ఆసీస్‌-భారత్‌ తొలి వన్డే.. రోహిత్​ దూరం.. మన కుర్రాళ్లు ఏం చేయనున్నారో?

author img

By

Published : Mar 17, 2023, 8:58 AM IST

Updated : Mar 17, 2023, 9:27 AM IST

india-vs-australia-1st-odi

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే ఆసీస్‌​తో మరో పోరుకు సిద్ధమవుతోంది టీమ్ ఇండియా. శుక్రవారం ఆరంభం కానున్న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరుకు హార్దిక్​ సేన రెడీగా ఉంది.

భారత్​ గెలుపుతో బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ ముగిసింది. ఇక ఐపీఎల్​ సీజన్​ రానే వచ్చింది. వీటి మధ్యలోనే వన్డే పోరులో ఆసీస్‌తో తలపడనుంది రోహిత్ సేన. వాంఖడే వేదికగా ఈ మూడు మ్యాచ్​ల సిరీస్​ శుక్రవారం ప్రారంభం కానుంది. అయితే టీమ్ఇండియా దృష్టంతా ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ పైనే ఉంది. 2011లో భారత్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చినప్పుడు ధోనీ సేన ఆ కప్పు గెలిచింది. ఈ క్రమంలో రానున్న ప్రపంచ కప్​ను కూడా తాము సాధించాలని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది టీమ్​ఇండియా. ఇక స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు ఈ తొలి వన్డే ఓ పరీక్షగా నిలవనుంది. కుటుంబ కారణాలతో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మొదటి మ్యాచ్‌కు దూరం కాగా.. ఇప్పుడు ఆ బాధ్యతలను హార్దిక్‌ తీసుకున్నాడు. ఈ సిరీస్‌కు అతను వైస్‌ కెప్టెన్‌. ఈ వన్డే జోరును అందుకోవడమనేది ఇరు జట్లకు సవాలుతో కూడిన విషయమే. కానీ ఈ సిరీస్‌ ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగం కాదు.

వన్డే ఫార్మాట్లతో ఈ ఏడాదికి శుభరంభం పలికిన టీమ్​ఇండియా ఇక రానున్న మ్యాచ్​లకు అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. జరిగిన రెండు సిరీస్‌ల్లోనూ న్యూజిలాండ్‌, శ్రీలంకలతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్​దే పై చేయిగా నిలిచింది. అంతే కాకుండా ఇప్పుడు యువ ప్లేయర్​ శుభ్‌మన్‌ ఫామ్‌ టీమ్​ఇండియాకు బాగా కలిసొచ్చే అంశం. ఇది వరకు జరిగిన ఆరు వన్డేల్లో అతడు 113.40 సగటుతో ఏకంగా 567 పరుగులు సాధించాడు. రోహిత్‌ లేని సమయంలో గిల్​ ఇప్పుడు అభిమానులను మరింతగా ఆకర్షించనున్నాడు. కాగా అహ్మదాబాద్‌ టెస్టులో బాదిన శతకంతో ఇంకాస్త జోరు పెంచాడు.

మరోవైపు విరాట్​ కోహ్లీ కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ మోస్తరుగా ఆడాడు. ఆరు మ్యాచ్‌ల్లోనూ 67.60 సగటుతో 338 పరుగులను స్కోర్​ చేశాడు. ఫామ్‌లో ఉన్న కోహ్లీ కూడా మరిన్ని పరుగులు సాధించి జట్టును విజయ పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నారు. ఇక ఆసీస్‌ స్పిన్నర్‌ అడమ్‌ జంపాతో కోహ్లీ పోరు మరింత ఆసక్తి రేపుతోంది. విరాట్‌ బ్యాటింగ్​కు అతడు గతంలో మెరుగ్గానే బౌలింగ్‌ వేశాడు.

ఓపెనర్లుగా గిల్‌తో పాటు ఇషాన్‌ మైదానంలోకి రానున్నారు. రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేసే అవకాశాలున్నాయి. ఇక ఇతర ఆటగాళ్లు హార్దిక్‌, సూర్యకుమార్‌, జడేజాలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ బాగానే కనిపిస్తోంది. అయితే స్కై​కు ఈ సిరీస్‌ ఓ పరీక్ష అనే చెప్పాలి. టీ20ల్లో చెలరేగే సూర్య కుమార్​ ఎందుకో వన్డేల్లో అంతగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 18 వన్డేల్లో అతని సగటు 28.86 మాత్రమే. దీంతో ఈ సిరీస్‌లోనైనా అతడు రాణిస్తాడేమో వేచి చూడాలి.

ఓ వైపు గాయాలతో శ్రేయస్‌, బుమ్రాలు మ్యాచ్​కు దూరమవ్వడం భారత్‌కు ఎదురుదెబ్బ. బుమ్రా గైర్హాజరీలో ఇక పేస్‌ దళానికి మహ్మద్​ సిరాజ్‌ నాయకత్వం వహించనున్నాడు. జడేజాతో పాటు శార్దూల్‌ టీమ్​ను బ్యాలెన్స్​ చేసేలా ఉన్నాడు. దీంతో జడేజాతో కలిసి అక్షర్‌ పటేల్‌ లేదా సుందర్‌ ఇక స్పిన్‌ బాధ్యతలు పంచుకునే అవకాశాలున్నాయి. దీంతో సిరాజ్‌, శార్దూల్‌తో కలిసి షమి కూడా పేస్‌ భారాన్ని మోసే అవాకాశాలున్నాయి.

జోరు మీదున్న కంగారు జట్టు..
నవంబర్ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ ఆడనున్న​ వన్డే సిరీస్‌ ఇదే. అయితే టెస్టు సిరీస్‌లో ఉన్న అదే జోరును ఇప్పుడూ కొనసాగిస్తోంది. పైగా 2016 నుంచి భారత్‌లో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ గెలిచిన ఏకైక పర్యటక జట్టు ఆసీస్‌దే కావడం వల్ల వారి నమ్మకం మరింత బలపడింది. కెప్టెన్‌ ప్యాట్​ కమిన్స్‌ దూరమైనప్పటికీ సిరీస్‌లో విజయం సాధించేందుకు అవసరమైన బలం కంగారు జట్టుకు ఉంది. ఆ జట్టుకు ఇప్పుడు స్మిత్‌ నాయకత్వం వహించనున్నాడు. కమిన్స్‌తో పాటు హేజిల్‌వుడ్‌, జేరిచర్డ్‌సన్‌ మ్యాచ్​ కోసం లేకపోయినప్పటికీ స్టార్క్‌, గ్రీన్‌ల రూపంలో ఆస్ట్రేలియా టీమ్​కు నాణ్యమైన పేసర్లు ఉన్నారనే చెప్పాలి. వారికి తోడుగా ఇప్పుడు ఎలిస్‌ కూడా ఉన్నాడు. ఇక స్పిన్‌ విభాగంలో జంపాకు తోడుగా మ్యాక్స్‌వెల్‌ ఉన్నాడు. వార్నర్‌, హెడ్‌, స్మిత్‌, లబుషేన్‌, స్టాయినిస్‌, మ్యాక్స్‌వెల్‌లతో కూడిన ఆసీస్‌ లైనప్‌ హార్దిక సేనకు సవాలు విసిరేందుకు సిద్ధంగా ఉంది.

Last Updated :Mar 17, 2023, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.