Csk ipl trophies: చెన్నై జట్టు.. అందుకే 'సూపర్ కింగ్స్'

author img

By

Published : Oct 16, 2021, 10:04 AM IST

CHENNAI SUPER KINGS

పడటం తప్పు కాదు... ఆ తర్వాత బలంగా లేవకపోవడం తప్పు. ఈ పనిని సమర్థంగా చేసిన వారిని బయట హీరోలు అంటారు. అదే ఐపీఎల్‌ (IPL)లో అయితే 'చెన్నై సూపర్‌ కింగ్స్‌'(Chennai Super Kings) అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఐపీఎల్‌ 2021 (IPL 2021)లో మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) సేన ప్రదర్శన అలా ఉంది మరి. ఐపీఎల్ 2020 (IPL 2020)లో పాయింట్ల పట్టికలో ఆఖరు నుంచి రెండులో ఉండిపోయిన చెన్నై.. ఈ ఏడాది 'సూపర్‌' ఆటతో విజేతగా (IPL 2020 Winner) ఎలా నిలిచింది. ఈ ఏడాదిలో సీఎస్‌కే (CSK) ఏం చేసింది?

ఐపీఎల్‌ విజేతగా నిలివడమంటే చిన్న విషయమేమీ కాదు. ప్రపంచ స్థాయి స్టార్‌ ప్లేయర్లు, యువ భారత్‌ మెరికలు ఉన్న ఎనిమిది జట్ల మధ్య జరిగే పోరు ఇది. ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌ అనుకుంటూ ముందుకెళ్తేనే విజయం తథ్యం. మ్యాచ్‌, మ్యాచ్‌కు కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తూ, ప్లేయర్‌ ప్లేయర్‌కూ కొత్త ఉచ్చులు బిగిస్తూ ఉండాలి. అలా చేయడంలో దిట్ట అనిపించుకున్న జట్లే ఫైనల్‌కు వెళ్తాయి. అక్కడ, ఆ రోజు మేటి ప్రదర్శన ఇచ్చిన జట్టు విజేతగా నిలుస్తుంది. అలా ఈ ఏడాది గెలుపొందిన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌.

.
.

ఏడాది వెనక్కి వెళ్లి వస్తే...

ఈ ఏడాది చెన్నై ఎలా గెలిచింది? ఎవరెవరు ఎలా ఆడారు? లాంటి విషయాలు తర్వాత చూద్దాం. ఈలోపు ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌కు అంటే ఒక సంవత్సరం వెనక్కి వెళ్లి వద్దాం. గతేడాది ఐపీఎల్‌ ధోనీ సేనకు ఓ పీడకల లాంటిది! అభిమానులకు ఏమాత్రం రుచించని, ఊహించని పరాభవం అది. 14 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు విజయాలతో ఏడో స్థానంలో ఉండిపోయింది సీఎస్‌కే. లీగ్‌ ఆఖరి మ్యాచ్‌లో గెలిచాక.. ధోనీ మాట్లాడుతూ "మా టీమ్‌లో కుర్రాళ్లను సరిగ్గా సెట్‌ చేసుకొని... మళ్లీ వస్తాను. ఈసారి మా జట్టు సత్తా ఏంటో చూపిస్తాను" అని అన్నాడు. అన్నమాట ప్రకారం ఈ ఏడాది టోర్నీ విజేతగా నిలిచి చూపించాడు.

ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేద్దాం. ధోనీ అభిమానులు, చెన్నై అభిమానులు గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారు. కారణం ఐపీఎల్ 2021సెకండ్‌ ఫేజ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి.. మేటి జట్లు అనుకున్న వాటిని సైతం మట్టికరిపించి ఫైనల్‌కు వచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders)పై ఫైనల్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అయ్యాక ధోనీ కూడా ఇదే మాట చెప్పాడు.

.
.

