8 గంటల పాటు ఎగిసిపడ్డ అగ్నికీలలు.. ఎట్టకేలకు శాంతించిన మంటలు

author img

By

Published : Jan 19, 2023, 7:46 PM IST

Updated : Jan 20, 2023, 6:36 AM IST

Etv Bharat

సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం... జంటనగరాల్లో మరోసారి తీవ్ర అలజడి రేపింది. నల్లగుట్ట ప్రాంతంలో ఓ వ్యాపార సముదాయం సెల్లార్‌లోని దుకాణం నుంచి వెలువడిన మంటలు, పొగలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. కనుచూపు మేరల్లోనూ కనిపించలేనంతగా పొగ అలుముకుంది. గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. పక్క భవనాలకూ అగ్నికీలలు విస్తరించటంతో ఒకటి కాదు రెండు కాదు 22కి పైగా ఫైరింజన్లొచ్చినా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎంతకీ అదుపులోకి రాని మంటలతో చివరకు సహాయక సిబ్బందే స్పృహ తప్పిన పరిస్థితి. ప్రమాద సమయంలో భవనంలో చిక్కుకున్న నలుగురిని కాపాడినా...మరో ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు.

8 గంటల పాటు ఎగిసిపడ్డ అగ్నికీలలు.. ఎట్టకేలకు శాంతించిన మంటలు

Secunderabad fire accident Updates ‍సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. అయిదు అంతస్తుల భవనం, పెంట్‌హౌజ్‌లో డెక్కన్‌ నైట్‌వేర్‌ పేరిట క్రీడా సామగ్రి, బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే మంటలు వ్యాపించాయి. సెల్లార్‌లోని గోదాంలో పొగలు వ్యాపించాయి. క్రమ క్రమంగా మంటలు చెలరేగాయి. మంటలు అయిదు అంతస్తుల భవనంతో పాటు పెంట్‌ హౌజ్‌కు విస్తరించాయి. సమీపంలోని మరో నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటన స్థలంలో 22 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఏడున్నర గంటల పాటు శ్రమించి.. ఎట్టకేలకు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

ఇదీ జరిగింది... గతేడాది మార్చి, సెప్టెంబర్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఘోర అగ్నిప్రమాదాలు మరువక ముందే సికింద్రాబాద్‌లో మరో ఘటన నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. నల్లగుట్ట ప్రాంతంలో ఉన్న ఓ ఐదంతస్తులో భవనంలోని సెల్లార్‌ను కార్ల విడిభాగాలకు సంబంధించిన గోదాముగా వినియోగిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వస్త్ర దుకాణం ఉండగా... మొదటి అంతస్తులో డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణం కొనసాగుతోంది. పైమూడంతస్తులను వివిధ రకాల వస్తువులతో గోదాములుగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉదయం పదిన్నర గంటలకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ తెరుచుకున్న పదినిమిషాల్లోపే స్వల్పంగా మొదలైన మంటలు... క్షణాల్లోనే పెద్దఎత్తున వ్యాపించాయి. తొలుత చిన్న ప్రమాదంగా భావించినప్పటికీ.... ఒక్కసారిగా భవనమంతా అలుముకున్న పొగ, ఎగిసిపడుతున్న మంటలతో వివిధ అంతస్తుల్లో ఉన్న వారంతా బయటికి పరుగులు తీశారు. ఈ క్రమంలో కాసేపు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానికుల సమాచారంతో వెంటనే మూడు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకోగా... అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

