DH srinivas on omicron variant: 'సంక్రాంతి తర్వాత థర్డ్​ వేవ్​.. బీ అలర్ట్​'

author img

By

Published : Dec 30, 2021, 12:13 PM IST

Updated : Dec 30, 2021, 1:51 PM IST

omicron variant in telangana

12:11 December 30

వచ్చే 3, 4 వారాలు అత్యంత కీలకం: డీహెచ్ శ్రీనివాసరావు

కేసుల పెరుగుదల మూడో వేవ్​కు సంకేతం: డీహెచ్​

omicron variant in telangana: కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస రావు స్పష్టం చేశారు. 2, 3 రోజుల నుంచి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని.. కేసుల పెరుగుదల మూడో దశకు సంకేతమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కరోనా వ్యాప్తి, కట్టడికి కీలకమని డీహెచ్​ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ మూడో వేవ్​కు ప్రారంభమని.. రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని వెల్లడించారు. కేసులు పెరిగినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఒమిక్రాన్​ సోకిన వారిలో 90 శాతం లక్షణాలు లేవని వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా సామాజిక వ్యాప్తి చెందుతోందని.. డెల్టా వేరియంట్ కంటే ఇది 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు.

టీకాతో రక్ష

వచ్చే 2-4 వారాలు అత్యంత కీలకం. దాదాపు 90 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదు. టీకా తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలి. నూతన సంవత్సర వేడుకల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సంక్రాంతి తర్వాత మూడో దశ ప్రారంభానికి అవకాశం ఉంది. - డా. శ్రీనివాస రావు, ప్రజారోగ్య సంచాలకులు

మూడో దశతో కొవిడ్​కు ఫుల్​స్టాప్​

DH on omicron variant: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని డీహెచ్​ అన్నారు. అమెరికాలో 4 లక్షలకు పైగా, ఫ్రాన్స్‌లో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని.. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ఒమిక్రాన్ విస్తరిస్తోందని వివరించారు. దేశంలోనూ రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. కొత్త వేరియంట్​ సోకిన వారిలో లక్షణాలు కనిపించకపోవడంతో.. ఐసోలేషన్ సమయాన్ని కూడా కొన్ని దేశాలు తగ్గించాయని డీహెచ్​ పేర్కొన్నారు. ఒక శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా... భారీ మొత్తంలో ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. మూడో దశతో కొవిడ్​ నుంచి విముక్తి లభించే సూచనలున్నాయని అభిప్రాయపడ్డారు.

సమూహ వేడుకలు వద్దు

జాతీయ స్థాయిలో ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో ఉండటం పట్ల డీహెచ్​ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్​తో మరణించిన వారి కుటుంబాలకు డీహెచ్​ సానుభూతి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలతో ఒమిక్రాన్ వ్యాప్తికి అవకాశం ఉందన్న డీహెచ్​.. ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యుల మధ్యనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. వేరియంట్‌ ఏదైనా మాస్క్‌, టీకా మాత్రమే రక్షణ కల్పిస్తాయని డీహెచ్​ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: దేశంలో ఒమిక్రాన్ కలవరం... వేగంగా సామాజిక వ్యాప్తి

Last Updated :Dec 30, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.