"మా జట్టు ఆట గురించి తర్వాత మాట్లాడదాం. కోల్‌కతా ఆట తీరు గురించి ముందుగా చెప్పుకోవాలి. మొదటి ఫేజ్‌లో రెండే విజయాలతో వెనుకబడిపోయి.. రెండో ఫేజ్‌ ప్రారంభించి వరుస విజయాలతో ఫైనల్‌కు వచ్చారు. వారిని ఎంత పొగిడినా తక్కువే. నా మటుకు వారే విజేతలు" అంటూ ధోనీ పొగిడేశాడు. ధోనీ కదా! ఆయనంతే.. అలా కష్టానికి విలువిచ్చేస్తుంటాడు.

రెండేళ్ల క్రితం ధోనీ..

2021 ఐపీఎల్‌ సీజన్‌ మొదలవుతుందనగా అభిమానుల్లో ఏదో ఆందోళన. జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనేది ఒక కారణం అయితే.. మరోది ధోనీ గతేడాది పడ్డ ఇబ్బందులు. ఒకానొక సమయంలో మైదానంలో ఎక్కువ సేపు నిలబడేటప్పుడు ధోనీ అలసిపోవడం కనిపించింది. ఓ మ్యాచ్‌లో వేగంగా పరుగు తీసే క్రమంలో ధోనీ ఆయాసపడిపోవడమూ చూశాం. చెన్నై సింహం అలా అలసిపోవడం అభిమానులకు అంతగా మనస్కరించలేదు. దీంతో ఈ ఏడాది మహేంద్రుడు ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కానీ తలాలో ఆ ఫీల్‌ అస్సలు కనిపించలేదు. ఏడాది విరామం వచ్చింది కదా.. మొత్తంగా మారిపోయాడు. 2019 నాటి ధోనీ కనిపించాడు.

.
.

అలసిపోయారా అనుకుంటే...

ధోనీ లాగే చెన్నై జట్టు ఆటతీరులోనూ అదే జోష్‌ కనిపించింది. అప్పటివరకు వరుసగా తమ దేశాలకు మ్యాచ్‌లు ఆడుకుంటూ వచ్చిన డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ, హేజిల్‌వుడ్‌ లాంటి ఆటగాళ్లు.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి దూరమైన/దూరంగా ఉన్న ధోనీ, సురేశ్‌ రైనా, రాబిన్‌ ఉతప్ప, డ్వేన్‌ బ్రేవో లాంటివారు కలసి తామెందుకు ఛాంపియన్ జట్టో అనేది నిరూపించారు. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో ఫైనల్‌కు వచ్చేశారు. నిజానికి ఇంకా ఎక్కువే విజయాలు ఉండాల్సింది. లీగ్‌లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో ధోనీ సేన కాస్త లయ తప్పింది. దీంతో విజయాలు 9కి పరిమితమయ్యాయి. అంతే కాదు అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఏంటి 'చెన్నై సింహాలు' మళ్లీ అలసిపోయాయా అనుకున్నారంతా!

బెస్ట్‌ ఫినిషర్‌ బయటికొచ్చి...

"అందరూ చెన్నై టీమ్‌ను వయసైన వాళ్లు అంటుంటారు. కానీ నేను వాళ్లు అనుభవజ్ఞులు అంటాను" శుక్రవారం రాత్రి సీఎస్కే కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ చెప్పిన మాట ఇది. ప్లేఆఫ్స్‌కు వచ్చేసరికి ధోనీ సేన చేసింది కూడా అదే. లీగ్‌లో ఆఖరి మూడు మ్యాచ్‌లు ఓడిపోయారనే విషయం కూడా మరచిపోయేలా అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో విజృంభించి ఆడారు. 'ఒకానొక కాలంలో బెస్ట్‌ ఫినిషర్‌' అంటూ ధోనీని ఈ మధ్య కొంతమంది క్రికెట్‌ పెద్దలు విమర్శిస్తూ వచ్చేవారు. కానీ ఆ సింహం జూలు విదిల్చింది. అది కూడా జట్టుకు అత్యవసరమైన సమయంలో. క్వాలిఫయర్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ (6 బంతుల్లో 18 పరుగులు)... తననెందుకు బెస్ట్‌ ఫినిషర్‌ అంటారో మరోసారి నిరూపించాడు.

