CM KCR on Drugs: 'డ్రగ్స్ నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు'

author img

By

Published : Jan 29, 2022, 3:18 AM IST

Updated : Jan 29, 2022, 4:17 AM IST

CM KCR on Drugs: 'డ్రగ్స్ నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు'

CM KCR on Drugs: మాదకద్రవ్యాల నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చిచెప్పారు. నేరస్థులను కాపాడేందుకు ఏ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సిఫారసు చేసినా తిరస్కరించాలని స్పష్టంచేశారు. డ్రగ్స్‌ నియంత్రణకు ద్విముఖ వ్యూహం అనుసరించాలని.. స్కాట్లాండ్‌యార్డ్‌ పోలీసుల తరహా విధానాలను రూపొందించాలని సూచించారు. ప్రజల్ని చైతన్యం చేసి సామాజిక ఉద్యమంలా మలిస్తే.. డ్రగ్స్‌ నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసులు-ఆబ్కారీ శాఖకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

CM KCR on Drugs: 'డ్రగ్స్ నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు'

CM KCR on Drugs: మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసినా, నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందినవారినైనా సరే వదలొద్దని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి తదితర మాదకద్రవ్యాల వినియోగాన్ని కూకటివేళ్లతో పెకలించాలనే లక్ష్యంతో ప్రగతిభవన్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘మాదకద్రవ్యాల వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనం. దీన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించడానికి పోలీసు అధికారులు బాధ్యతతో కృషి చేయాలి. దీన్నో సామాజిక ఉద్యమంలా మలిచినప్పుడే నియంత్రణ సాధ్యమవుతుంది. ప్రజలను చైతన్యపరచడం ఇందులో భాగం. వెయ్యిమంది సుశిక్షితులైన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని, అత్యాధునిక హంగులతో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ను తీర్చిదిద్దాలి. గ్రేహౌండ్స్‌ తరహాలో ఈ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

పంజాబ్‌లోని నిపుణులతో శిక్షణ

డ్రగ్స్‌ నియంత్రణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలి. నిష్ణాతులైన మెరికల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. స్కాట్లాండ్‌ యార్డ్‌ తరహాలో పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలి. అవసరమైతే అలాంటి దేశాల్లో పర్యటించి రావాలి. పంజాబ్‌ లాంటి రాష్ట్రంలో మాదకద్రవ్యాల్ని నియంత్రిస్తున్న అధికారులను పిలిచి శిక్షణ తీసుకోవాలి. అందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంది. అద్భుత పనితీరు కనబరిచే పోలీసు అధికారులకు అవార్డులు, రివార్డులు, యాగ్జిలరీ పదోన్నతులు తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తాం. అధికారులు మనసు పెట్టి పనిచేయాలి. నేరస్థులపై పీడీ చట్టం ప్రయోగించాలి. తెలంగాణ ఆర్గనైజ్డ్‌ క్రైం యాక్ట్‌ను తిరిగి అమలులోకి తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి డీజీపీ ప్రణాళికలు సిద్ధంచేయాలి. పేకాట తదితర వ్యవస్థీకృత నేరాలను సమూలంగా రూపుమాపాలి. ఎక్సైజ్‌ శాఖలో అగ్గి కణికల్లాంటి అధికారులు కావాలని ముఖ్యమంత్రి అన్నారు.

యువత విముక్తికి కార్యాచరణ

‘మాదకద్రవ్యాల నియంత్రణకు ద్విముఖ వ్యూహం అనుసరించాలి. మత్తుకు బానిసలుగా మారిన వారిని గుర్తించడం మొదటి వ్యూహం. వారిని వ్యసనం నుంచి విముక్తులను చేయడానికి కుటుంబసభ్యుల సహకారంతో కార్యాచరణ రూపొందించాలి. మాదకద్రవ్యాలకు ఆకర్షితులవుతున్న యువతను గుర్తించి కట్టడి చేయాలి. రెండో వ్యూహంలో డ్రగ్స్‌ సరఫరా నెట్‌వర్క్‌ను, వ్యవస్థీకృత నేరవ్యవస్థల మూలాలను గుర్తించి నిర్మూలించాలి.’ -సీఎం కేసీఆర్​

అయిదుసార్లకి మించి గంజాయి దొరికితే అన్ని రకాల సబ్సిడీలూ రద్దు

అయిదు సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తుంది. డ్రగ్స్‌ రహిత గ్రామాలకు ప్రత్యేక నిధులతో పాటు ప్రోత్సాహకాలు ఇస్తాం. గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్థులమీద కూడా ఉంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా డ్రగ్స్‌ దందా నడుస్తుందనే విషయం పరిశీలనలో తేలింది. వాటిపై దృష్టిసారించాలి. కేసుల విచారణలో భాగంగా నిందితులను తీసుకొని కోర్టులకు వెళ్లిన పోలీసులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలి.

