భారత గడ్డపై అతి పెద్ద 'చెస్'​ సంబరం.. బరిలో తెలుగు తేజాలు

author img

By

Published : Jul 28, 2022, 8:01 AM IST

Updated : Jul 28, 2022, 9:13 AM IST

chess olympiad starts from today

Chess Olympiad: 180కి పైగా దేశాలు.. 1700 మందికి పైగా క్రీడాకారులు.. 2 వారాల పాటు చదరంగ పోరాటాల హోరాహోరీ!. భారత్‌ వేదికగా జరగబోతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌.. గురువారమే ప్రారంభం కానుంది. తొలి రోజు ఆరంభ వేడుకలు జరిగిన తర్వాత రోజు నుంచి క్రీడాకారులు కదన రంగంలోకి దిగి అమీతుమీ తేల్చుకోబోతున్నారు. అయితే తొలిసారి సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపియాడ్‌లో పోడియంపై నిలవాలని భారత చదరంగ క్రీడాకారులు ఊవిళ్లూరుతున్నారు.

Chess Olympiad: భారత గడ్డపై అతి పెద్ద చెస్‌ సంబరానికి వేళైంది. ఈ ఆటలో అత్యున్నత టోర్నీల్లో ఒకటైన చెస్‌ ఒలింపియాడ్‌కు గురువారమే శ్రీకారం. రష్యాపై వేటు పడడంతో అనూహ్యంగా ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకున్న భారత్‌.. పోటీల కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల క్రీడాకారులు పాల్గొనే టోర్నీలో ఓపెన్‌, మహిళల విభాగంలో పోటీలు జరుగుతాయి. రెండు విభాగాల్లో మూడేసి చొప్పున భారత్‌ ఆరు జట్లను బరిలోకి దించుతోంది.

బరిలోకి దిగుతున్న తెలుగు తేజాలు.. తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్‌ ఎరిగైసి వివిధ జట్లలో కీలక క్రీడాకారులుగా బరిలోకి దిగుతున్నారు. ఓపెన్‌ విభాగంగా హరికృష్ణ, అర్జున్‌, విదిత్‌, నారాయణన్‌, శశికిరణ్‌లతో కూడిన 'ఎ' జట్టు టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. హంపి, హారిక, వైశాలి, తానియా, భక్తిలతో కూడిన మహిళల 'ఎ' జట్టుకు కూడా పతకావకాశాలున్నాయి. 'సి' జట్టులోని బొడ్డ ప్రత్యూష, సాహితి కూడా తెలుగమ్మాయిలే. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌పై సంచలన విజయాలు సాధించిన యువ క్రీడాకారుడు ప్రజ్ఞానానంద.. 'బి' జట్టులో ఉన్నాడు.

హాట్​ ఫేవరెట్​గా అమెరికా జట్టు.. కరువానా, అరోనియన్‌, వెస్లీ, సామ్‌ షక్లాండ్‌, డొమినిగెజ్‌లతో కూడిన అమెరికా జట్టు పురుషుల విభాగంలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టోర్నీలో అత్యుత్తమ ఎలో రేటింగ్‌ సగటు (2771) ఆ జట్టుదే. రష్యా, చైనా బరిలో లేకపోవడంతో స్వర్ణానికి అమెరికా బలమైన పోటీదారుగా మారింది. భారత్‌కు పసిడి రేసులో పెద్ద అడ్డంకి ఆ జట్టే. ఇంకా ఉక్రెయిన్‌, హంగేరీ, నార్వే కూడా బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ ఛాంప్‌ కార్ల్‌సన్‌ నార్వే జట్టుకు ఆడుతున్నాడు. అతను టోర్నీకే ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు. ఈసారి పోటీలకు దూరంగా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌.. భారత జట్లకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.

chess olympiad starts from today
.

ఇదీ ఫార్మాట్‌
చెస్‌ ఒలింపియాడ్‌ క్లాసికల్‌ స్విస్‌ లీగ్‌ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఇందులో 11 రౌండ్లుంటాయి. ప్రతి రౌండ్లో ఒక జట్టు తరఫున నలుగురు క్రీడాకారులు ప్రత్యర్థి జట్టులోని నలుగురితో తలపడతారు. గేమ్‌ వ్యవధి 90 నిమిషాలు. అందులో 40 ఎత్తులు వేయాలి. నిర్ణీత వ్యవధిలో ఫలితం తేలకుంటే అదనంగా 30 నిమిషాలు ఇస్తారు. 11వ రౌండ్‌ అయ్యేసరికి జట్ల మధ్య పాయింట్లు సమానమైతే టైబ్రేక్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

