్లు ఇటీవలే ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రులు ఆదేశించారు.

అయితే ఈ విషయంలో న్యాయస్థానం తీర్పును పరిగణలోకి తీసుకొని తగిన ధరను ఖరారు చేయాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. కొత్త గనుల విధానానికి ఇప్పటికే మంత్రివర్గ ఆమోదం లభించినందున అందుకు అనుగుణంగా విధివిధానాలను వీలైనంత త్వరగా ఖరారు చేసి విడుదల చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. తద్వారా గనుల వేలం ప్రక్రియ చేపట్టవచ్చని, ఖజానాకు డబ్బు సమకూరుతుందని తెలిపారు.

ల్యాండ్ పూలింగ్: ల్యాండ్ పూలింగ్ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఒక విధానాన్ని రూపొందించాలన్న మంత్రులు... తదుపరి సమావేశంలో దానిపై చర్చిద్దామని అన్నట్లు తెలిసింది. నిధుల సమీకరణకు సంబంధించి ఇప్పటికే చేపట్టిన చర్యలను వేగవంతం చేసి కసరత్తు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.