ఒప్పందం కుదిరాక కిరికిరి ఎందుకు?.. రుణ సంస్థల తీరుపై కేసీఆర్​ ఫైర్​!

author img

By

Published : Jul 27, 2022, 4:05 AM IST

cm-kcr-fire-on-loan-institutions

CM KCR Fire On Loan Institutions :రాష్ట్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా రుణ సంస్థలు కొత్త షరతులు పెడుతుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల కార్పొరేషన్‌కు రుణాలిచ్చిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) తాజా షరతులపై సీఎం దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో మంగళవారం భేటీ నిర్వహించారు.

CM KCR Fire On Loan Institutions: రాష్ట్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా రుణ సంస్థలు కొత్త కొత్త షరతులు పెడుతుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల కార్పొరేషన్‌కు రుణాలిచ్చిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) తాజా షరతులపై సీఎం దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో మంగళవారం భేటీ నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన భేటీ రాత్రి 8.30 గంటల వరకు సాగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్‌కి రుణాలిచ్చేందుకు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ సంస్థలు ఇవ్వాల్సిన మొత్తంలో ఇప్పటికే 80% రుణాలను అందజేశాయి. తాజాగా మూడో పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చాలని, కేంద్రం గ్యారంటీ ఇవ్వాలని షరతు పెడుతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఏ ఒప్పందంలోనైనా షరతులు ముందుగా నిర్దేశించుకుంటాం.. కానీ చివర్లో షరతులు పెట్టడం, ఒప్పందాలను సమీక్షించుకోవడం ఏమిటి అని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ అంశంపై అధికారులు సలహాలు, సూచనలను సీఎం ఓపిగ్గా విన్నారు. అనంతరం రాష్ట్రప్రభుత్వ అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా చర్చించారు. అవసరమైతే ఈవిషయంలో న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించారు. ఆర్థిక బాధ్యత-బడ్జెట్‌ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం)పై పరిమితులు విధించడం, ఇతరత్రా రుణలను కేంద్రం అడ్డుకుంటున్న తీరుపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఏటా ఎఫ్‌ఆర్‌బీఎంను కేంద్రం ప్రకటిస్తుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లను రూపొందించుకుంటాయి. ఈసారి తెలంగాణ పరిమితిని తొలుత రూ.53,000 కోట్లుగా ప్రకటించి.. తర్వాత రూ.23,000 కోట్లకు కుదించింది. రాష్ట్ర ప్రభుత్వం రుణసాయం పొందకుండా నిరోధించేందుకే కేంద్రం ఈ ఎత్తుగడ వేసింది.

మొదటినుంచీ రాష్ట్ర సర్కారు ఆర్థిక క్రమశిక్షణతో ఉంది. పరిధి మేరకు తెలంగాణ ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయి. వివిధ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను పైసా కూడా ఎగ్గొట్టకుండా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, పాలనలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంపై కేంద్రం ఇలాంటి ధోరణిని ప్రదర్శించడం దారుణం. దీన్ని ఎదుర్కొందాం ఈ అంశాల్లో తొలుత ఆర్థిక, ఇతర సంబంధిత అధికారులను కలుసుకొని చర్చించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు సూచించారు. రాష్ట్ర అధికారులు.. కేంద్ర అధికారులతో భేటీ అయిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసే అంశంపై సీఎం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

ఈ సమీక్షలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల, విద్యుత్‌శాఖ ముఖ్య కమిషనర్లు రామకృష్ణారావు, రజత్‌ కుమార్‌, సునీల్‌శర్మ, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ హరిరాం పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన తెరాస లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. దిల్లీ వచ్చిన ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ మంగళవారం రోజంతా సీఎం నివాసంలోనే గడిపారు. రవీందర్‌సింగ్‌ను దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ పెడితే ఆయనను దిల్లీలో పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా నియమిస్తారని భావిస్తున్నామని ఓ తెరాస నేత తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రభుత్వపరమైన సమీక్షల్లో ఉన్నందున ఒకట్రెండు రోజులు రాజకీయాంశాలపై దృష్టిపెట్టే అవకాశం కనిపించడం లేదని ఓ ఎంపీ పేర్కొన్నారు.

పంజాబ్‌లో ఆప్‌ గెలుపు సూత్రమేమిటి?
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం హైదరాబాద్‌ నుంచి దిల్లీకి వచ్చే సమయంలో విమానంలో పంజాబ్‌ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అక్కడ శాసనసభ ఎన్నికల్లో ఆప్‌ గెలుపు సూత్రమేమిటని ఆరా తీసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో విభేదాలు, రైతుచట్టాలతో భాజపాపై నమ్మకం పోవడంతో ప్రత్యామ్నాయంగా ప్రజలు ఆప్‌ను స్వాగతించారని నాయకులు తెలిపారు. సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ సంగ్రూర్‌ ఉప ఎన్నికలో గెలుపుపైనా కేసీఆర్‌ ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. మాన్‌పై అక్కడి యువతకు క్రేజ్‌ ఉందని, పలుమార్లు ఓడిపోవడంతో సానుభూతి కలిసి వచ్చిందని నాయకులు వివరించారు. ఈ అంశంపై మరోసారి సుదీర్ఘంగా చర్చిద్దామని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం.

ఇదీ చదవండి: మంత్రి కేటీఆర్​ "వర్క్​ ఫ్రం హోం".. వాళ్లు చేసిన కామెంట్ల వల్లేనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.