ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై ఆరా.. త్వరలో జిల్లా వైద్యాధికారులకే బాధ్యతలు!

author img

By

Published : Jan 12, 2022, 9:14 AM IST

Private Hospitals in Telangana

Private Hospitals in Telangana: 5 శాతం పడకల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు తప్పుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై వైద్యమంత్రి హరీశ్​రావు ఆరా తీశారు. ఇక నుంచి జిల్లా వైద్యాధికారులకే కార్పోరేట్​ ఆస్పత్రుల బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారు.

Private Hospitals in Telangana: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఏడాదికి 5 శాతం పడకల్లో ఉచిత వైద్యసేవలందించాలనే నిబంధన అటకెక్కింది. దీనిపై పర్యవేక్షణ కొరవడటంతో.. అనేక ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు ఈ నిబంధనకు తూట్లు పొడుస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. ఇకనుంచి జిల్లా వైద్యాధికారులకే దీని బాధ్యత అప్పగిస్తూ.. ఈ నిబంధన పరిపూర్ణంగా అమలయ్యేలా బాధ్యత వహించాలంటూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.

రాష్ట్రంలో తొలి, రెండోదశ కొవిడ్‌ కాలంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు కనికరం చూపకుండా కరోనా రోగుల నుంచి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. ఒకపక్క ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ.. 5 శాతం పడకల్లో ఉచిత వైద్యం అందించాలనే నిబంధన ఉన్నా.. అత్యధిక ఆసుపత్రులు కొవిడ్‌ కాలంలో నిర్దయగా వ్యవహరించాయనే విమర్శలున్నాయి. కనీసం బిల్లులో 5 శాతం తగ్గించడానికి ముందుకు రాని ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మూడోదశ ఉద్ధృతి నేపథ్యంలో నిరుపేద రోగులకు ఉచిత వైద్యపథకం ద్వారా కొంత వరకైనా మేలు జరుగుతుందని వైద్యశాఖ భావిస్తోంది. 5 శాతం పడకలను ఎలా ఉచితంగా అందించాలనే విషయంపై కొంత అస్పష్టత ఉండటాన్ని.. ప్రైవేటు ఆసుపత్రులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.

కాగితాలకే పరిమితం

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు సర్కారు నుంచి నగదురహిత వైద్యం, తిరిగి వైద్యబిల్లులు పొందే పథకాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 250 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు ఈ పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిని అమలు చేయడం ద్వారా ఏటా సుమారు 500 కోట్లకు పైగా లబ్ధి పొందుతున్నాయి. ఇందుకుగాను ఏడాదికి ఆయా ఆసుపత్రుల్లోని 5 శాతం పడకలను ఉచిత వైద్యసేవల కోసం వినియోగించాలనే నిబంధన ఉంది. ఈ లెక్కన అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో.. ఏడాదికి సుమారు 3-4 వేల మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాల్సి ఉంటుందని వైద్యవర్గాలు అంచనా వేశాయి. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోందని వైద్యశాఖ గుర్తించింది. ఉచిత వైద్యం అందించినట్లు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు 5 శాతం పడకలను కేటాయిస్తున్నట్లు కాగితాలపై చూపిస్తున్నట్లుగా వైద్యశాఖ పరిశీలనలో తేలింది. అయితే ఇందులోనూ అవాస్తవమే అధికమని, ఉచిత సేవలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే అభిప్రాయం వైద్యమంత్రి వద్ద సమీక్షలో వ్యక్తమైంది.

ఇదీ చూడండి: Rush in Railway Stations: సంక్రాంతి కోలాహలం... రద్దీగా మారిన రైల్వేస్టేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.