Sabitha review on corona: 'కొన్నిచోట్ల స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం కనిపిస్తోంది'

author img

By

Published : Nov 29, 2021, 5:31 PM IST

Sabitha Indra reddy review on corona, covid cases in schools

పాఠశాలల్లో కరోనా కేసులు(covid cases in schools) నమోదవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సమీక్షించారు. కొన్నిచోట్ల స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం కనిపిస్తోందని వెల్లడించారు. కరోనా విస్తృతిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Sabitha review on corona cases in school: విద్యాసంస్థల్లో కొవిడ్‌ కలకలంపై ఆశాఖ అప్రమత్తమైంది. కరోనా విస్తృతిపై జాగ్రత్తగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొన్నిచోట్ల యాజమాన్యాల నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు. పాఠశాలలు, వసతిగృహాల్లో కరోనా పరిస్థితులపై శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. కొన్ని విద్యాసంస్థల్లో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయన్న మంత్రి.....విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

జాగ్రత్తలు అవసరం

school corona cases: పాఠశాలల్లో విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా... మాస్కు తప్పక ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించాలని... వసతిగృహాలు, గురుకులాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాలని నిర్దేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదన్న మంత్రి... శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్ మిషన్లు తప్పక వాడాలని ఆదేశించారు.

గురుకులాల్లో పెరుగుతున్న కేసులు

Muthangi gurukul school Covid-19 Cases : సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆదివారం 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి వైరస్‌ నిర్ధరణకాగా... సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో మరో ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 48కి చేరింది. పాఠశాలలో విద్యార్థులందరికీ నిర్ధరణ పరీక్షలు పూర్తయినట్లు వైద్యశాఖ సిబ్బంది తెలిపారు.

హాస్టల్​లోనే క్వారంటైన్..

పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం హైదరాబాద్​కు పంపించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండటంతో.. హస్టల్​లోనే క్వారెంటైన్​లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇటీవల మరో గురుకుల పాఠశాలలో కేసులు

corona cases in wyra gurukul school : ఇటీవలె మరో గురుకుల పాఠశాలలోనూ కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనా కలకలం రేగింది. 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ లక్ష్మి... విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. తొలుత 13 మందికి పాజిటివ్ రాగా... ఆ తర్వాత మరో 14 మందికి సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళ్లారు.

ఇదీ చదవండి: Telangana Cabinet Meeting: కొనసాగుతున్న కేబినెట్​.. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, కొవిడ్​పై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.