Vaccination: డిసెంబరు నాటికి రెండు డోసుల వ్యాక్సినేషన్​ పూర్తి చేస్తాం: డీహెచ్​

author img

By

Published : Oct 21, 2021, 7:11 AM IST

dh srinivasa rao

కరోనా టీకా రెండు డోసులూ పొందితేనే మహమ్మారి నుంచి రక్షణ ఉంటుందని డీహెచ్​ శ్రీనివాస రావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. డిసెంబరు నాటికి రెండు డోసుల వ్యాక్సినేషన్​ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. చిన్నపిల్లలకూ మరో 2,3 వారాల్లో వ్యాక్సినేషన్​ ప్రారంభిస్తామని.. అందుకు సంబంధించి కొవాగ్జిన్​కూ అనుమతి లభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో వివరించారు.

కొవిడ్‌ టీకా పొందడంలో అర్హులు నిర్లక్ష్యం వహించడం తగదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలో తొలి డోసు స్వీకరించి, రెండో డోసు పొందనివారు 36.35 లక్షల మంది ఉన్నారని.. రెండు డోసులూ పొందితేనే కొవిడ్‌ నుంచి రక్షణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేసులు తక్కువగా నమోదవుతుండటంతో.. కరోనా ఇక కనుమరుగు అయిపోయిందనే భావనతో దాదాపు 80 శాతం మంది మాస్కులు ధరించడం లేదని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. హైదరాబాద్‌ కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

50 లక్షల టీకా డోసుల నిల్వ

‘రాష్ట్రంలో ఒకట్రెండు రోజుల్లో మూడు కోట్ల డోసుల టీకాల పంపిణీ ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటివరకూ 75 శాతం మంది మొదటి డోసు పొందగా.. 39 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50 లక్షల డోసులు నిల్వ ఉన్నాయి. రెండు డోసులు టీకా తీసుకున్నవారిలో 5 నుంచి 10 శాతం మందికి మాత్రమే కొవిడ్‌ సోకే అవకాశాలున్నాయి. తొలి డోసు మాత్రమే పొందినవారిలో 30 శాతం మందికి వైరస్‌ వచ్చేందుకు అవకాశాలుండగా.. అసలు టీకాలే తీసుకోనివారిలో 60 శాతం మందికి సోకుతున్నట్లుగా అధ్యయనాల్లో వెల్లడైంది. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోసు కూడా తీసుకోలేదు. అర్హులైన వారందరూ టీకాలకు ముందుకు రావాలి. రష్యా, యూకేల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అక్కడ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. యూకేలో కొత్త వేరియంట్‌ వచ్చిందని చెబుతున్నారు. మన దగ్గర దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనల్ని కాపాడుతున్నది వ్యాక్సిన్‌ మాత్రమే.

-డీహెచ్ శ్రీనివాస రావు, ప్రజారోగ్య సంచాలకులు

డిసెంబరు నాటికి అర్హులకు వ్యాక్సిన్‌

రాష్ట్రంలో కొవిడ్‌ అదుపులో ఉందని.. పాజిటివ్‌ కేసులు 0.4 శాతం మాత్రమే నమోదవుతున్నాయని డీహెచ్​ అన్నారు. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే రేటు కూడా 0.7గానే ఉందని చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది పిల్లలకు వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్న ఆయన.. చిన్న పిల్లలకు వచ్చే రెండు, మూడు వారాల్లో వాక్సినేషన్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 2 నుంచి 18 ఏళ్ల వారికి టీకాను అందజేసేందుకు ఇప్పటికే జైడస్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. త్వరలో భారత్‌ బయోటెక్‌ వారి కొవాగ్జిన్‌కు కూడా చిన్నారుల కోసం అనుమతులు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. వచ్చే డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బూస్టర్‌ డోసుకు సంబంధించి భారత్‌లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని. భవిష్యత్తులో ఇచ్చే అవకాశం మాత్రం ఉందని తెలిపారు.

ఆయన ఇటీవల ఒక కార్యక్రమంలో మాస్కు ధరించకుండా పాల్గొన్న అంశాన్ని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మాస్కుపై చర్చ జరగాలనే ఉద్దేశంతోనే రెండుసార్లు ధరించలేదు. మాస్కు వేసుకోకుంటే జరిగే ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఇలా చేశాను. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి’’ అని కోరారు.

100 శాతం లక్ష్యం..

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనీసం ఒక్క డోసు టీకా పంపిణీని 100 శాతం అమలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే తొలి డోసు స్వీకరించిన వారికి రెండో డోసును ఇప్పించే దిశగా ప్రణాళికలు రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 10 ఉమ్మడి జిల్లాలకు నోడల్‌ అధికారులను నియమించింది. ఆదిలాబాద్‌కు రవీంద్రనాయక్‌, హైదరాబాద్‌కు అమర్‌సింగ్‌, ఖమ్మంకు మోజీరామ్‌ రాఠోడ్‌, మహబూబ్‌నగర్‌కు జాన్‌బాబు, వరంగల్‌కు శ్రీనివాస్‌, కరీంనగర్‌కు రాజేశం, నల్గొండకు పద్మజ, నిజామాబాద్‌కు పుష్ప, మెదక్‌కు సరస్వతి, రంగారెడ్డికి రజినీరెడ్డిలను నియమిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు.

ఇదీ చదవండి: KRMB GRMB Gazette Notification: గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతిపై నేడో, రేపో సమీక్ష..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.