తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న లంక.. భారత్​కు ఊహించని షాక్‌ ఇస్తుందా?

author img

By

Published : Mar 10, 2023, 9:24 PM IST

sri Lanka tightening its grip in the first test with newzealand will give a shock to India?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగిస్తోంది. తొలుత బ్యాటింగ్‌ పరంగా కివీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన లంక బ్యాటర్లు.. ఇప్పుడు బౌలర్లు కూడా దుమ్ము రేపుతున్నారు. మరోవైపు, టీమ్​ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్​ క్రికెటర్లు అదరగొడుతున్నారు. దీంతో భారత్​ అభిమానులు.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్​ విషయంపై కాస్త ఆందోళన చెందుతున్నారు.

క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు కీలక వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. క్రీజులో డార్లీ మిచెల్‌(40), బ్రేస్‌వేల్‌(9) పరుగులతో అజేయంగా ఉన్నారు. తొలుత బ్యాటింగ్‌ పరంగా కివీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక.. ఇప్పుడు బౌలర్లు కూడా దుమ్ము రేపుతున్నారు.

లంక బౌలర్ల దాటికి కివీస్‌ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగుల మెరుగైన స్కోర్‌ సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (87) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. కెప్టెన్‌ కరుణరత్నే (50), ఏంజెలో మాథ్యూస్ (47), ధనుంజయ డిసిల్వ (46) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టిమ్ సౌథీ ఐదు వికెట్లు తీయగా మాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీశాడు.

ఒక వేళ ఈ మ్యాచ్​లో శ్రీలంక విజయం సాధిస్తే.. ఆ ప్రభావం వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిఫ్‌ ఫైనల్‌ రేసుపై పడనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖరారు చేసుకోగా మరో స్థానం కోసం టీమ్​ఇండియా, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ విజయం సాధించినా, డ్రాగా ముగించినా.. శ్రీలంక గెలుపోటములతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్​ఇండియా ఓటమి పాలై.. కివీస్‌ సిరీస్‌ను శ్రీలంక 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేస్తే, అప్పుడు లంకేయులు డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడతారు. కానీ శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడినా చాలు.. వారి డబ్ల్యూటీసీ కథ ముగిస్తోంది!

మరోవైపు, బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా కీలకమైన నాలుగో టెస్ట్​లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 255/4తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్‌.. 167.2 ఓవర్లలో 480 పరుగుల వద్ద ఆలౌటైంది. బ్యాటింగ్‌ ఖవాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలు బాదేశారు. ట్రావిస్‌ హెడ్‌ (32), స్టీవ్‌ స్మిత్‌ (38), నాథన్‌ లైన్‌ (34), మర్ఫీ (41) కూడా రాణించారు. భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు స్కోరు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు(తాజా మ్యాచ్‌ కలిపి) తొమ్మిది సందర్భాల్లో ఈ మేర మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్కు దాటింది. తాజా మ్యాచ్‌ మినహాయిస్తే.. ఈ మేర స్కోరు చేసిన సందర్భాల్లో ఒకసారి ఆస్ట్రేలియా విజయం సాధించగా.. నాలుగు సార్లు ఓటమిపాలైంది. మూడుసార్లు మ్యాచ్‌ డ్రా చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.