ఒలింపియాడ్‌లో భారత్‌
చెస్‌ ఒలింపియాడ్‌లో ఒకప్పుడు భారత్‌ నుంచి పతకం ఆశించే పరిస్థితే ఉండేది కాదు. కానీ గత దశాబ్ద కాలంలో కథ మారింది. 2014లో తొలిసారి భారత్‌ కాంస్యం గెలిచింది.ఇక కరోనా కారణంగా ఆన్‌లైన్లో జరిగిన గత రెండు టోర్నీల్లోనూ భారత్‌ అదరగొట్టింది. 2020లో రష్యాతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన భారత్‌.. గత ఏడాది కాంస్యం సాధించింది.

బరిలో ఉన్న భారత జట్లు
ఓపెన్‌ విభాగం
ఎ: పెంటేల హరికృష్ణ, విదిత్‌ గుజరాతి, అర్జున్‌ ఎరిగైసి, నారాయణన్‌, శశికిరణ్‌.
బి: నిహాల్‌ సరీన్‌, గుకేశ్‌, ప్రజ్ఞానానంద, అధిబన్‌, రౌనక్‌ సద్వాని.
సి: సూర్యశేఖర గంగూలీ, సేతురామన్‌, అభిజిత్‌ గుప్తా, కార్తికేయన్‌ మురళి, అభిమన్యు పురాణిక్‌.

మహిళల విభాగం
ఎ: కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణి.
బి: వంతిక అగర్వాల్‌, సౌమ్య స్వామినాథన్‌, మేరీఆన్‌ గోమ్స్‌, పద్మిని రౌత్‌, దివ్య దేశ్‌ముఖ్‌.
సి: ఈషా కర్వాడే, సాహితి వర్షిణి, ప్రత్యూష బొడ్డ, పీవీ నందిద, విశ్వ వస్నవాలా.

75 నగరాలు చుట్టొచ్చిన జ్యోతి
చెస్‌ ఒలింపియాడ్‌ జ్యోతి.. ఆతిథ్య నగరం చెన్నైకి చేరుకుంది. చెస్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒలింపిక్స్‌ తరహాలో తొలిసారి ఒలింపియాడ్‌ కోసమే జ్యోతి రిలేను ఈ ఏడాదే ప్రారంభించారు. జూన్‌ 19న దిల్లీలో ప్రధాని మోదీ ఈ రిలేను ప్రారంభించారు. జ్యోతిని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌కు అందించారు. ఈ రిలే దేశంలోని 75 నగరాల్లో సాగింది. రిలే సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో చెస్‌ పోటీలు నిర్వహించి అందులో టాప్‌-3లో నిలిచిన వారిని చెస్‌ ఒలింపియాడ్‌కు అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. జ్యోతిని తిరిగి అందుకున్న ఆనంద్‌.. గురువారం ఒలింపియాడ్‌ ప్రారంభ వేడుకలో ప్రధాని మోదీకి అందించనున్నాడు.

chess olympiad starts from today
.

ఇప్పటిదాకా జరిగిన ఒలింపియాడ్‌ల సంఖ్య: 43
అత్యధిక టైటిళ్లు: సోవియట్‌ యూనియన్‌+రష్యా (18+8)
ఈసారి ఓపెన్‌ విభాగంలో పోటీ పడుతున్న జట్లు: 188 (186 దేశాలు)
మహిళల విభాగంలో జట్లు: 162 (160 దేశాలు)
పోటీ పడే క్రీడాకారుల సంఖ్య: 1733 (పురుషులు 935, మహిళలు 798)

చెన్నై నగరానికి 58 కి.మీ దూరంలో.. చెస్‌ ఒలింపియాడ్‌ వేదికగా చెన్నైని పేర్కొంటున్నప్పటికీ.. ఆ నగరానికి 58 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురంలో ఈవెంట్‌ జరుగుతుంది. ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఆరంభ, ముగింపు వేడుకలు జరుగుతాయి. ఫోర్‌ పాయింట్స్‌ బై షెరటాన్‌ హోటల్లో పోటీలు నిర్వహిస్తారు.

ఇవీ చదవండి: 'చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్​కు అదే అతిపెద్ద బలం'

నిండు గర్భిణి అయినా.. 'ఒలింపియాడ్‌' బరిలోకి హారిక

Last Updated :Jul 28, 2022, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.