డాక్టర్‌ డుమ్మా: సర్కారీ జీతం తీసుకుంటున్నా.. వైద్యుల ధ్యాసంతా 'ప్రైవేటు'పైనే

author img

By

Published : Nov 24, 2022, 8:16 AM IST

Doctors who do not come to government hospitals

మౌలిక సదుపాయాలున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు అరకొరగా మాత్రమే లభ్యమవుతున్నాయి. సర్కారీ జీతం తీసుకుంటున్నా.. వైద్యుల ధ్యాసంతా ప్రైవేటు ప్రాక్టీసుపైనే ఉంటోంది. బోధనాసుపత్రుల్లో సేవలు మరీ తీసికట్టుగా ఉన్నాయని వైద్యశాఖ తేల్చింది.

ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక న్యూరో సర్జన్‌ కొత్తపేటలోని కార్పొరేట్‌ ఆసుపత్రి, చైతన్యపురిలోని ఓ క్లినిక్‌, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఉస్మానియాలో విధులు నిర్వర్తించాల్సిన సమయాన్నే ప్రైవేటు వైద్యానికి కేటాయించడం గమనార్హం. ఉస్మానియాలోనే పనిచేస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ కాచిగూడ, బర్కత్‌పుర, కర్మన్‌ఘాట్‌ తదితర చోట్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాగే పనిచేస్తున్నారు. ఈ విషయాలను ప్రభుత్వ నిఘా వర్గాలే నిగ్గు తేల్చాయి. ఇలా ప్రైవేటు సేవలో తరిస్తున్న 28 మంది వైద్యులపై సర్కారుకు కొద్దిరోజుల కిందట నివేదిక అందింది.

వైద్యుల్లో సేవాభావం కొరవడితే.. వ్యవస్థంతా అస్తవ్యస్తమవుతుంది. ఉస్మానియా, గాంధీ సహా పలు ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్నదిదే. కొంతమంది వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉన్నా.. అలా చేయడంలేదు. వారి ధ్యాసంతా ప్రైవేటు ప్రాక్టీసుపైనే ఉంటోంది. సర్కారు ఆసుపత్రుల్లో విధులకు పూర్తిగా గైర్హాజరు కావడమో.. నామమాత్రంగా వచ్చి వెళ్లడమో చేస్తున్నారు. వైద్యమంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తరచూ నిశితంగా సమీక్షిస్తున్నా.. కొన్ని విభాగాల్లో పురోగతి కనిపించడం లేదు. అక్టోబరు నెల సమీక్షలో కొన్ని విభాగాల పనితీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

