పెళ్లి వాయిదా.. అడ్వాన్స్‌ తిరిగివ్వని కె.కె.కన్వెన్షన్‌.. తర్వాత ఏమైందంటే?!

author img

By

Published : May 14, 2022, 10:27 AM IST

కన్వెన్షన్​ హాల్​కు రూ.90 వేలు, కలర్స్​కు రూ.28,500, ఏసీ కంపెనీకి రూ.1 లక్ష

కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లికి అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఒకరు.. బరువు తగ్గిస్తామంటూ అశాస్త్రీయ పద్ధతులతో ఇబ్బందులకు గురి చేశారంటూ మరొకరు.. ఏసీ మరమ్మతుల్లో టెక్నీషియన్లు చేసిన పొరపాటుతో వేసవి కాలమంతా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరయ్యామంటూ ఇంకొకరు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. ఆయా కేసుల్లో కమిషన్​ ఆసక్తికర తీర్పులను వెలువరించింది.

కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లికి అడ్వాన్స్‌ డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన కె.కె.కన్వెన్షన్‌ 7 బాంకెట్‌హాల్‌ తీరుపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. డబ్బు రూ.90 వేలు, కేసు ఖర్చులు రూ.5 వేలు, 45 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించింది. తాండూరు మండలం అల్లాపూర్‌ గ్రామానికి చెందిన పటేల్‌ వెంకట మల్లారెడ్డి ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. తన చెల్లెలి పెళ్లి కోసం కన్వెన్షన్‌హాల్‌ను రూ.లక్ష అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకున్నాడు. కరోనాతో పెళ్లి వాయిదా పడింది. డబ్బు తిరిగి ఇవ్వాలని మల్లారెడ్డి.. కన్వెన్షన్‌ యాజమాన్యాన్ని కోరారు. ఇవ్వకపోవడంతో ఆయన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

కలర్స్‌కు జరిమానా..

బరువు తగ్గిస్తామంటూ అశాస్త్రీయ పద్ధతులతో ఇబ్బందులకు గురి చేయడంతో పాటు చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో కలర్స్‌ తీరును రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ తప్పు పట్టింది. మియాపూర్‌కు చెందిన బాధితుడు సముద్రాల మహేందర్‌ చెల్లించిన రూ.28,500, 4 శాతం వడ్డీతో, కేసు ఖర్చులు రూ.3 వేలు, సికింద్రాబాద్‌కు చెందిన బాధితురాలు ఎం.లక్ష్మీరెడ్డికి రూ.23 వేలు, 6 శాతం వడ్డీతో రీఫండ్‌ చేయడంతో పాటు పరిహారం రూ.5 వేలు, కేసు ఖర్చులు రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది.

ఏసీ మరమ్మతుల్లో పొరపాటు.. అర్బన్‌ కంపెనీకి రూ.లక్ష జరిమానా..

ఏసీ మరమ్మతుల్లో టెక్నీషియన్లు చేసిన పొరపాటుతో వేసవి కాలమంతా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరయ్యామంటూ కూకట్‌పల్లికి చెందిన మాలాగార్గ్‌ చేసిన ఫిర్యాదులో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఆసక్తికర తీర్పు వెలువరించింది. పాడైన ఏసీలను తీసుకుని రూ.75 వేలు చెల్లించాలని.. మానసిక వేదనకు పరిహారంగా రూ.25 వేలు, కేసు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని మాదాపూర్‌కు చెందిన అర్బన్‌ కంపెనీని ఆదేశించింది. ఆర్‌-32 గ్యాస్‌కు బదులుగా, ఆర్‌-22 గ్యాస్‌ను నింపడంతోనే సమస్య ఉందని గుర్తించి.. సేవల్లో లోపం కలిగించడంతో పాటు వేసవిలో ఉక్కపోతలో ఉండేందుకు కారణమైనందుకు సదరు సంస్థ నుంచి పరిహారం ఇప్పించాలని ఫిర్యాదీ కోరారు. విచారించిన కమిషన్‌ బెంచ్‌ సాక్ష్యాధారాలు పరిశీలించి తీర్పు వెలువరించింది.

ఇవీ చూడండి..

'బుద్ధవనం' ప్రారంభం వాయిదా.. నేడు పార్కును సందర్శించనున్న కేటీఆర్

విగ్రహం కోసం వందల మంది ఘర్షణ.. అడ్డొచ్చిన పోలీసులపైనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.