అక్కడ ఏం జరుగుతుందో.. ఏపీలోనూ అదే జరుగుతోంది: చంద్రబాబు

author img

By

Published : May 20, 2022, 8:44 AM IST

chandrababu fire on ysrcp govt

CBN Fire On Jagan: బాదుడే బాదుడే కార్యక్రమంతో వైకాపాలో వణుకు మొదలైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఐదేళ్లు పాలించే సత్తాలేకనే జగన్‌ ముందస్తుకు సిద్ధమవుతున్నాడని ఎద్దేవా చేశారు. శ్రీలంకలో ఏం జరుగుతుందో ఏపీలోనూ అదే జరుగుతోందని విమర్శించారు.

Chandrababu Fire On YSRCP Govt: జగన్ ఓ ఐరన్ లెగ్ అని... ఆంధ్రప్రదేశ్​కు శని గ్రహంలా పట్టుకున్న అరిష్టాన్ని తరిమి కొట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో రోడ్డు షో నిర్వహించారు. తాను ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తే.. జగన్ వాలంటరీ ఉద్యోగాలు ఇప్పించారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని.. అభివృద్ధి అటకెక్కిందని మండిపడ్డారు. శ్రీలంకలో ఏం జరుగుతుందో ఏపీలోనూ అదే జరుగుతోందని విమర్శించారు. నందికొట్కూరులో వైకాపా నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కర్నూలుకు హైకోర్టు ఎందుకు తరలించలేదని.., ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదని జగన్​ను నిలదీశారు.

ఈసారి ఛీత్కారం తప్పదు..: బాదుడే బాదుడే కార్యక్రమంతో వైకాపాలో వణుకు మొదలైందని చంద్రబాబు అన్నారు. గడప గడపకూ వైకాపా ప్రభుత్వంలో వస్తున్న నిరసనలను తప్పించుకునేందుకే.. బస్సు యాత్ర పేరిట మరో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్ని వేషాలు వేసినా.. వైకాపాకు ఈసారి ఛీత్కారం తప్పదన్నారు. ఐదేళ్లు పాలించే సత్తాలేకనే జగన్‌ ముందస్తుకు సిద్ధమవుతున్నాడని ఎద్దేవా చేశారు.

"బీసీ జనార్దన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే జైలుకెళ్లి వచ్చారు. అవినీతి కేసులున్న వ్యక్తి మాపై కేసులు పెడతారా ?. పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తికి గుణపాఠం చెబుతాం. నంద్యాలలో సత్తార్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు, ఒంగోలులో మహిళలపై అత్యాచారాలు. రాష్ట్రంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా. రాష్ట్రాన్ని కాపాడాలంటే కార్యకర్తలు పోరాడాలి. రోజుకు ఎక్కడోచోట రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి." - చంద్రబాబు, తెదేపా అధినేత

పార్టీని దెబ్బతీయాలని కుట్రలు..: తెలుగుజాతి ఉన్నంతవరకు తెదేపా ఉంటుందని చంద్రబాబు అన్నారు. అంతకుముందు కర్నూలు, నంద్యాల జిల్లాల కార్యకర్తలు, నియోజకవర్గ బాధ్యులు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీని దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించాలన్నారు. ఒంగోలు మహానాడు ద్వారా సమస్యలు చర్చించుకుందామని పార్టీ శ్రేణులకు వెల్లడించారు.

"తెదేపా 40 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్నేమీ చేయలేరు. మేం కన్నెర్ర చేస్తే జగన్ తట్టుకోలేరు. కర్నూలులో మా ఫ్లెక్సీలు తొలగించి వైకాపా జెండాలు పెట్టుకున్నారు. జగన్ పాలనలో వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు." - చంద్రబాబు, తెదేపా అధినేత

అండగా ఉంటాం: కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు తెదేపా నేత విష్ణువర్దన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇటీవల విష్ణువర్దన్‌రెడ్డి కుమారుడు రాజవర్థన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా..ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విష్ణువర్దన్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.