Olympics Day 12: రవికుమార్​, నీరజ్​ చోప్రా​ జోరు.. లవ్లీనా రికార్డు​

author img

By

Published : Aug 4, 2021, 8:12 PM IST

oly

ఒలింపిక్స్​లో మన బృందానికి బుధవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రెజ్లింగ్​లో రవికుమార్​ ఫైనల్, జావెలిన్​ త్రోలో నీరజ్​ చోప్రా ఫైనల్​కు​ దూసుకెళ్లారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళల హాకీ జట్టు ఫైనల్​ చేరలేకపోయింది. లవ్లీనా ఈ క్రీడల్లో పతకం సాధించిన మూడో బాక్సర్​గా రికార్డు సృష్టించింది.

టోక్యో ఒలింపిక్స్​లో 12వ రోజు(ఆగస్టు 4) భారత బృందానికి అంతగా కలిసిరాలేదు. ఎన్నో ఆశలతో సెమీస్​లో బరిలో దిగిన మనోళ్లు బోల్తా పడ్డారు. కానీ ఓ పతకం ఖాయం అవ్వడం వల్ల క్రీడాభిమానులు కాస్త సంతృప్తిపడ్డారు. మొత్తంగా ఐదు ఈవెంట్లలో భారత అథ్లెట్లు పాల్గొన్నారు. హాకీ, బాక్సింగ్​ సెమీస్​లో చేతులెత్తేయగా.. జావెలిన్​ త్రో, గోల్ఫ్​, రెజ్లింగ్​లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓ సారి మన క్రీడాకారులు ఎలాంటి ప్రదర్శన చేశారో చూద్దాం..

పసిడి ఆశలు ఆవిరి

హాకీ ఇండియా.. సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో మహిళల జట్టు బోల్తా పడింది. స్వర్ణమే లక్ష్యంగా ముందుకు సాగిన రాణి రాంపాల్​ సేనకు సెమీస్​లో అర్జెంటీనా చేతిలో భంగపాటు తప్పలేదు. 1-2తో ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది. కాంస్య పోరులో గ్రేట్​ బ్రిటన్​పై నెగ్గి పతకం సాధిస్తారో లేదో చూడాలి.

olympics
మహిళల హాకీ

లవ్లీనా చరిత్ర సృష్టించింది కానీ..

భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్‌(Lovlina Borgohain) ఒలింపిక్స్​లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్​గా చరిత్ర సృష్టించింది. కానీ ఆమె స్వర్ణం సాధిస్తుందని అంతా ఆశపడ్డారు. బుధవారం జరిగిన సెమీస్‌లో 69కేజీల విభాగంలో ఆమె 0-5 తేడాతో ఓటమి పాలైంది. వరుసగా మూడు రౌండ్లలో సుర్మెనెలి ఆకట్టుకుంది. తొలి రౌండ్లో లవ్లీనా కొన్ని పంచులు బాగానే విసిరినప్పటికీ వాటిని ప్రత్యర్థి తన డిఫెన్స్‌తో అడ్డుకొంది. దాంతో 50-45తో సుర్మెనెలి మొదటి రౌండ్‌ గెలుచుకుంది. రెండో రౌండ్లో ఆమె మరింత రెచ్చిపోగా లవ్లీనా రక్షణాత్మక ధోరణి కనబరిచింది. చివరి రౌండ్లో ఆమె మరింత తేలిపోయింది. ఆఖరికి 30-26, 30-26, 30-25, 20-25, 30-25 టర్కీ బాక్సర్‌ ఘన విజయం అందుకుంది.

olympics
లవ్లీనా

రెజ్లింగ్​ మిశ్రమ ఫలితాలు

రెజ్లింగ్​లో భారత్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న దీపక్​ పూనియా(86కిలోలు) సెమీస్​లో నిరాశపరచగా.. రవికుమార్(57 కిలోలు) ఫైనల్​కు దూసుకెళ్లాడు. దీంతో దేశానికి మరో పతకాన్ని ఖాయం చేశాడు రవి.

మహిళల రెజ్లింగ్​లో 57 కిలోల విభాగంలో అన్షు మాలిక్‌ నిరాశపరిచింది. కనీసం క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. బెనారస్‌ రెజ్లర్‌ చేతిలో 8-2తో ఓటమి పాలైంది.

olympics
రవికుమార్​

జావెలిన్​ త్రో

పురుషుల జావెలిన్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​-ఏలో నీరజ్​ చోప్రా అదరగొట్టాడు. మొదటి ప్రయత్నంలోనే ఫైనల్​కు ఎంపికయ్యాడు. ఈ ఒలింపిక్స్‌లో అతడు కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు క్రీడాభిమానులు. అయితే శివపాల్​ సింగ్​ మాత్రం ఫైనల్​కు ఆర్హత సాధించలేకపోయాడు.

olympics
నీరజ్​ చోప్రా

ఇదీ చూడండి: Tokyo Olympics: హాకీ సెమీస్​లో భారత మహిళా జట్టు ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.