Asia Cup 2022 : చేజేతులా ఓడిన భారత్‌.. ప్రతీకారం తీర్చుకున్న పాక్

author img

By

Published : Sep 4, 2022, 11:05 PM IST

Updated : Sep 5, 2022, 6:12 AM IST

Asia Cup 2022

Asia Cup 2022 : ఆసియా కప్​ సూపర్​-4లో భారత్​, పాక్​ మ్యాచ్​ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి విజయం పాక్​నే వరించింది.

  • Asia Cup 2022 : 5 ఓవర్లకు భారత్‌ స్కోరు 54/0. ఈ ఆరంభాన్ని ఉపయోగించుకుని ఉంటే స్కోరు అలవోకగా 200 దాటేసేదే!
  • 10 ఓవర్లకు పాక్‌ స్కోరు 76/2. మిగతా 10 ఓవర్లలో 106 పరుగులు చేయాలి. బౌలింగ్‌ కట్టుదిట్టంగా సాగి ఉంటే పాక్‌ పోటీలోకే వచ్చేది కాదేమో!
  • క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ వరుస ఓవర్లలో ఔటైపోయారు. కొత్తగా వచ్చిన బ్యాట్స్‌మన్‌ లడ్డు లాంటి క్యాచ్‌ ఇచ్చాడు. దాన్ని అర్ష్‌దీప్‌ అందుకుని ఉంటే పాక్‌ పనైపోయేదేమో!

2 ఓవర్లలో పాక్‌ 26 పరుగులు చేయాలి. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్‌ చేతిలో బంతి. కానీ అతను కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. పేలవంగా బౌలింగ్‌ చేశాడు. ఒకే ఓవర్లో 19 పరుగులొచ్చాయి. సమీకరణం తేలికైపోయింది.
ఇలా పాకిస్థాన్‌పై గెలవడానికి భారత్‌కు ఎన్ని మంచి అవకాశాలు వచ్చాయో! వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన రోహిత్‌ సేన.. ఈసారి ఓటమి వైపు నిలవాల్సి వచ్చింది. గ్రూప్‌ దశలో ఓటమికి.. కీలకమైన సూపర్‌-4 మ్యాచ్‌లో ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది పాక్‌.

ఆసియా కప్‌ గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌పై పైచేయి సాధించిన టీమ్‌ఇండియా.. కీలకమైన సూపర్‌-4 దశలో ఆ జట్టుకు తలవంచింది. ఆదివారం హోరాహోరీ పోరులో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓడింది. మొదట విరాట్‌ కోహ్లి (60; 44 బంతుల్లో 4×4, 1×6)తో పాటు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (28; 20 బంతుల్లో 1×4, 2×6), రోహిత్‌ శర్మ (28; 16 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో భారత్‌ 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ (2/31), మహ్మద్‌ నవాజ్‌ (1/25) భారత్‌కు కళ్లెం వేశారు. అనంతరం మహ్మద్‌ రిజ్వాన్‌ (71; 51 బంతుల్లో 6×4, 2×6), మహ్మద్‌ నవాజ్‌ (42; 20 బంతుల్లో 6×4, 2×6) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని పాక్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

.