.
.

ఆ అవకాశం ఇవ్వలేదు...

ఫైనల్‌కు వచ్చేసరికి ధోనీసేన అభిమానులకు 2012 భయం పట్టుకుంది. అప్పుడు చెన్నై 190 పరుగులు చేస్తే... మన్విందర్‌ బిస్లా (89) విశ్వరూపం చూపించి కోల్‌కతాకు కప్‌ అందించాడు. దీంతో ఈ ఏడాది మ్యాచ్‌లో చెన్నై ప్రతీకారమా, కోల్‌కతా పునరావృతమా అని అనుకున్నారు. దానికి తోడు ఈసారి కూడా తొలుత బ్యాటింగ్‌ చేసిన ధోనీసేన అప్పటి స్కోరుకు దగ్గరగా 192 పరుగులు చేసింది. అయితే ఈసారి ధోనీ ఆ అవకాశం ఇవ్వలేదు. పకడ్బందీ ప్రణాళికలు రచించి... కోల్‌కతాను 165 పరుగులకు కట్టడి చేశాడు. దీంతో నాలుగో ఐపీఎల్‌ చెన్నైకి చేర్చాడు.

'కొత్త' మంత్రం పని చేసింది...

2020 టోర్నీలో ఆఖరులో చెన్నై 'కొత్త' మంత్రం జపించింది. సీనియర్లను జట్టులో ఉంచుతూనే, కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. అప్పుడు ఫలితం కనిపించింది కూడా. 2021కి వచ్చేసరికి సీనియర్లు, జూనియర్ల మేళవింపు చక్కగా కుదుర్చుకున్నారు. బౌలింగ్‌లో జూనియర్లను, బ్యాటింగ్‌లో సీనియర్లను తీసుకున్నాడు ధోనీ. బ్యాటింగ్‌లో రుతురాజ్‌ను తన తురుపుముక్కగా మలచుకున్నాడు. ఈ ఏడాది ఆరెంజ్‌ క్యాప్‌ రుతురాజ్‌కే (635 పరుగులు) దక్కింది. బౌలింగ్‌లో దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తమకు అప్పగించిన పని చేసి పెట్టారు. జడేజా, బ్రావో లాంటి సీనియర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచి ఆడటం చెన్నైకి సాంబారుతో పెట్టిన విద్య. సీజన్‌ ప్రారంభం నుంచి జట్టుతోనే ఉన్నా... రాబిన్‌ ఉతప్పకు ప్లే ఆఫ్స్‌ వరకూ అవకాశం లేదు. సురేశ్‌ రైనా గాయపడటం వల్ల జట్టులోకి వచ్చిన ఉతప్ప.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఉతికి ఆరేశాడు. ఫైనల్‌లో (31) పరుగులతో మెప్పించాడు. డగౌట్‌లోని ప్లేయర్‌ వచ్చి రాగానే మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడంటే.. టీమ్‌ ఆలోచన తెలుస్తుంది. ఎంతలా అతణ్ని సన్నద్ధం చేశారో అర్థమవుతుంది.

.
.

అదే చెన్నై స్పెషల్‌..

జట్టులో మ్యాచ్‌ విన్నర్లు ఉండటం చాలా అవసరం. చెన్నైలో అయితే ఆఖరి ఆటగాడివరకు మ్యాచ్‌ విన్నరే అని చెప్పాలి. అవకాశం వచ్చిన రోజు.. తమ ప్రదర్శనతో మెప్పించి, మ్యాచ్‌ను మలుపుతిప్పి గెలిపించేస్తారు. అందుకే ధోనీ గత మ్యాచ్‌ల ప్రదర్శన మీద కాదు... ఆటగాడి ప్రతిభ మీద నమ్మకం ఉంచుతాడు. వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా జట్టులో కొనసాగిస్తాడు. ఇదే మాట శుక్రవారం మ్యాచ్‌ తర్వాత మొయిన్‌ అలీ కూడా అన్నాడు. అప్పటివరకు సరైన ప్రదర్శన ఇవ్వని.. మొయిన్‌ అలీని జట్టులో కొనసాగించడమే కాదు, ఏకంగా ఫైనల్‌లో ప్రమోషన్‌ ఇచ్చి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడు కంటే ముందు పంపాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మొయిన్‌ (37*) రాణించాడు. జట్టుకు విలువైన పరుగులు ఇచ్చాడు.