దాదాపు అన్ని విభాగాల్లోనూ తూతూమంత్రపు సేవలే అందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్డియాలజీ, కార్డియో థొరాసిక్‌, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ విభాగాల్లో పనితీరు మరీ తీసికట్టుగా ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో సాధారణంగా ఒక్కో విభాగంలో 3 నుంచి 8 యూనిట్ల వరకు ఉన్నాయి. ఉదాహరణకు జనరల్‌ మెడిసిన్‌ విభాగాన్ని తీసుకుంటే.. గాంధీ వైద్యకళాశాలలో 8 యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్‌లో 8 మంది వైద్యులున్నారు. పీజీలను కూడా కలిపితే.. సుమారు 70 మంది వైద్యులున్నారు. కానీ రోజూ కేవలం ఒక్క యూనిట్‌ వైద్యులు మాత్రమే ఓపీలో ఉంటారు. గాంధీ ఆసుపత్రిలో నిత్యం జనరల్‌ మెడిసిన్‌ ఓపీకి సుమారు 200 మంది రోగులొస్తుంటే.. వీరిని 8 మంది వైద్యులు పరీక్షిస్తుంటారు. మిగిలిన ఏడు యూనిట్ల వైద్యులు ఓపీ వైపు రారు. వీటిలో కొన్ని యూనిట్ల వైద్యులు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు, మరికొందరికి పీజీ వైద్యవిద్యార్థులకు తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇంకొన్ని యూనిట్ల వైద్యులు తమ వార్డుల్లో రోగులను పరీక్షిస్తారు. యూనిట్ల సంఖ్య అధికంగా ఉన్నందున.. ఓపీకి మరికొంతమందిని కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కార్పొరేట్‌, సర్కారు ఆసుపత్రులకు తేడా ఇదీ.. 300 పడకలున్న కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఉదయం 8 నుంచి రాత్రి 9-10 గంటల వరకు వైద్యులు పనిచేస్తుంటారు. ఉదాహరణకు నలుగురు కార్డియాలజిస్టులు, ఒకటే క్యాథ్‌ల్యాబ్‌ ఉంటే.. ఆ ల్యాబ్‌ను నలుగురూ తమ రోగులకు వేర్వేరు సమయాల్లో చికిత్స అందించేలా కార్యాచరణను అమలు చేస్తారు. తద్వారా ల్యాబ్‌ 24 గంటలూ పనిచేస్తుంది. ఒక్క ల్యాబ్‌ మాత్రమే ఉన్నా.. నెలకు 300 యాంజియోగ్రాములు, 100 యాంజియోప్లాస్టీలు చేస్తుంటారు. బైపాస్‌ సర్జరీలు కూడా నెలకు 125 వరకు అవుతాయి. ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం ఉదయం 10 గంటలకొచ్చి మధ్యాహ్నం 2 గంటలకు ముందే వెళ్లిపోతుండడంతో అతి తక్కువ సంఖ్యలో చికిత్సలు నమోదవుతున్నాయి.

ఆసుపత్రుల్లో విభాగాల పనితీరు ఇలా..

నెఫ్రాలజీ:

  • నిమ్స్‌: 12 మంది నెఫ్రాలజిస్టులు, 30 మంది పీజీలు ఉండగా.. కనీసం నెలకు 10 చొప్పున మూత్రపిండాల మార్పిడి చేస్తారు.
  • ఉస్మానియా: నలుగురు నెఫ్రాలజిస్టులు, 10 మంది పీజీలుండగా.. అక్టోబరులో కేవలం ఒక్క కిడ్నీ మార్పిడి మాత్రమే చేశారు. ఆగస్టు, సెప్టెంబరుల్లోనూ ఒక్కొక్కటి చేశారు.
  • గాంధీ: నలుగురు నెఫ్రాలజిస్టులు, 8 మంది పీజీలుండగా.. గత నెలలో కేవలం 3 కిడ్నీ మార్పిడులు చేశారు.

న్యూరో సర్జరీ:

  • నిమ్స్‌: 10 మంది న్యూరో సర్జన్లు, ఒక సీనియర్‌ రెసిడెంటు, 18 మంది పీజీలుండగా.. నెలకు 220 చొప్పున మేజర్‌ సర్జరీలు చేస్తారు.
  • గాంధీ: ఆరుగురు న్యూరో సర్జన్లు, ఇద్దరు సీనియర్‌ రెసిడెంట్లు, 8 మంది పీజీలుండగా.. అక్టోబరులో 119 మేజర్‌ సర్జరీలు చేశారు.
  • ఎంజీఎం: ఆరుగురు న్యూరో సర్జన్లు, ఆరుగురు పీజీ వైద్యులుండగా.. గత నెలలో 11 మేజర్‌ సర్జరీలు మాత్రమే చేశారు.
..

