పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో వివాదాలు.. పలు గ్రామాల్లో ఆందోళనలు

author img

By

Published : Aug 27, 2021, 9:10 AM IST

PALLE PRAKRUTHI VANAM

గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదం కోసం ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ ప్రకృతి వనాలు పలుచోట్ల వివాదానికి కారణమవుతున్నాయి. తమ భూముల్ని బలవంతంగా గుంజుకుంటున్నారంటూ రైతులు ఆరోపిస్తూ ఆందోళన బాటపడుతున్నారు. తన భూమిని స్వాధీనం చేసుకున్నారన్న మనస్తాపంతో నారాయణపేట జిల్లా శేర్నపల్లికి చెందిన దివ్యాంగుడు మల్లప్ప 23న ఆత్మహత్య చేసుకున్నారు. కొన్నిచోట్ల రైతుల ఆందోళనతో అధికారులు పోలీసులను పిలిచించి పనులు చేయిస్తుండటం.. మరికొన్నిచోట్ల రైతులు పురుగు డబ్బాలతో పొలాల్లో కాపలా ఉంటుండటం వంటి ఉదంతాలు కలకలం రేకేత్తిస్తున్నాయి.

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం దుగ్యాల రైతులు వీళ్లు. బృహత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయొద్దంటూ ధర్నా చేస్తున్నారు. జీవనాధారం కోల్పోతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల్ని పిలిచి ఇటీవల అధికారులు పనులు చేపట్టారు.. ఆ సమయంలో జీననాధారమైన తమ భూములు తీసుకోవద్దంటూ పోలీసుల కాళ్లావేళ్లాపడ్డారు.

ఎందుకీ వివాదం?

గ్రామాల్లో పల్లెప్రకృతి వనాల్ని ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19472 గ్రామీణ ప్రాంతాలకు గాను కొన్నిచోట్ల మినహా మిగిలినవి పూర్తయ్యాయి. ఇప్పుడు 545 బృహత్‌ పల్లెప్రకృతి వనాలు ఒక్కోటి 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్నాయి. వివాదం లేకుండా సాఫీగా చూడాల్సిన క్షేత్రస్థాయి అధికారులు కొన్నిచోట్ల ఎసైన్డ్‌, హక్కుపత్రాలు ఇచ్చిన అటవీభూముల్ని, ప్రాజెక్టుల భూసేకరణ చేసినా స్వాధీనం చేసుకోకుండా రైతుల ఆధీనంలోనే ఉన్న వాటిని తీసుకుంటున్నారు. ఫలితంగా ఆ రైతుల్లో ఆందోళన పెరుగుతుండటంతో పాటు వ్యతిరేకత వస్తోంది. పల్లెప్రకృతి వనాలతో పోలిస్తే బృహత్‌ వనాల విషయంలో ఎక్కువ వివాదాలు వస్తున్నాయి.

ప్రాజెక్టుకు సేకరణ.. రైతుల సేద్యంలోనే

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం దుగ్యాలలో 10.24 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న బృహత్‌ పల్లెప్రకృతివనం వివాదాస్పదంగా మారింది. భూమి చదునుచేసి, మొక్కలు నాటారు. అంతర్గత రహదారులు నిర్మిస్తున్నారు. ఈ భూములు తమవేనంటూ పనుల ప్రారంభంలోనే ఏడుగురు రైతులు అడ్డుకున్నారు. 30 ఏళ్లక్రితం పేర్వాల ప్రాజెక్టుకు ఎకరాకు కేవలం రూ.3 వేలే ఇచ్చారని, మట్టితవ్వుకుని వెళ్లిపోయారని చెబుతున్నారు. భూమి తమ ఆధీనంలోనే ఉందంటున్నారు.

