ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పులుల సంచారం

author img

By

Published : Nov 18, 2022, 9:35 PM IST

Wandering of Tigers in Adilabad District

Wandering of Tigers in Adilabad District: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పులుల సంచారం ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి విరుచుకుపడుతుంతో తెలియక జనం భయంతో వణికిపోతున్నారు. ఇప్పటి వరకు అడవుల్లోకి వెళ్లిన పశువుల మీద దాడులు చేసిన జంతువులు, మనుషుల మీద విరుచుకుపడుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. కొమురంభీం జిల్లా వాంకిడిలో ఇటీవల ఓ రైతును బలితీసుకున్న పులి, తాజాగా కాగజ్‌నగర్‌లో సంచరిస్తుండటంతో జనం జాగారం చేసే పరిస్థితి నెలకొంది.

Tigers Wandering in Adilabad District: అసలే అరణ్యం. అంతంత మాత్రంగానే జనసంచారం. చెట్టూపుట్ట తిరిగితే కానీ, పూట గడవని జీవనం. ఈ పరిస్థితుల్లో ఊహించనిరీతిలో పులి విరుచుకుపడితే ఇక అంతే సంగతులు. అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పుడు ఇలాంటి భయానక పరిస్థితులే నెలకొన్నాయి. కుమురంభీం జిల్లా వాంకిడి పరిధిలోని ఖానాపూర్‌లో మూడ్రోజుల క్రితం భీము అనే రైతుని పులి పొట్టనబెట్టుకుంది. ఇప్పటి వరకు అడవుల్లో మేతకు వెళ్లిన పశువులపై మాత్రమే దాడులు చేసిన వ్యాఘ్రాలు, మనుషులను మట్టుబెడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గత రెండేళ్లలో పులుల దాడిలో మరణించిన వారి సంఖ్య తాజా ఘటనతో మూడుకు చేరింది.

గత నెలరోజులుగా ఆదిలాబాద్‌, కుమురంభీం జిల్లాల్లో తరచుగా సంచరిస్తున్న పులులు.. పశువులపై దాడులు చేస్తున్నాయి. గతంలో తాడోబా అభయారణ్యం నుంచి వచ్చిన “ఏ2” పులి జనావాసాలకు దగ్గరగా వచ్చి భయాందోళనలకు గురిచేసింది. ఇద్దరిని చంపేసిన ఈ పులి ఒకేరోజు నాలుగైదు పశువులను వేటాడేది. అధికారులు దానిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. బెజ్జూరు మండలంలోని చీపురుదేవర అటవీ ప్రాంతంలో జనవరి 2021లో బోను, ఎరను సైతం అమర్చినా పులి పట్టుబడలేదు. ఆచూకీ లభించకపోవడంతో మహారాష్ట్రకు వెళ్లిపోయిందని అధికారులు ప్రకటించారు.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 20 పులుల వరకు సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు పులులు జతకట్టే కాలం కాగా, ఇదే సమయంలో పత్తి ఏరడానికి రైతులు, కూలీలు పంటపొలాలకు వెళ్తుంటారు. ఈ క్రమలోనే గత మంగళవారం ఖానాపూర్‌ గ్రామంలో పులిదాడిలో రైతు భీము ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. వాంకిడిలో రైతు ఘటన తర్వాత అక్కడి నుంచి పులి కాగజ్‌నగర్‌ వైపు వచ్చింది.

దాదాపు రెండేళ్లు పైబడిన ఓ పులి పట్టణంలోని వినయ్‌గార్డెన్స్‌ సమీపంలోని ప్రధాన రహదారి దాటుతుండగా, ఓ ట్రాలీ డ్రైవర్‌ గమనించి, భయంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. పరిసర ప్రాంతాల్లో లైట్లతో పంటపొలాల్లో పరిశీలించినప్పటికీ, ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదు. వినయ్‌గార్డెన్స్‌ సమీపంలో పులి పాదాల ముద్రలను గుర్తించిన అధికారులు వాస్తవమేనని ధ్రువీకరించారు.

రాత్రంతా విస్తృతంగా గాలించిన సిబ్బంది, ఉదయం పాదముద్రల ఆధారంగా పులి పెద్దవాగు వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శివాపూర్, బారెగూడ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పులి సంచారం, తాజా ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

పులుల జతకట్టే ఈ కాలం ఆడతోడు వెతుక్కుంటూ వెళ్తుంటాయని, ఇలాంటి సమయంలో చాలా కోపంగా ఉంటాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఖానాపూర్‌లో ఇటీవల పులిదాడిలో మృతిచెందిన భీము కుటుంబాన్ని చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ వినోద్‌కుమార్‌ పరామర్శించారు. పొలాలకు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని, శబ్దాలు చేస్తూ వ్యవసాయ పనులు చేసుకోవాలని ఆయన సూచించారు. అటవీ రేంజ్‌ పరిధిలో 4 బేస్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.