.
.

యాజమాన్యం కూడా సూపర్‌...

సిరీస్‌లో సరైన ప్రదర్శన ఇవ్వకపోతే, ఇంకా చెప్పాలంటే వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో ప్రదర్శన బాగోలేకపోతే ఆ ఆటగాడిని, ఒక్కోసారి కెప్టెన్‌నే పక్కన పెట్టేస్తున్న ఫ్రాంచైజీలు ఉన్న టోర్నీ ఇది. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం అలా ఆలోచించలేదు. 2020లో ఆఖరి నుంచి రెండో స్థానంలో జట్టును నిలిపినా... ధోనీపై నమ్మకం ఉంచింది. జట్టుకు ఎవరు అవసరం, ఏం అవసరం అని తన కెప్టెన్‌తో, కోచ్‌ ఫ్లెమింగ్‌ టీమ్‌తో యాజమాన్యం నిత్యం టచ్‌లో ఉంది. యాజమాన్యం అలాంటి ఆలోచనతో ఉండటం వల్లే... ఈ ఏడాది కప్ గెలుచుకుంది.

విజిల్‌ పోడు కుర్రాళ్లు

చెన్నై విజయానికి అభిమానులు కూడా ఓ కారణం. 'విజిల్‌ పోడు'(ఈల కొట్టు) అంటూ సోషల్‌ మీడియాలోనూ, మైదానంలోనూ సందడి చేస్తుంటారు. జట్టును ఉత్సాహపరుస్తుంటారు. మ్యాచ్‌ తర్వాత ధోనీ కూడా ఇదే మాట చెప్పాడు. "మేం ఎక్కడ ఆడినా... మా 'ఎల్లో ఫ్యాన్స్‌' అక్కడ మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అది చెన్నై అయినా, దుబాయి అయినా, దక్షిణాఫ్రికా అయినా వాళ్ల అభిమానం ఒకేలా ఉంటుంది. విదేశాల్లో ఆడినా మైదానాన్ని పసుపుతో నింపేసి మేము చెన్నై చెపాక్‌ స్టేడియంలో ఉన్నామా అనే అనుభూతిని కలిగిస్తున్నారు. జట్టుకు అది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చాడు ధోనీ.

.
.

ఆఖరిగా.. నాలుగు సార్లు చెన్నైకి ఐపీఎల్‌ ట్రోఫీ అందించిన ధోనీ ఆకలి ఇంకా తీరలేదు. తర్వాతి సీజన్‌లలోనూ తన మార్క్‌ ప్రదర్శన ఉంటుందని చెప్పేశాడు. దీంతో ఐపీఎల్‌ రిటైర్‌మెంట్‌ పుకార్లకు ఇప్పటికైతే ఫుల్‌స్టాప్‌ పడింది. ఇక ధోనీ మాస్టర్‌ మైండ్‌లో ఐపీఎల్‌ చిప్‌ తీసేసి, టీ20 ప్రపంచకప్‌ చిప్‌ పెట్టేసుంటాడు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్‌లో ధోనీ... 'మెంటార్‌ సింగ్‌ ధోనీ'గా మారబోతున్నాడు. మెగా టోర్నీలో విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును గెలిపించేందుకు అప్పుడే ప్రణాళికలు రచించేస్తుంటుంది ఆ మ్యాజిక్‌ బుర్ర.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.