చిత్రంలో కనిపిస్తున్నది ఉస్మానియాలో రూ.7 కోట్లతో నెలకొల్పిన అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌. ఇక్కడ అయిదుగురు కార్డియాలజిస్టులు, 14 మంది పీజీ వైద్యులు ఉన్నారు. ఈ ల్యాబ్‌లో ‘3 డి ఇమేజ్‌’, ‘ఫ్రాక్షనల్‌ ఫ్లో రిజర్వు’ సౌకర్యాలున్నాయి. అంటే గుండె రక్తనాళాల్లో 50-60 శాతం పూడికలు ఏర్పడితే.. స్టెంట్‌ వేయాలా వద్దా అనేది గుర్తించడానికి ‘ప్రెజర్‌ వైర్‌’ను వాటి వద్ద పెడతారు. గుండె కవాటాల మార్పిడి, మరమ్మతులు, పేస్‌మేకర్‌ అమర్చడం, గుండె చుట్టూ నీరు చేరడం (పెరికార్డియల్‌ ఎఫ్యూజన్‌) వంటి వాటికి చికిత్సలు కూడా ఇందులోనే చేయడానికి అవకాశముంది. చేతులు, కాళ్లలోని రక్తనాళాల్లో, క్లోమగ్రంధిలోనూ కొన్నిసార్లు స్టెంట్లు వేయాల్సి వస్తుంది. వీటిని కూడా ఈ క్యాథ్‌ల్యాబ్‌లో చేయొచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ల్యాబ్‌లో అక్టోబరు నెలలో కేవలం 90 యాంజియోగ్రామ్‌లు (రోజుకు సగటున 3 చొప్పున), 51 యాంజియోప్లాస్టీలు (రోజుకు సగటున 2 కంటే తక్కువగా) చేశారు.

గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు కార్డియాలజిస్టులు, ఆరుగురు పీజీలుండగా.. అక్కడ అక్టోబరులో 150 యాంజియోగ్రామ్‌లు. 31 యాంజియోప్లాస్టీలు నిర్వహించారు. వరంగల్‌ ఎంజీఎంలో నలుగురు కార్డియాలజిస్టులు, ఇద్దరు సీనియర్‌ రెసిడెంట్లు ఉండగా.. ఇక్కడ గత నెలలో 96 యాంజియోగ్రామ్‌లు.. 25 యాంజియోప్లాస్టీలు మాత్రమే చేశారు. అదే నిమ్స్‌లో 8 మంది కార్డియాలజిస్టులు, ముగ్గురు సీనియర్‌ రెసిడెంట్లు ఉండగా.. నెలకు 750 యాంజియోగ్రామ్‌లు (రోజుకు 25), 300 యాంజియోప్లాస్టీలు (రోజుకు 10) చొప్పున చేస్తున్నారు. నిమ్స్‌లో ఉన్నదీ.. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం ఆసుపత్రుల్లో లేనిది.. కేవలం వైద్యుల అంకితభావమే!

ప్రముఖ ఆసుపత్రుల్లో కొన్ని విభాగాల పనితీరు ఇలా..

కార్డియో థొరాసిక్‌ సర్జరీ..

  • నిమ్స్‌: ఏడుగురు కార్డియో థొరాసిక్‌ సర్జన్లు, 8 మంది సీనియర్‌ రెసిడెంట్లు ఉండగా.. నెలకు సుమారు 50 వరకు బైపాస్‌ సర్జరీలు, 90 మేజర్‌ సర్జరీలు చేస్తున్నారు.
..
  • ఉస్మానియా: ఒక్క సీటీ సర్జన్‌, ఒక పీజీ వైద్యుడు ఉండగా.. గత మూడు నెలలుగా ఒక్క బైపాస్‌ సర్జరీ, ఒక్క మేజర్‌ సర్జరీ కూడా చేయలేదు.
  • గాంధీ: ముగ్గురు సీటీ సర్జన్లు, ఒక పీజీ వైద్యుడు ఉండగా.. అక్టోబరు నెలలో కేవలం 8 బైపాస్‌ సర్జరీలు చేశారు. మేజర్‌ సర్జరీలు 10 చేశారు.
  • ఎంజీఎం: ఇద్దరు కార్డియో థొరాసిక్‌ సర్జన్లు, ఒక పీజీ వైద్యుడు ఉండగా.. అక్టోబరులో రెండు బైపాస్‌ సర్జరీలు, రెండు మేజర్‌ సర్జరీలు మాత్రమే చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.