చివరి దశకు చేరుకున్న నామినేషన్ల ప్రక్రియ - పార్టీ గుర్తులు కేటాయించే పనిలో అధికారులు

చివరి దశకు చేరుకున్న నామినేషన్ల ప్రక్రియ - పార్టీ గుర్తులు కేటాయించే పనిలో అధికారులు
Election Commission Awareness Programs in Telangana : రాష్ట్రంలో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ చివరి స్థాయికి చేరుకుంది. అధికారులు ఆయా పార్టీలకు గుర్తులను కేటాయించే పనులో నిమగ్నమయ్యారు. ఈ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు ఈసీ.. అధికారులకు అవగాహన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపడుతోంది. అయితే ప్రధాన పార్టీ గుర్తుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
Election Commission Awareness Programs in Telangana : శాసనసభ ఎన్నికల సమరం కీలక అంకానికి చేరింది. నామినేషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తైంది. నేటితో ఉపసంహరణల గడువు ముగియనుంది. ఉపసంహరణల గడువు ముగిసిన అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి బ్యాలెట్ పత్రాన్ని అధికారులు ఖరారు చేయనున్నారు. పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో హోరాహోరీగా తలపడనున్నారు. అధికారులు ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.
గత అనుభవాలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రతి దశ, ప్రతి ప్రక్రియను నిశితంగా గమనిస్తోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎక్కడా, ఎలాంటి సమస్యలు రాకుండా ఈసీ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫిర్యాదులు వచ్చినా.. ప్రతికూల సమాచారం వచ్చినా వెంటనే క్షేత్రస్థాయి నుంచి నివేదికలను అధికారులు తెలుసుకుంటున్నారు. నివేదికలు, వివరణలు నిర్ధిష్ట గడువులోగా అందేలా అధికారులను అప్రమత్తం చేసి.. వాటిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఈసీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా వరకు పార్టీలు, అభ్యర్థులు తమ ఫిర్యాదులను వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా ఈసీకి కూడా పంపుతున్నారు. వాటిపై నిర్ధిష్ట గడువులోగా స్పందించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు(EC Orders to Officials) జారీ చేసింది. రాష్ట్ర అధికారులు కూడా ఎన్నికల నిర్వహణా ప్రక్రియలో తప్పులు లేకుండా వీలైనంత మేర జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
EC Giving Instructions to Officials on Elections : జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు పలు దశలుగా ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు ముందే అన్ని అంశాలపై విస్తృతంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. మళ్లీ ప్రతి దశకు ముందు కూడా వారికి సంబంధించి అంశాలపై అవగాహన ఇస్తున్నారు. నోటిఫికేషన్కు ముందు నామినేషన్ల స్వీకరణ, అఫిడవిట్లు, తదితర విషయాలపై విడిగా అవగాహన కల్పించారు.
Political Parties symbols in Telangana : నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థులకు నిర్ధిష్ట నిబంధనలకు లోబడి గుర్తులు కేటాయించి బ్యాలెట్ పత్రాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించిన గుర్తుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో వివాదాలు(Political Parties Symbols in Issue) తలెత్తే అవకాశం ఉంటుంది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంలో గుర్తు కేటాయింపు వివాదంలో ఆర్ఓతో పాటు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో అభ్యర్థుల వరుస క్రమం, గుర్తుల కేటాయింపు అంశంపై రిటర్నింగ్ అధికారులకు మరోమారు అవగాహన కల్పించేందుకు ఈసీ కార్యక్రమాలను చేపడుతోంది.