వాళ్లిద్దరు ఎదురుదాడి..: పాక్‌ బ్యాటింగ్‌లో అత్యంత కీలకమైన బాబర్‌ అజామ్‌ (14) మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఫామ్‌లో ఉన్న ఫకార్‌ జమాన్‌ (15) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కానీ ఈ ప్రభావం పాకిస్థాన్‌ మీద పెద్దగా పడలేదు. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ ఓపెనర్‌ రిజ్వాన్‌ చెలరేగిపోవడం, ఫించ్‌ హిట్టర్‌గా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్‌ నవాజ్‌ భారత బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో ఛేదనలో పాక్‌ దూసుకెళ్లింది. వీళ్లిద్దరూ ఒక దశ వరకు ఓ మోస్తరు వేగంతోనే ఆడారు. రిజ్వాన్‌ ఆరంభంలో కొంచెం నెమ్మదిగానే ఆడాడు. కానీ తర్వాత దూకుడు పెంచాడు. నవాజ్‌ ఆరంభం నుంచి భారీ షాట్లకు దిగాడు. 10 ఓవర్లకు 76/2తో ఉన్న పాక్‌.. 5 ఓవర్ల వ్యవధిలో 59 పరుగులు రాబట్టి 15 ఓవర్లకు 135/2తో పటిష్ట స్థితికి చేరుకుంది. చివరి 5 ఓవర్లలో పాక్‌ 47 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ స్థితిలో భారత బౌలర్లు పుంజుకున్నారు. నవాజ్‌, రిజ్వాన్‌లను వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చారు. భువి బౌలింగ్‌లో నవాజ్‌, హార్దిక్‌ బౌలింగ్‌లో రిజ్వాన్‌ భారీ షాట్లు ఆడబోయి పెవిలియన్‌ చేరారు. బిష్ణోయ్‌ (1/26) వేసిన తర్వాతి ఓవర్లో అసిఫ్‌ అలీ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను అర్ష్‌దీప్‌ అందుకుని ఉంటే కథ వేరుగా ఉండేది. అయినప్పటికీ 3 ఓవర్ల వ్యవధిలో 21 పరుగులే రావడంతో చివరి 2 ఓవర్లలో 26 పరుగులతో గెలుపు సమీకరణం కష్టంగానే కనిపించింది. కానీ 19వ ఓవర్లో భువి ఏకంగా 19 పరుగులిచ్చేయడంతో మ్యాచ్‌ పాక్‌ వైపు మొగ్గింది. చివరి ఓవర్లో ఆ జట్టు 7 పరుగులే చేయాల్సి వచ్చింది. అర్ష్‌దీప్‌ కట్టుదిట్టంగానే బంతులేసినప్పటికీ.. రెండో బంతికి అసిఫ్‌ అలీ (16) ఫోర్‌ బాదడంతో పాక్‌ పని తేలికైంది. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన స్థితిలో అసిఫ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. కానీ తర్వాతి బంతికి ఇఫ్తికార్‌ 2 పరుగులు తీసి పాక్‌ను గెలిపించాడు.

.

మెరుపు ఆరంభం: మొదట భారత ఇన్నింగ్స్‌ ఆసక్తికర మలుపులతో సాగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌, ఇన్నింగ్స్‌ను ఆరంభించిన తీరు చూస్తే అలవోకగా 200 దాటేస్తుందనిపించింది. కానీ పవర్‌ ప్లేలో వీరవిహారం చేసిన అనంతరం ఓపెనర్లు వెనుదిరగ్గానే.. స్కోరు వేగం ఒక్కసారిగా పడిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కూడా పడడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పలేదు. మధ్య ఓవర్లలో పాక్‌ స్పిన్నర్లు గొప్పగా బౌలింగ్‌ చేసి భారత్‌కు కళ్లెం వేశారు. అయితే ఫామ్‌ అందుకున్న కోహ్లి క్రీజులో పాతుకుపోయి స్కోరు వేగం మరీ పడిపోకుండా చూశాడు. గ్రూప్‌ దశలో పాక్‌ పేసర్ల ధాటికి భారత ఓపెనర్లు తడబడ్డ తీరు చూసి ఈ మ్యాచ్‌లో వారేమాత్రం రాణిస్తారో అనుకుంటే.. ఇద్దరూ పోటీ పడి షాట్లు ఆడి జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా గత మ్యాచ్‌లో భారత్‌ను గట్టి దెబ్బ తీసిన నసీమ్‌ షాకు రోహిత్‌ తొలి ఓవర్లోనే ఫోర్‌, సిక్స్‌తో స్వాగతం పలికితే.. అతడి తర్వాతి ఓవర్లో రాహుల్‌ రెండు మెరుపు సిక్సర్లు బాదాడు. మిగతా బౌలర్లనూ ఓపెనర్లు ధాటిగా ఎదుర్కోవడంతో 5 ఓవర్లకు భారత్‌ 54/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది.

.

