ముంబయి, చెన్నై లేకుండానే ప్లే ఆఫ్స్​​.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారా?

author img

By

Published : May 13, 2022, 12:52 PM IST

IPL 2022

IPL: ఐపీఎల్​లో గత 14 సీజన్లలో అదరగొట్టిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్​ జట్లు ఈసారి చతికిలపడ్డాయి. ప్రతిసారి ఈ రెండు టీంలలో కచ్చితంగా ఒక జట్టు సెమీస్​లోగానీ ప్లే ఆఫ్స్​లో గానీ ఉండేది. కానీ ఈ సీజన్​లో పాయింట్లు పట్టికలో అట్టడుగున నిలిచాయి. అయితే ముంబై, చెన్నై లేకుండా ఇప్పటివరకు ఐపీఎల్​లో ప్లే ఆఫ్స్​ జరిగిన సందర్భాలున్నాయా? ఇప్పుడు చూద్దాం..

IPL 2022: ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్ కింగ్స్​.. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో దిగ్గజ జట్లు. ఈ టీంలతో తలపడాలంటేనే ప్రత్యర్థి జట్లు వణికిపోతుంటాయి. గత 14 సీజన్లలోనూ ఈ రెండు జట్లదే ఆధిపత్యం. ముంబయి 9 సార్లు ప్లే ఆఫ్స్​కు వెళ్లి 5 సార్లు ఛాంపియన్​గా నిలవగా.. చెన్నై ఏకంగా 11 సార్లు ఫైనల్​కు వెళ్లి 4 సార్లు కప్పు గెలిచింది. కానీ ఐపీఎల్ 15 సీజన్​లో మాత్రం పరిస్థితి తలకిందులయ్యింది. ఎప్పుడూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీపడే ఈ జట్లు.. ఈసారి చిట్టచివరి రెండు స్థానాల్లో నిలిచాయి. అంచనాలను అందుకోలేక చతికిలపడ్డాయి.

IPL News: ఐపీఎల్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ముంబయి, చెన్నై జట్లలో ఏదో ఒక టీం కచ్చితంగా ప్లే ఆఫ్స్​లో ఉండేది. మ్యాచ్​ ఫిక్సింగ్ ఆరోపణలతో సీఎస్​కే నిషేధానికి గురైన 2016 సీజన్ తప్పిస్తే ప్రతి ఐపీఎల్​ సీజన్​లోనూ ముంబై, చెన్నైలో ఒక జట్టు ప్లే ఆఫ్స్​లో ఉంది. కానీ ఈసారి మాత్రం ఈ రెండు జట్లు లేకుండానే ప్లే ఆఫ్స్​ జరగనున్నాయి. ఈ సీజన్​లో 12 మ్యాచ్​లు ఆడిన చెన్నై కేవలం 4 మ్యాచుల్లో గెలిచి 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ముంబయి కూడా 12 మ్యాచ్​లు ఆడి మూడే విజయాలతో ఆరు పాయింట్లు సాధించి అట్టడుగున 10వ స్థానంలో ఉంది.

ముంబయి ఘోర వైఫల్యం: ఈ సీజన్​లో ముంబయి జట్టు అత్యంత దారుణంగా విఫలమైంది. ఆడిన తొలి 8 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. చివరకు 9 మ్యాచ్​లో తొలిసారి గెలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణించకపోవడం ఈ జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం. సూర్యకుమార్ యాదవ్​ మినహా మిడిలార్డర్ పటిష్ఠంగా లేకపోవడం, పొల్లార్డ్​ ఫాం కోల్పోవడం, బుమ్రా కూడా ఆశించినంత ప్రదర్శన చేయకపోవడం వల్ల ముంబయి చతికిలపడింది. వేలంపాటలో డికాక్, బౌల్ట్ వంటి కీలక ఆటగాళ్లను కోల్పోవడం కూడా జట్టు కూర్పుపై ప్రభావం చూపింది.

ipl-2022
ముంబయి, చెన్నై లేకుండానే ప్లే ఆప్స్​.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారా?

అట్టిపెట్టుకున్న వాళ్లు ఆడక చెన్నై డీలా: ఈ సీజన్‌కు ముందు చెన్నై నలుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. వాళ్లే ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, కెప్టెన్‌ ధోనీ, విదేశీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ. ఈ నలుగురూ చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లు కావడంతో ఈసారి తమకు ఐదో కప్పును అందిస్తారని జట్టు యాజమాన్యం భావించింది. కానీ, ఈ నలుగురూ విఫలమై ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఈ సీజన్‌ ఆరంభంలో ధోనీ కెప్టెన్‌గా తప్పుకోవడంతో కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకుంటాడని అభిమానులు ఆశించారు. అనుకున్నట్లే కొన్ని మ్యాచ్‌ల్లో అతడు ఫినిషర్‌గా రాణించాడు. ఇక కీపర్‌గానూ ధోనీ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. అయితే.. జడేజా పగ్గాలు వదులుకున్నాక మళ్లీ సారథ్య బాధ్యతలు అందుకున్నా నాలుగింటిలో రెండు మాత్రమే గెలిపించాడు.

ipl-2022
ముంబయి, చెన్నై లేకుండానే ప్లే ఆప్స్​.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారా?

ఈ సీజన్​లో ఎవరూ ఊహించని విధంగా కొత్త ప్రాంఛైజీలు లఖ్​నవూ సూపర్ జెయింట్స్​, గుజరాత్ లయన్స్ అదిరే ప్రదర్శన చేశాయి. పాయింట్లు పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్తులు దాదాపు ఖరారు చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం రాజస్థాన్, బెంగళూరు, దిల్లీ, కోల్​కతా, హైదరాబాద్​ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్ టెస్ట్​ జట్టు హెడ్​ కోచ్​గా మెక్​కలమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.