ఎసైన్డ్‌ భూముల్లో ప్రకృతివనం

  • వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం బుసిరెడ్డిపల్లిలో 95 ఎకరాల అసైన్ఢ్‌భూములున్నాయి. తమకు పట్టాలిచ్చిన భూముల్లో బృహత్‌ప్రకృతివనం ఏర్పాటుచేయొద్దని రైతులు నాగన్న, శేషయ్య, రాములమ్మ అంటున్నారు. ఒక్కోక్కరికి 1.13-1.14 ఎకరాల భూమి ఉంది. ఆపాలని ఎమ్మెల్యేను కలిసి కోరినా పనులు జరుగుతున్నాయని అంటున్నారు.
  • సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బృహత్‌ వనం పనులపైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తమకు హక్కులున్నాయని కొందరు అడ్డుకోవడంతో మొక్కలు నాటే పనులు ఆగాయి.
  • భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో బృహత్‌ పల్లె ప్రకృతివనం కోసం 9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. ‘గతంలోనే 13 మంది రైతులకు ఈ భూముల్ని ఇచ్చారు. ఇవే జీవనాధారంగా బతుకుతున్నామని చెప్పడంతో ప్రస్తుతానికి అధికారులు పనులు నిలిపివేశారు’అని జుగురి చిన్నపోచం, రెవెల్లె సమ్మయ్య చెప్పారు.
  • సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూరులో ఓ వ్యక్తి ఉపాధినిమిత్తం చాలాకాలంగా ఊరికి దూరంగా ఉంటున్నారు. ఈ భూమిని పల్లె ప్రకృతి వనం కోసం తీసుకునే ప్రయత్నం జరిగింది. భూయజమాని వచ్చి ఆందోళనకు దిగడంతో ఆ ప్రయత్నం ఆగింది.
.

చిత్రంలో కనిపిస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రపురం మహిళలు. 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూముల్లో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గిరిజనులు అడ్డుకోవడంతో అధికారులు పోలీసులను పిలిపించి పనులు చేయిస్తున్నారు.

భూమి బాగుకు రూ.3.50 లక్షలు ఖర్చుచేశా..

మూడున్నర ఎకరాల భూమిని అధికారులు అన్యాయంగా గుంజుకోవడంతో జీననాధారం కోల్పోయా. అధికారులచుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు. భూమిని బాగు చేయడంకోసం ఏడాదిక్రితం ఇటీవల రూ.3.50 లక్షలు ఖర్చుచేశా. ప్రాజెక్టులో నీ భూమి పోయిందని అధికారులు అంటున్నారు. 1990లో బలవంతంగా ఒప్పించి, ఎకరాకు రూ.మూడువేలే ఇచ్చారు. భూమి మా ఆధీనంలోనే ఉంది. పోలీసుల్ని పిలిపించి పనులు చేయిస్తున్నారు.

- సర్వయ్య, రైతు, దుగ్యాల, నల్గొండ జిల్లా

30 ఏళ్లుగా మా ఆధీనంలోనే

30 ఏళ్లగా కొంతభూమి నా ఆధీనంలోనే ఉంది. ఎకరం భూమిపై హక్కులు కల్పిస్తూ 2019 జనవరిలో తహసీల్దార్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. మరో నలుగురికీ ఇలా ఎకరం చొప్పున ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు.

- అంబటి దేవానందం, రుద్రంగి, సిరిసిల్ల జిల్లా

పట్టాదారు పుస్తకం ఇచ్చి లాక్కుంటారా?

ఎసైన్డ్‌ భూమిని 50 ఏళ్లు సాగుచేసుకున్న వ్యక్తి నుంచి 16 ఏళ్ల క్రితం కొనుక్కున్నా. పల్లె ప్రకృతివనం పేరుతో నా ఎకరం భూమిని గుంజుకున్నారు. 1554 సర్వేనంబరులో చాలా భూమి ఉన్నా నిరుపేదను కావడంతో రాజకీయం చేసి నా భూమిని లాక్కుని అన్యాయం చేశారు. నేను కొన్న భూమికి ప్రభుత్వం పట్టాదారు పుస్తకం ఇచ్చింది. ఇప్పుడిలా తీసుకోవడంతో నా ఆరోగ్యం దెబ్బతింటోంది.

- మేక రాంబాబు, నాయకులగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఇదీచూడండి: TS High Court: 'శాశ్వత హోదా చేజార్చుకుంటే.. దేశమంతా నిందిస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.