'పేసర్​ అవ్వాలనుకున్నా.. కానీ స్పిన్నర్ అయ్యా'

author img

By

Published : Dec 7, 2021, 7:31 AM IST

Ajaz Patel news, Ajaz Patel nterview అజాజ్ పటేల్ న్యూస్, అజాజ్ పటేల్ ఇంటర్వ్యూ

Ashwin Ajaz Patel Interview: టెస్టుల్లో 10 వికెట్ల ఘనత సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్. మొదట పేసర్ కావాలనుకున్నా ఎత్తు తక్కువగా ఉండటం వల్ల స్పిన్​ను ఎంచుకున్నానని వెల్లడించాడు. భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్​తో కలిసి పలు విషయాలు పంచుకున్నాడు అజాజ్.

Ashwin Ajaz Patel Interview: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఏకంగా పది వికెట్లు తీసి చరిత్ర నెలకొల్పాడు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్. ఈ మ్యాచ్​లో భారత్ గెలిచాక.. టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ ఇతడిని ఇంటర్వ్యూ చేశాడు. ఈ నేపథ్యంలోనే మాట్లాడిన అజాజ్.. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలవడం తన అదృష్టమని అన్నాడు. ముంబయిలోనే పుట్టిన అతను తన చిన్నతనంలో కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వలస వెళ్లాడు.

"ఇదెంతో ప్రత్యేకమైన ప్రదర్శన. వాంఖడేకు వచ్చి ఆడడమన్నది ఓ కల. అలాంటిది 10 వికెట్ల ప్రదర్శన చేయడం నాతో పాటు నా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ విషయంలో నేను అదృష్టవంతుణ్ని. సుదీర్ఘ కాలం పాటు సరైన ప్రదేశాల్లో బౌలింగ్‌ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఓ స్పిన్నర్‌గా కొన్నిసార్లు తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మూడు రోజుల్లో 70కి పైగా ఓవర్లు వేశా. సహకరిస్తున్న పిచ్‌పై నిలకడగా బంతులేయడం ముఖ్యం. భారత ఆటగాళ్లు స్పిన్‌ను సమర్థంగా ఆడతారని తెలుసు. వాళ్లు నాపై ఒత్తిడి తెచ్చారు. అందుకే ప్రతి బంతినీ కట్టుదిట్టంగా వేశా. ఒకవేళ నేను వెనకబడితే నాపై ఆధిపత్యం చెలాయిస్తారని తెలుసు. అందుకే కాస్త బుర్ర పెట్టి ఆడా. కివీస్‌లో అందరిలాగే నేనూ మొదట పేసర్‌ అవ్వాలనుకున్నా. కానీ నా ఎత్తు తక్కువ ఉండటం వల్ల స్పిన్‌ను ఎంచుకున్నా. అశ్విన్‌ బౌలింగ్‌ను చూడడం గొప్పగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిస్థితుల్లోనూ అతను వికెట్లు తీశాడు."

-అజాజ్‌ పటేల్, న్యూజిలాండ్ క్రికెటర్

అనంతరం అజాజ్​ను.. అశ్విన్‌ ప్రశంసల్లో ముంచెత్తాడు. "భారత్‌కు చెందిన ఓ మధ్య తరగతి కుటుంబం కివీస్‌కు వలస వెళ్లడం. అక్కడ అతని తండ్రి ఓ వర్క్‌షాప్‌ పెట్టుకోవడం. ఇప్పుడు అజాజ్‌ ఈ స్థాయికి చేరుకోవడం. ఇదో అద్భుతమైన ప్రయాణం. అతను గొప్ప ప్రదర్శన చేశాడు. వాంఖడేలో ప్రతిసారి బంతి తిరగదు. కానీ అతను సీమ్‌ను ఉపయోగించుకుని సరైన ప్రదేశాల్లో బంతులేశాడు. అతని బౌలింగ్‌ను ఎంతో ఆస్వాదించా. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నా. ఇప్పటివరకూ అక్కడ టెస్టు సిరీస్‌ నెగ్గలేదు. ఈసారి అది సాధిస్తామనే నమ్మకం ఉంది" అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

Ajaz Patel news, Ajaz Patel nterview అజాజ్ పటేల్ న్యూస్, అజాజ్ పటేల్ ఇంటర్వ్యూ
అజాజ్ రికార్డు

అజాజ్‌కు అశ్విన్‌ ప్రత్యేక కానుక

ప్రత్యర్థి జట్టయినా అత్యుత్తమంగా రాణించే ఆటగాడిని అభినందించే దృశ్యాలు క్రికెట్లో కనిపిస్తుంటాయి. సోమవారం అలాంటి సన్నివేశమే పునరావృతమైంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించిన కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌కు అశ్విన్‌ ప్రత్యేక కానుక అందించాడు. మ్యాచ్‌ ముగిశాక భారత జట్టు ఆటగాళ్ల సంతకాలతో కూడిన తన జెర్సీని అతనికిచ్చాడు. అలాగే, ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌ కూడా అజాజ్‌ను సత్కరించాడు. త్వరలో ప్రారంభం కాబోయే ఎంసీఏ మ్యూజియానికి అజాజ్‌.. బంతిని, తన టీషర్ట్‌ను అందించాడు.

ఇవీ చూడండి: 'కోహ్లీ.. టీమ్​ఇండియా అత్యుత్తమ టెస్టు కెప్టెన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.