భవనంలో క్రమంగా వ్యాపించిన మంటలు... పెద్దఎత్తున ఎగిసిపడి, పైఅంతస్తులకు వ్యాపించాయి. కార్ల విడిభాగాల గోదాము, వస్త్ర దుకాణం నుంచి మొదటి అంతస్తుల్లో ఉన్న క్రీడాసామాగ్రి దుకాణంతో పాటు పైనున్న అన్ని అంతస్తులకు అంటుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన భవనంలోని ఐదో అంతస్తులో ముగ్గురు, రెండో అంతస్తులో మరో వ్యక్తి చిక్కుకుపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వెంటనే స్కైలిఫ్ట్‌ను ఘటనాస్థలికి రప్పించి.... సహాయక చర్యలు చేపట్టారు. దట్టంగా అలుముకున్న పొగ కారణంగా.... పైనున్న వారిని దించటం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. అయినప్పటికీ తీవ్రంగా శ్రమించి, అతి కష్టంమీద భవనంలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చారు. మరో ఇద్దరు వ్యక్తులు భవనంలోనే ఉండిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఫోన్‌ చేసినా... స్పందించకపోవటంతో.... వారిని గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తొలుత మూడు ఫైరింజన్లు మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. మరో మూడింటిని ఘటనాస్థలికి తెప్పించి...ఆరు పైరింజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించినా...గంటల తరబడిగా పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. మొత్తం 22 ఫైరింజన్లు, వందలాది మంది అగ్నిమాపక, డీఆర్ఎఫ్‌, స్థానిక పోలీసులు, జీహెచ్‌ఎంసీ, 108 సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనా.... మంటలు అదుపులోకి రాకపోగా.... అంతకంతకూ ఎక్కువవుతూ వచ్చాయి. దట్టంగా అలుముకున్న పొగతో పలువురు సహాయక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు.

మంటల ఉద్ధృతికి భవనం సమీపంలోకి వెళ్లే పరిస్థితులు లేకపోవటంతో సహాయచర్యలకు విఘాతం ఏర్పడింది. భవనం లోపల నుంచి పేలుడు శబ్ధాలు రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల ఇళ్ల నుంచి గ్యాస్‌ సిలిండర్లను ముందుగా తరలించారు. అనంతరం భవనం పక్కనున్న కాచీబౌలి కాలనీతో పాటు మరిన్ని ప్రాంతాల్లోని వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఏ క్షణమైనా భవనం కూలిపోయే అవకాశం ఉండటంతో.... ఆ దిశగా అప్రమత్త చర్యలు చేపట్టారు. పొగ కారణంగా చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరవుతుండటంతో.... పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ సంచాలకులు విశ్వజిత్‌ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. భవనం కూలినా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రమాదం జరిగిన ప్రాంతాలను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రమాద తీరును తెలుసుకున్న మంత్రులు.... సహాయక చర్యల గురించి ఆరా తీశారు. ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. ప్లాస్టిక్‌ వస్తువులు, రసాయనాల కారణంగానే మంటలు పెద్దఎత్తున వ్యాపించాయన్న హోంమంత్రి ... మంటలు ఆరిపోయిన తర్వాత ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. భవిష్యత్తులో ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అగ్నిప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియట్లేదు. ప్లాస్టిక్‌ వస్తువులు, రసాయనాల వల్లే మంటలు.. ఎగిసి పడ్డాయి. మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకున్నాం. మంటలు తగ్గిన తర్వాత ఘటనపై విచారణ జరిపిస్తాం. భవిష్యత్తులో ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. - మహమూద్‌ అలీ, హోం మంత్రి

''ప్రభుత్వం చర్యలు చేపడితే అక్రమంగా కొనసాగే 25 వేల దుకాణాలు ఖాళీ చేయించాల్సి ఉంటుంది. భారీ స్థాయిలో దుకాణాలు తరలిస్తే వ్యాపారులు ఆందోళన చేస్తారు. ఆందోళనలు చేస్తారని భయపడి ఊరుకునేది లేదు. అక్రమ గోదాంలు, దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.'' - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్‌ ప్రాంతంలో గతంలో జరిగిన రూబీ హోటల్‌ ప్రమాదం, బోయగూడ ఐడీహెచ్‌ కాలనీలోని టింబర్‌ డిపోలో కొన్ని నెలల క్రితం జరిగిన ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అదే స్థాయిలో సికింద్రాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ప్రమాదంలో ప్రాణనష్టం విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోయినా..... పెద్దఎత్తున ఆస్తినష్టం మాత్రం సంభవించింది.

ఇవీ చూడండి:

Last Updated :Jan 20, 2023, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.