PV SINDHU: 'దేశానికి పతకం అందించడం నా అదృష్టం'

author img

By

Published : Aug 4, 2021, 5:41 PM IST

Updated : Aug 4, 2021, 7:15 PM IST

PV SINDHU: 'దేశానికి పతకం అందించడం నా అదృష్టం'

దేశానికి పతకం అందించడం ఎంతో గర్వంగా ఉందని ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత పీవీ సింధు అన్నారు. భవిష్యత్​లో మరెన్నో విజయాలు సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందరి ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు. ఈ అద్భుత క్షణాలను నా జీవితంలో మరిచిపోలేనని సింధు కోచ్​ పార్క్​ ఆనందం వ్యక్తం చేశారు.

ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత పీవీ సింధు తన విజయానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశానికి ఓ పతకం అందించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్​లో మరెన్నో విజయాలు సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్​లోని తన నివాసానికి చేరుకున్న సింధు.. తన కోచ్, ఇతర సిబ్బందితో తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. కోచ్​​తో పాటు పలువురు తనను ఎంతో ప్రోత్సహించారని ఆమె తెలిపారు. వారి ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కరోనా సమయంలో కూడా కోచ్​ ట్రైనింగ్​ విషయంలో ఎంతో సహకరించారని పేర్కొన్నారు.

టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. తన గెలుపు కోసం తల్లిదండ్రులు ఎంతో కృషి చేశారని సింధు స్పష్టం చేశారు. వారు చిన్నప్పటి నుంచి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని ఆమె చెప్పారు. టోక్యోలో దేశం నుంచి కొందరు మీడియా ప్రతినిధులు తనను ఎంతో ప్రోత్సహించారని పీవీ సింధు వెల్లడించారు.

అందరికి కృతజ్ఞతలు

దేశానికి పతకం అందించనందుకు సంతోషంగా ఉంది. నేను టోక్యోలో చాలా మిస్సయ్యాను. కానీ మీ దీవెనల వల్లే ఈ విజయాన్ని సాధించగలిగాను. నా కోచ్​ పార్క్​ గారికి కృతజ్ఞతలు. ఆయన దాదాపు సంవత్సరం నుంచి నాకు కోచింగ్​ ఇస్తున్నారు. సుచిత్ర అకాడమీకి కూడా కృతజ్ఞతలు. మా పేరెంట్స్​కు కూడా ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రోత్సహించారు. నేనొక్కదాన్నే కాదు.. అందరూ కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైంది.

-పీవీ సింధు, ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత

ఈ క్షణాలను జీవితంలో మరిచిపోలేను: పార్క్​

ఒలింపిక్స్​ కాంస్యం గెలిచినందుకు ఎంతో మంది అభినందిస్తున్నారని కోచ్​ పార్క్​ తెలిపారు. అందరూ అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కరోనా విపత్కర సమయంలో కూడా సింధు ఎంతో శ్రమించి విజయాన్ని సాధించిందన్నారు. ఈ అద్భుత క్షణాలను నా జీవితంలో మరిచిపోలేనని ఆయన వెల్లడించారు. తన జీవితంలో ఇదే మొదటి ఒలింపిక్స్​ మెడల్​ అని... ఆటగాడిగా సాధించలేనిది కోచ్​గా సాధించానని ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి ఆనందాన్ని అందించింది సింధు విజయమేనని... పీవీ సింధుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరిన్ని అందిస్తానని కోచ్​ పార్క్​ ధీమా వ్యక్తం చేశారు. 2024లో జరిగే పారిస్​ ఒలింపిక్స్​లో మరో విజయాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు. పారిస్​ ఒలింపిక్స్​ కోసం రేపటి నుంచే శిక్షణ ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

కోచ్​గా సాధించాను..

అందరూ అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలను జీవితంలో మరిచిపోను. నా కెరీర్​లో ఒలింపిక్స్ లో మొదటి మెడల్. ఆటగాడిగా సాధించలేనిది కోచ్​గా సాధించాను. ఇలాంటి విజయాలు మరిన్ని అందిస్తాను. -పార్క్​, సింధు కోచ్​

PV SINDHU: 'దేశానికి పతకం అందించడం నా అదృష్టం'

ఇదీ చదవండి: Pv Sindhu: శంషాబాద్​ విమానాశ్రయంలో సింధుకు గ్రాండ్ వెల్​కం

Last Updated :Aug 4, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.