'ఎన్నాళ్లకెన్నాళ్లకు!'.. సుదీర్ఘ నిరీక్షణకు తెర.. కోహ్లీ ముఖంపై చిరునవ్వు!

author img

By

Published : Mar 11, 2023, 6:42 PM IST

kohli

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ.. 14 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. టెస్టుల్లో 29వ హాఫ్‌ సెంచరీని సాధించాడు. దీంతో అతడి ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు.

ప్రతిష్ఠాత్మక బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా అహ్మాదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ అర్ధశతకంతో మెరిశాడు. 14 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. టెస్టుల్లో 29వ హాఫ్‌ సెంచరీని సాధించాడు. భారత్​ తొలి ఇన్నింగ్స్‌ 92.4వ ఓవర్లో ఆసీస్​ బౌలర్​ నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో 2 పరుగులు తీసి హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్​లో చివర సారిగా విరాట్.. టెస్టుల్లో హాఫ్​ సెంచరీని సాధించాడు. ఆ మ్యాచ్‌లో 201 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 79 పరుగులు చేసి.. కగిసో రబడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత సంప్రదాయ క్రికెట్లో వరుసగా.. 29, 45, 23, 13, 11, 20, 1, 19 నాటౌట్‌, 24, 1, 12, 44, 20, 22, 13 స్కోర్లు నమోదు చేశాడు.

అలా వరుసగా 15 ఇన్నింగ్స్‌ పాటు కోహ్లీ ఒక్క ఫిఫ్టీ కూడా సాధించలేకపోయాడు. తాజాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 2023 నాలుగో టెస్టు సందర్భంగా టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో కింగ్‌ కోహ్లీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. "ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నీకిష్టమైన టెస్టుల్లో హాఫ్‌ సెంచరీ.. చాలా రోజులైంది నీ ముఖంపై ఇలాంటి చిరునవ్వు చూసి! దటీజ్‌ కింగ్‌ కోహ్లీ" అని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​లో యువ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ శతకం(128)కి తోడు ఛెతేశ్వర్‌ పుజారా 42, కోహ్లీ 59(నాటౌట్‌) పరుగులతో రాణించడంతో టీమ్​ఇండియా మెరుగైన స్కోరు చేయగలిగింది. దీంతో శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఇంకా 191 పరుగులు వెనుబడి ఉంది. ప్రస్తుతం విరాట్​ కోహ్లీ 59, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కాగా, నాలుగో టెస్టు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​లో యువ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్ తన టెస్టు కెరీర్​లో తన రెండో సెంచరీని నమోదు చేశాడు. 235 బంతుల్లో 128 పరుగులు సాధించాడు. కాగా, స్వదేశంలో గిల్​కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం గిల్​ 15వ టెస్టు ఆడుతున్నాడు. అయితే, మూడో టెస్టులో కఠిన పిచ్​పై అనుకున్నంతగా రాణించలేకపోయాడు. దీంతో టీమ్ఇండియా మాజీ దిగ్గజం సునీల్​ గావస్కర్​ గిల్​ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇలాగే ఆడితే భవిష్యత్​లో గిల్​ 8 వేల నుంచి 10 వేల పరుగులు సునాయాసంగా చేస్తాడని పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.