నిలిచిన కోహ్లి: జోరుమీదున్న ఓపెనర్లిద్దరినీ వరుస ఓవర్లలో ఔట్‌ చేయడం ద్వారా పాక్‌ పోటీలోకి రాగా.. ఆ తర్వాత కూడా భారత్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ క్రీజులో ఉన్నంతసేపూ సౌకర్యంగానే కనిపించినా.. స్పిన్నర్‌ నవాజ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. పంత్‌ సైతం క్రీజులో కుదురుకున్నట్లే కనిపించి.. రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి నిష్క్రమించాడు. గ్రూప్‌ దశలో తమ ఓటమిలో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌కు ఈసారి పాక్‌ కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. అతను ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ.. మరో ఎండ్‌లో కోహ్లి మాత్రం నిలకడగా ఆడాడు. ఎక్కువగా సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ వీలు చిక్కినపుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అతను మెరుపు సిక్సర్‌తో అర్ధశతకం అందుకున్నాడు. హుడా (16) కాసేపు అతడికి సహకరించాడు. 18 ఓవర్లకు స్కోరు 164/5. కోహ్లి, హుడా జోరుమీదుండడంతో స్కోరు 190 దాటేలా కనిపించింది. కానీ తర్వాతి ఓవర్లో హుడా ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో కోహ్లి పరుగే తీయలేదు. చివరికతను నాలుగో బంతికి రనౌటై వెనుదిరిగాడు. 19వ ఓవర్‌ ఆరంభం నుంచి భారత్‌ 10 బంతుల్లో 9 పరుగులే రాబట్టింది. అయితే ఫీల్డింగ్‌ తప్పిదాలు కలిసొచ్చి చివరి 2 బంతులకు బిష్ణోయ్‌ ఫోర్లు రాబట్టడంతో భారత్‌ 180 దాటింది.

"ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పిచ్‌పైనైనా 181 మంచి స్కోరు. మధ్యలో వికెట్లు తీయలేకపోతే ఎన్ని పరుగులు చేసినా కష్టమే. ఈ మ్యాచ్‌ మాకో పాఠం."
- రోహిత్‌ శర్మ

ఆ క్యాచ్‌.. ఆ ఓవర్‌
నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన మ్యాచ్‌లో విజయానికి భారత్‌ దూరం కావడంలో ఆ క్యాచ్‌, ఆ ఓవర్‌ కీలకమయ్యాయి. పాక్‌ గెలవడానికి చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు అవసరమైన దశలో రవి బిష్ణోయ్‌ 18వ ఓవర్‌ గొప్పగా వేశాడు. ఆ ఓవర్‌ మూడో బంతికి అసిఫ్‌ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌లో ఉన్న అర్ష్‌దీప్‌ వదిలేశాడు. ఆ తర్వాత అసిఫ్‌ బౌండరీలతో చెలరేగాడు. అదే అర్ష్‌దీప్‌ క్యాచ్‌ పట్టి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో. ఇక చివరి 12 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన సమయంలో 19వ ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ ఏకంగా 19 పరుగులు ఇవ్వడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. ఎంతో నమ్మకం పెట్టుకున్న భువీ జట్టు ఆశలను కూల్చాడు. ఆ ఓవర్లో అసిఫ్‌ ఓ సిక్సర్‌, ఫోర్‌, ఖుష్‌దిల్‌ ఓ ఫోర్‌ కొట్టారు.

బొమ్మ కాదు బొరుసు
భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు టాస్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వ్యాఖ్యాతల బృందంలో ఒకడైన రవిశాస్త్రి ఓ పొరపాటు చేశాడు. టాస్‌ సందర్భంగా మైదానంలో మైక్‌ పట్టుకుని ఉన్న అతను బొరుసు (టెయిల్స్‌)కు బదులు బొమ్మ (హెడ్స్‌) అని చెప్పాడు. టాస్‌ ఎవరిదో నిర్ణయించేందుకు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాణెం ఎగరవేయగా.. పాక్‌ సారథి బాబర్‌ బొరుసు అని చెప్పాడు. కానీ రవిశాస్త్రి దీన్ని బొమ్మ అని ప్రకటించాడు. దీంతో అక్కడే ఉన్న మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ కలగజేసుకుని అది బొరుసు అని శాస్త్రికి చెప్పాడు. బొరుసు పడడంతో బాబర్‌ టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

