'అభివృద్ధి పథంలో సాగాలంటే 3ఐ నినాదం పాటించాలని ప్రధానికి చెప్పాను'

author img

By

Published : Sep 15, 2022, 3:37 PM IST

కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తోందని... ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులు ఉద్యోగాల వెంటపడకుండా ఉద్యోగాలు సృష్టించేందుకు కృషిచేయాలని మంత్రి సూచించారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, సృజనాత్మక ఆలోచనల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేటీఆర్ తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం భారత్‌ను అభివృద్ధి పథంలో నడపాలంటే 3 ఐ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌, ఇన్నోవేషన్‌) నినాదం గురించి తాను ప్రధానికి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.

75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై రెండున్నర ఏళ్ల క్రితం ప్రధాని నిర్వహించిన సదస్సులో తాను కీలక సూచన చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 3 ఐ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌, ఇన్నోవేషన్‌) నినాదంతో భారత్ అభివృద్ధి సాధ్యమని ప్రధానితో చెప్పానని.. ఈ అంశంపై ఆయన కూడా ఆసక్తి కనబరిచారని చెప్పారు. 3 ఐ నినాదంలో ముఖ్యమైనది ఇన్నోవేషన్‌ అని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కొత్త విధానాలు తీసుకురావడం కూడా ఇన్నోవేషన్‌ కిందకే వస్తుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్​లో అంతర్జాతీయ ఇన్నోవేషన్‌ ఇన్‌ ఇంజినీరింగ్ సదస్సు కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌టీయూ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతోంది. ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా కేటీఆర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జేఎన్‌టీయూలో నాకు చాలా మంది మిత్రులున్నారని గుర్తు చేసుకున్నారు.

కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన ఇన్నోవేషన్‌ కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తి: సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో చేపట్టిన ఇన్నోవేషన్‌ కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తినిచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త విధానాలు తీసుకురావడం కూడా ఇన్నోవేషన్‌ కిందే వస్తుందని చెప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు పారిశ్రామిక విధానంపై కేసీఆర్‌ చర్చించారని తెలిపారు. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు, ఆలోచనలు సీఎం స్వీకరించారని పేర్కొన్నారు. విద్యుత్‌, పరిశ్రమలకు అనుమతుల జాప్యంపై సమస్యల గురించి వారు వెల్లడించారు.

వాణిజ్య విధానాలపై బృందాన్ని పంపి అధ్యయనం చేయిస్తామని సీఎం వారికి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేద్దామని తెలిపారు. ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలతో పారిశ్రామిక విధానం తెచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కొద్ది నెలల వ్యవధిలోనే టీఎస్‌ఐపాస్‌ విధానం అమల్లోకి తెచ్చామన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం, మున్సిపాలిటీ అనుమతులతో సంబంధం లేకుండా ఈ విధానాన్ని రూపొందించామని అన్నారు.

పరిశ్రమలు తమకు తాము ధ్రువీకరించుకునేలా కొత్త విధానం: పరిశ్రమలు తమకు తాము ధ్రువీకరించుకునే చేసుకోవడం కూడా కొత్త విధానం అని కేటీఆర్ అన్నారు. కాలుష్యం, భవన నిర్మాణం, భద్రతా ప్రమాణాలపై పరిశ్రమలే ధ్రువీకరించాలని పేర్కొన్నారు. తమకు తాము ధ్రువీకరించిన మొదటి రోజు నుంచే కార్యకలాపాలు ప్రారంభించవచ్చని కేటీఆర్‌ చెప్పారు. భారత్‌లో మరెక్కడా లేనివిధంగా నూతన పారిశ్రామిక విధానం తెచ్చామని తెలిపారు.

తెలంగాణలో మాత్రం సింగిల్‌ విండో విధానంలో అలా జరగదు: దేశంలో చాలాచోట్ల సింగిల్‌ విండో విధానం అమలు చేస్తున్నట్లు చెబుతారు.. సింగిల్‌ విండో వెనక మరిన్ని విండోలు ఉంటాయనేది వాస్తవమని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో మాత్రం సింగిల్‌ విండో విధానంలో అలా జరగదని తెలిపారు. 15 రోజుల్లో అనుమతులు రాకపోతే 16వ రోజు అనుమతి వచ్చినట్లే భావించాలని తెలిపారు. కొత్త విధానంతో అవినీతి, అనుమతుల్ల జాప్యం నివారించగలిగామని చెప్పారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 8 ఏళ్లలో 20 వేలకు పైగా అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. రూ.2.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని అన్నారు. పరిశ్రమల ద్వారా 16 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించామని కేటీఆర్ వెల్లడించారు.

ఇవీ చదవండి: KTR Tweet Today : 'ఉచితాలు వద్దంటున్న మోదీ.. ఇస్తామంటున్న బండి'

బాలుడిని ఢీకొట్టిన బస్సు.. తలకు గాయంతోనే స్కూల్​కు విద్యార్థి.. స్పృహ తప్పి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.