CM KCR: దశల వారీగా రాష్ట్రమంతా దళితబంధు.. ఏటా బడ్జెట్​లో కేటాయింపులు

author img

By

Published : Sep 14, 2021, 4:22 AM IST

CM KCR: దశల వారీగా రాష్ట్రమంతా దళితబంధు.. ఏటా బడ్జెట్​లో కేటాయింపులు

దళితులను ఆర్థికంగా అభివృద్ధిపరిచి తరతరాలుగా వెంటాడుతోన్న ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలు కొట్టాలన్న అత్యున్నత ఆశయం, సామాజిక బాధ్యతగా నిర్ధిష్టమైన లక్ష్యంతో దళితబంధు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీల మనోభావాలు, ఆర్థిక అవసరాలు, స్థితిగతులు పరిశీలించడం ద్వారా.. విజయవంతంగా అమలు చేయాలన్న ధ్యేయంతోనే పథకాన్ని నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వాసాలమర్రి, హుజూరాబాద్ తరహాలోనే నాలుగు మండలాలకు కూడా రెండు, మూడు వారాల్లోనే దశల వారీగా నిధులు విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

ప్రతి దళిత కుటుంబ అభ్యున్నతే ధ్యేయంగా చేపట్టిన దళితబంధు పథకానికి దశలవారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయించుకొని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. వాసాలమర్రి, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పథకానికి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. కొత్తగా తెలంగాణలోని నాలుగు దిక్కుల్లో ఎంపిక చేసిన నాలుగు మండలాలకు రెండు మూడు వారాల్లో నిధులు విడుదల చేస్తామన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వివక్షకు గురవుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన దళితులను ఈ పథకం ద్వారా అధికారులు తల్లిదండ్రుల్లా ఆదుకోవాలన్నారు. మొదటిదశలో పథకం పటిష్ఠ అమలు, రెండో దశలో పకడ్బందీ పర్యవేక్షణ కీలకమన్నారు. దీనికి జిల్లా కలెక్టర్లు, దళితబంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుని కుటుంబానికీ ప్రత్యేక దళితబంధు బ్యాంక్‌ ఖాతా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో దళితబంధు కమిటీలుంటాయని, వీటిల్లో లక్ష మందికి పైగా దళిత బిడ్డలకు బాధ్యతలుంటాయని, వారే రీసోర్సుపర్సన్లుగా పనిచేస్తారన్నారు. దళిత జాతి అభివృద్ధిలో నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు.

వాసాలమర్రి, హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు కొత్తగా నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు అమలుపై సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం సన్నాహాక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దళితబంధు పథకాన్ని రాష్ట్రంలో నాలుగుదిక్కుల్లో ఉన్న మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చంపేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ, జుక్కల్‌ నియోజక వర్గంలోని నిజాంసాగర్‌ మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నాం.

డెయిరీ యూనిట్లకు ఎక్కువ స్పందన..
దళితబంధు పథకం కింద పాడిపరిశ్రమ (డెయిరీ) యూనిట్లకు స్పందన ఎక్కువగా వస్తున్నందున ఎస్సీల అభివృద్ధి, పశుసంవర్ధక శాఖ, ప్రభుత్వ సహకార డెయిరీల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం సగటున ఎన్ని పాలు వాడాలి? ప్రస్తుతం ఎంత వినియోగిస్తున్నారు? రాష్ట్రంలో పాల ఉత్పత్తి? బయటి రాష్ట్రాల నుంచి దిగుమతి ఎంత? అనే అంశాలపై సమీక్ష జరిపి దళితబంధులో డెయిరీ యూనిట్లను ప్రోత్సహించడానికి తగిన కార్యాచరణ రూపొందించాలి.

అన్ని వర్గాల అభ్యున్నతికి...
దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ ఒక దుష్ప్రచారమే. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించలేదు. బ్రాహ్మణులు తదితర అగ్రకులాల్లోని పేదలనూ గుర్తించి వారి అభివృద్ధికి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. కులం, మతం అనే తేడా లేకుండా రైతుబంధ]ు పథకాన్ని అన్ని వర్గాలకు ఇస్తున్నాం. ఒక్కొక్క రంగాన్ని, వర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నేడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ప్రతి దళిత కుటుంబం బాగుపడాలన్నదే మా ఆశయం. దీనిపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలి’’ అని సీఎం సూచించారు.