ఆధునిక సాంకేతికతతో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌

కేసుల దర్యాప్తులో కీలకమైన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేయాలి. న్యాయస్థానాల్లో నేరం రుజువు చేసేందుకు పక్కాగా చర్యలు తీసుకోవాలి. నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యవస్థీకృత నేరస్థులను గుర్తించి వారి స్వదేశాలకు పంపించేయండి.

క్లోజ్డ్‌ ఇండస్ట్రీలను రూపుమాపాలి

ఇతర రాష్ట్రాల నుంచి, సరిహద్దుల మీదుగా అక్రమంగా సాగుతున్న రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించాలి. పోలీస్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల మధ్య సమన్వయం ఉండాలి. మూసివేసిన పరిశ్రమలు మాదకద్రవ్యాల తయారీకి నెలవుగా మారుతున్నందున అలాంటి క్లోజ్డ్‌ ఇండస్ట్రీలను గుర్తించి రూపుమాపాలి. హైదరాబాద్‌ గొప్పతనం పాడు కావొద్దు. వరంగల్‌, కరీంనగర్‌ వంటి నగరాలు అభివృద్ధి పథాన పయనిస్తున్నాయి. అవి వ్యవస్థీకృత నేరాల బారిన పడకుండా చూసుకోవాలి. రాష్ట్రంలో హుక్కా సెంటర్లనే మాటే వినపడకూడదు.

తరచూ ఆబ్కారీ శాఖపై సమీక్ష

రాష్ట్ర పోలీసులు కానీ, ఎక్సైజ్‌, నిఘా విభాగం అధికారులు, సిబ్బంది కానీ మాదకద్రవ్యాల వ్యవహారంలో తలదూర్చినట్లు తేలితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. బార్లల్లో, పబ్బుల్లో డ్రగ్స్‌ వాడకం జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బందిపై చర్యలుంటాయి. లంచాలు తీసుకొని పనిచేస్తే వేటు తప్పదు. ఇకపై నేను తరచూ ఈ శాఖపై సమీక్ష నిర్వహిస్తా. నార్కోటిక్‌ కేసుల విచారణలో ప్రభుత్వ న్యాయవాదులు కొందరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిబద్ధత కలిగిన వ్యక్తులను డ్రగ్స్‌ కేసులు వాదించే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లుగా నియమిస్తాం.

విద్యా సంస్థలపై నజర్‌

జూనియర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడికల్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇంటర్‌ తదితర కళాశాలల యాజమాన్యాలను, ప్రిన్సిపాళ్లను పిలిచి సమావేశాలు నిర్వహించాలి. విద్యార్థులు డ్రగ్స్‌ వినియోగానికి ఆకర్షితులు కాకుండా చర్యలు చేపట్టాలి’’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను మార్చిలో ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, సీఐడీ డీజీపీ గోవింద్‌సింగ్‌, అదనపు డీజీపీలు జితేందర్‌, అనిల్‌కుమార్‌, నాగిరెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లు సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్ర, మహేశ్‌ భగవత్‌, ఐజీలు రాజేశ్‌కుమార్‌, కమలాసన్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

ఎంత ధనం సంపాదిస్తే ఏం లాభం?

"మాదకద్రవ్యాల వినియోగాన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే వినియోగం పెచ్చుమీరి అభివృద్ధిని పీల్చి పిప్పి చేస్తుంది. మన సంపాదనకు అర్థం లేకుండా పోతుంది. ఎంత ధనం సంపాదిస్తే ఏం లాభం? పిల్లలు డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్తు నాశనమవుతుంటే ఎంతో వేదన కలుగుతుంది. వీటి నియంత్రణలో సభ్యసమాజం సహకారం తీసుకోవాలి. సర్పంచులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించాలి. ఈ దిశగా ఎంపీలను, ఎమ్మెల్యేలనూ చైతన్యపరచాలి. ఈ క్రమంలో మీడియా, సినిమా వంటి మాధ్యమాల్ని విస్తృతంగా వినియోగించుకోవాలి. చైతన్యం కలిగించే సినిమాలు, డాక్యుమెంటరీలు, ప్రకటనలకు రాయితీలిద్దాం." - ముఖ్యమంత్రి కేసీఆర్‌

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

Last Updated :Jan 29, 2022, 4:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.