ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ స్పీడ్ పెంచిన కారు - గులాబీ జెండాకు మద్దతివ్వాలంటూ ఊరూవాడా ప్రచారం

ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ స్పీడ్ పెంచిన కారు - గులాబీ జెండాకు మద్దతివ్వాలంటూ ఊరూవాడా ప్రచారం
BRS Election Campaign 2023 : ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ఓవైపు గులాబీ దళపతి కేసీఆర్ రోజుకు మూడు నాలుగు సభలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు నియోజకవర్గాల అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి పదేళ్ల ప్రగతిని క్షేత్రస్థాయిలో వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ సర్కార్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
BRS Election Campaign 2023 : షాద్నగర్లో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా.. హోం మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) హాజరయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వికారాబాద్ జిల్లా పరిగిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్లో శంకర్నాయక్కు మద్దతుగా మంత్రి సత్యవతి రాఠోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యలతో కలిసి.. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విస్తృతంగా పర్యటిస్తూ.. బీఆర్ఎస్ సర్కార్ ప్రగతిని వివరించారు. ఖమ్మం జిల్లా వైరా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బానోత్ మదన్లాల్ కొనిజర్ల మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
BRS Leaders Election Campaign 2023 : మంచిర్యాల జిల్లా చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్.. భీమారం మండలంలో పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్కు మద్దతుగా.. ఎమ్మెల్సీ కవిత రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బిగాల గణేష్ గుప్తాకు మద్దతుగా మంత్రి హరీశ్రావు రోడ్ షో (Minister Harish Rao) చేపట్టారు.
Telangana Assembly Elections 2023 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో.. హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఆయనకు మంగళహారతులు, బతుకమ్మలు, బోనాలతో, డప్పుచప్పుళ్లతో ప్రజలు ఘనస్వాగతం పలికారు. గత రెండు పర్యాయాలు తనను ప్రజలు ఆశీర్వదించారని గుర్తుచేశారు. మరోసారి తనకు ఓటువేసి భారీ మెజార్టీలో గెలిపించాలని వారిని సతీశ్కుమార్ కోరారు.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో బాజిరెడ్డి గోవర్ధన్.. గడపగడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకులు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. గాంధారి మండలంలో పర్యటించిన ఎల్లారెడ్డి బీఆర్ఎస్ (BRS Election Campaign) అభ్యర్థి సురేందర్.. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కు మద్దతుగా.. గులాబీ పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టోను వివరిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ అభ్యర్థి సునీతా రెడ్డి ఓట్లు అభ్యర్థించారు.
BRS Candidates Election Campaign : జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. మరోసారి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పథకాలన్నీ కొనసాగి.. రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందని అన్నారు. ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచన చేసి తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని లక్ష్మారెడ్డి చెప్పారు.