సలహాలు, సూచనలు...
ఈ సందర్భంగా నాలుగు జిల్లాల మంత్రులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలను కేసీఆర్‌ సేకరించారు. దళితబంధు పథకం ద్వారా ఆర్థికంగా దళిత జాతి నిలదొక్కుకునే చర్యలు తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీ‡ఆర్‌ చేపట్టిన ఈ పథకం.. దళితులను వ్యాపార వర్గంగా మలుస్తుందని సమావేశం విశ్వాసం వ్యక్తం చేసింది. సీఎం ఆలోచనలకు అనుగుణంగా తాము దళితబంధు విజయవంతానికి క్షేత్ర స్థాయిలో కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితునితుడిగా హాజరైన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ హుజూరాబాద్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులు, దళిత ప్రజల మనోభావాలను, అధికార యంత్రాంగం అనుభవాలను వివరించారు. సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, పువ్వాడ అజయ్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గువ్వల బాలరాజు, కాంగ్రెస్‌ పార్టీ శాసనసభానేత భట్టి విక్రమార్క, తెరాస ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, జైపాల్‌యాదవ్‌, హనుమంతు షిండే, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు కమల్‌రాజ్‌, శోభ, పద్మావతి, బంగారయ్య, దీపిక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సోమేశ్‌కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు,

ఇంత మంచి పథకం ఎవరూ పెట్టలేదు
‘నా రాజకీయ జీవితంలో పదిమంది సీఎంలను చూశా. దళితుల అభ్యున్నతికి ఇంత మంచి పథకాన్ని ఎవరూ పెట్టలేదు. దళితబంధు ప్రేమ బంధు.. కేసీఆర్‌ వంటి వారే ఇలాంటివి చేయగలరు. ఈ పథకం దేశంలో ఒక సంచలనం సృష్టిస్తుంది. ఇంతగొప్ప పథక నిర్ణయాల్లో నన్ను భాగస్వామిని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. గతంలో ప్రభుత్వాలు దళితులకు భిక్షం వేసినట్లుగా చిన్న చిన్న పథకాలు అమలు చేశాయి. ఒకేసారి రూ.10 లక్షలు ఎవ్వరూ ఇవ్వలేదు’’ అంటూ మోత్కుపల్లి నర్సింహులు సీఎంకు అభివాదం చేసి భావోద్వేగంతో మాట్లాడారు.

దళితబంధుతో విప్లవాత్మక మార్పు..

సీఎం కేసీఆర్‌ చేపట్టిన పథకం దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు నాంది పలకనుంది. ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’కి వందేళ్లు పూర్తికావస్తున్న సందర్భంలో దళితబంధు పథకం అమలు అహ్వానించదగ్గ పరిణామం. వనపర్తి సంస్థానాధీశుల నాటి కాలం నుంచి దళిత వర్గాల అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నా, సమగ్రాభివృద్ధికి తెలుగునేల మీద విప్లవాత్మక చర్యలు తీసుకున్న ఒకేఒక ప్రజాస్వామిక నేత కేసీఆర్‌. అగ్రకుల మేధావులు కూడా మద్దతివ్వాల్సిన చారిత్రక సందర్భమిది.

‘‘పాతిన వెలిశిల పాదులో ప్రగతి లిపి మొలిసింది
నరకబడ్డ చెట్ల వేర్లు నడక నేర్చుకుంటున్నవి
ఏ జాతుల జ్ఞానంతో భరత జాతి వెలిగిందో
ఏ చేతుల సలువ వల్ల ధరణి మైల తొలగిందో
ఆ వెలివాడల త్యాగాలకు ప్రతిరూపం అంబేడ్కర్‌
మలి వేకువ యాగానికి శ్రీకారం కేసీఆర్‌’’

- గోరటి వెంకన్న, కవి, ఎమ్మెల్సీ

దేశంలో ఎక్కడా లేదు..

‘ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకం దేశంలో ఎక్కడా లేదు. దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుకు నా నియోజకవర్గం (మధిర)లోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. సీఎం ఆలోచనల మేరకు మండలంలో దళితబంధు అమలు కోసం శాయశక్తులా కృషిచేస్తా. ప్రభుత్వం మంజూరు చేసే మెడికల్‌, ఎరువుల షాపులు, మీ సేవా కేంద్రాలు, వైన్‌, బార్‌షాపులు తదితర వాటిల్లో రిజర్వేషన్లు కేటాయించడం ఎస్సీలకు చాలా ఉపయోగపడుతుంది. పరిశ్రమల శాఖను కూడా ఈ పథకంలో భాగస్వామ్యం చేయాలని సీఎంను కోరా. - మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇదీ చూడండి: CM KCR REVIEW: 'వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.