బ్యాట్‌ను తాకిందా? లేదా?
మ్యాచ్‌లో ఉత్కంఠభరిత సమయంలో రవి బిష్ణోయ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో ఓ బంతి అసిఫ్‌ అలీ బ్యాట్‌ను తాకిందా? లేదా? అన్న విషయం అయోమయానికి గురి చేసింది. ఆ ఓవర్‌ మూడో బంతి వైడ్‌గా వెళ్లింది. లెగ్‌సైడ్‌ ఆడదామని అలీ ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకిందనే ఉద్దేశంతో భారత్‌ సమీక్ష కోరింది. అల్ట్రాఎడ్జ్‌లో సన్నని గీత కదులుతూ కనిపించింది. మూడో అంపైర్‌ చాలా సేపు పరిశీలించిన తర్వాత నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై మైదానంలోని అంపైర్‌తో రోహిత్‌ అసహనం వ్యక్తం చేశాడు.

14: టీ20ల్లో రోహిత్‌-కేఎల్‌ రాహుల్‌ అర్ధశతక భాగస్వామ్యాలు. ఐర్లాండ్‌ ఆటగాళ్లు కెవిన్‌ ఒబ్రైన్‌- పాల్‌ స్టిర్లింగ్‌ (13) పేరిట ఉన్న రికార్డును వీరు అధిగమించారు.

32: టీ20ల్లో కోహ్లి యాభైలు. రోహిత్‌ (31) పేరిట ఉన్న అత్యధిక అర్ధసెంచరీల రికార్డును అతడు బద్దలుకొట్టాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) నవాజ్‌ (బి) షాదాబ్‌ 28; రోహిత్‌ (సి) ఖుష్‌దిల్‌ (బి) రవూఫ్‌ 28; కోహ్లి రనౌట్‌ 60; సూర్యకుమార్‌ (సి) అసిఫ్‌ అలీ (బి) నవాజ్‌ 13; పంత్‌ (సి) అసిఫ్‌ అలీ (బి) షాదాబ్‌ 14; హార్దిక్‌ (సి) నవాజ్‌ (బి) హస్నైన్‌ 0; దీపక్‌ హుడా (సి) నవాజ్‌ (బి) నసీమ్‌ షా 16; భువనేశ్వర్‌ నాటౌట్‌ 0; రవి బిష్ణోయ్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181; వికెట్ల పతనం: 1-54, 2-62, 3-91, 4-126, 5-131, 6-168, 7-173; బౌలింగ్‌: నసీమ్‌ షా 4-0-45-1; హస్నైన్‌ 4-0-38-1; రవూఫ్‌ 4-0-38-1; నవాజ్‌ 4-0-25-1; షాదాబ్‌ 4-0-31-2

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 71; బాబర్‌ (సి) రోహిత్‌ (బి) రవి బిష్ణోయ్‌ 14; ఫకర్‌ జమాన్‌ (సి) కోహ్లి (బి) చాహల్‌ 15; నవాజ్‌ (సి) హుడా (బి) భువనేశ్వర్‌ 42; ఖుష్‌దిల్‌ షా నాటౌట్‌ 14; అసిఫ్‌ అలీ ఎల్బీ (బి) అర్ష్‌దీప్‌ 16; ఇఫ్తికార్‌ అహ్మద్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 182; వికెట్ల పతనం: 1-22, 2-63, 3-136, 4-147, 5-180; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-40-1; అర్ష్‌దీప్‌ 3.5-0-27-1; రవి బిష్ణోయ్‌ 4-0-26-1; హార్దిక్‌ పాండ్య 4-0-44-1; చాహల్‌ 4-0-43-1

ఇవీ చదవండి: 'వంద' శతకాల రికార్డు విరాట్​కు ఇక కష్టమేనా?

2023లో చెన్నై కెప్టెన్​ అతడే​.. మేనేజ్​మెంట్​ కీలక ప్రకటన

Last Updated :Sep 5, 2022, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.