DIWALI: దీపావళి వేళ అందరిళ్లలో వెలుగులు.. వారిళ్లలో మాత్రం చీకట్లు!

author img

By

Published : Nov 4, 2021, 12:43 PM IST

DIWALI

మనిషి అనే పదం మూడక్షరాలే. కానీ జీవితం గమ్యం తెలియని పయనమే. ప్రకృతితో మమేకమైన మనిషి జీవితంలో పండగలు, పర్వదినాలది విడదీయలేని బంధమే. ఒకప్పుడు ప్రతిచోట పరోపకారమనేది ఆచరణాత్మకమైన సూత్రంగా వినిపించేది. ఇప్పుడు దాని ప్రాధాన్యతను మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండేళ్లుగా కరోనాతో పాటు ఈసారి కురిసిన అకాల వర్షాలతో ఎన్నో కుటుంబాల్లో చీకటి అలముకుంది. ఉపాధి కరవైంది. దీపావళి పండగ వేళ సగటు మనుషుల వెతలపై ప్రత్యేక కథనం.

DIWALI: వెలుగుల పండగ వేళ కొంత మంది జీవితాల్లో చీకట్లు

వెలుగులు విరజిమ్మే పండుగ వేళ....దీపాలను విక్రయించే వారి జీవితాలు దయనీయంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం బంగారుగూడకు చెందిన లత అనే మహిళ మూడు నెలలుగా 30వేలు ఖర్చు చేసి దీపాలన్ని తయారు చేశారు. ఇవి అమ్ముడుపోతే 50వేల వస్తే పెట్టుబడిని పోను మిగిలిన 20వేలతో కుటుంబాన్ని పోషించాలి.కానీ కొనుగోళ్లు సరిగా జరగడం లేదని ఆమె ఆవేదన చెందుతోంది.

''మూడు నెలలుగా ఈ పని చేస్తున్నాం. అమ్మితేనే మాకు పండుగ.. లేదంటే.. పస్తులు ఉండాల్సిందే.. తిండి లేదు.. బట్టలు లేవు. ఈ అమ్మిన డబ్బులతోనే మా జీవనం. ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఈసారైనా ఇవి అమ్ముడు పోతేనే నాలుగు డబ్బులు వస్తాయి.''

-లత, దీపాలు తయారుచేసిన మహిళ, ఆదిలాబాద్‌ జిల్లా

ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి అమ్మకానికి వచ్చిన రైతులది మరో గాథ. కాలం కలిసిరాక అప్పులు తప్పా... ఆదాయం లేదనే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరేమో తాంసిమండలం కప్పర్లకు చెందిన అలిసెట్టి గంగాధర్‌, మరోకరేమో... మండల కేంద్రమైన భీంపూర్‌కు చెందిన పోయం భారత్‌. గంగాధర్‌ తనకున్న 2 ఎకరాల సొంతభూమితో పాటు రూ. 33వేలతో మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగుచేస్తే... కేవలం 20 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. పోయం భారత్‌దీ అదే బాధ. తన 5 ఎకరాలకు తోడు రూ. 30వేలకు కౌలు తీసుకుని మరో 5 ఎకరాల్లో పత్తి సాగుచేస్తే కేవలం 12 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. కాలం కలిసిరాక అప్పులు తప్పా... ఆదాయం లేదనే గంగాధర్‌, భారత్ ఆవేదన చెందుతున్నారు. పంట పండిననాడే పండగ అనే మాట వారి నుంచి వినిపిస్తోంది.

మాకు దీపావళి లేదు.. లక్ష్మి పూజ లేదు.. పంటలు పండితేనే పండుగ.. ఎండలో శ్రమించి పని చేస్తే... ఏం లాభం లేకుండా పోయింది.

-పోయం భారత్‌, పత్తి రైతు, ఆదిలాబాద్‌ జిల్లా

లక్ష్మీదేవి ఫోటోలు విక్రయించి...

హైదరాబాద్‌లో టోకుగా లక్ష్మీదేవి ఫోటోలను కొనుగోలు చేసి విక్రయిస్తే కొంత సంపాదించుకోవచ్చనే ఆలోచన ఈ మహిళది. ఆదిలాబాద్‌ జిల్లా బంగారుగూడకు చెందిన ఈమె పిల్లలతో కలిసి రోడ్డుపక్కనే కూర్చొని లక్ష్మీదేవి ఫోటోలను విక్రయిస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 13.22లక్షల మంది అసంఘటిత కార్మికులుంటే... మరో 4.22లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా ప్రతికూల పరిస్థితులతో పేదల జీవితాల్లో దీపావళి శోభ కనిపించడంలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.