PV SINDHU: 'వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యం'

author img

By

Published : Aug 4, 2021, 10:12 PM IST

PV SINDHU: 'వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యం'

ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగుతేజం పి.వి.సింధు అన్నారు. తల్లిదండ్రులు, ప్రభుత్వం, కోచ్‌ సహకారం వల్లే పతకం సాధించగలిగానని తెలిపింది. సెమీస్‌లో ఓటమి చవిచూసినప్పటికీ నా ఆట మిగిలే ఉందనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడంతోనే కాంస్యం వరించిందన్నారు. వరుసగా రెండు పతకాలు సాధించిన తాను వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యమంటున్న కాంస్య పతక విజేత పి.వి.సింధుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

PV SINDHU: 'వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యం'
  • ఒలింపిక్స్​లో స్వర్ణమే లక్ష్యంగా ముందుకు సాగారు. కానీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. మీరు దీనిపై ఎలా ఫీల్​ అవుతున్నారు?

చాలా ఆనందంగా ఉంది. పతకం రావడమన్నది అంతా ఈజీ కాదు. ఒలింపిక్స్​లో మెడల్​ రావడం అనేది చాలా కష్టం. నేను నా ప్రయత్నం చేశాను. ఇన్ని సంవత్సరాల నా క్రీడా ప్రయాణంతో ఎంతో మంది నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఎంతో మంది నువ్వు చేయగలుగుతావు, నువ్వు సాధించగలుగుతావు అని ప్రోత్సహించారు. వారందరికి కృతజ్ఞతలు. మా తల్లిదండ్రుల విషయానికొస్తే.. వాళ్లు నన్ను ఎంతో సపోర్ట్​ చేశారు. ప్రభుత్వంతో పాటు స్పోర్ట్స్​ అథారిటీ, బ్యాడ్మింటన్​ అసోసియేషన్​లు ఎంతో ప్రోత్సహించాయి. అడిగింది ఏదీ లేదు అనకుండా ఇచ్చి సపోర్టు చేశారు. వారి ప్రోత్సాహం కూడా ఇందులో ఎంతో ఉంది. వరుసగా రెండు పతకాలు రావడమన్నది అంత ఈజీ కాదు. సో నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను.

  • సెమీస్​లో ఓటమి చెందిన తర్వాత కాంస్య పోరుకు ఎలా సన్నద్ధమయ్యారు?

సెమీస్​లో ఓడిపోయిన తర్వాత ఎంతో బాధేసింది. కానీ ఇంకొక అవకాశం ఉందని... నా మనసులో ఉంది. మా పేరెంట్స్​, కోచ్​ నన్ను ఎంతో మోటివేట్​ చేశారు. ఇంకా అయిపోలేదు.. నువ్వు చేయగలుగుతావు అని ఎంతో ప్రోత్సహించారు. అదే నమ్మకంతో వెళ్లి ఆడి పతకాన్ని గెలుచుకున్నాను.

  • రియోలో రజతం, టోక్యోలో కాంస్యం సాధించారు. పారిస్​లో గోల్డ్​ మెడల్​ సాధిస్తారు అని భావించవచ్చా?

నేను శక్తి మేరకు ప్రయత్నిస్తాను. గోల్డ్​ మెడల్​ సాధించేందుకు వందశాతం ప్రయత్నిస్తా. ఎందుకంటే ఎవరైనా మెడల్​ కోసమే కష్టపడతారు. తప్పకుండా దానిని సాధించడం కోసం కష్టపడతాను.

  • రియో నుంచి టోక్యో వరకు జరిగిన మీ ప్రయాణం గురించి చెప్పండి.

రియోలో పతకం సాధించిన తర్వాత నా జీవితం మారిపోయింది. ఎన్నో మార్చుకున్నాను, కొన్ని గెలిచాను, కొన్ని ఓడిపోయాను.. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కొన్ని త్యాగాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. అప్పుడు అంత ఒత్తిడి లేకపోవచ్చు... కానీ ఇప్పుడు ఎన్నో అంచనాలు నాపై ఉన్నాయి. కానీ మ్యాచ్​కు వెళ్లేటప్పుడు మన వంతు కృషి చేయాలని మనసులో పెట్టుకుని వెళ్లాలి. ఎన్నో విషయాలు ఎంతో మంది చెబుతారు.. కానీ మనం మ్యాచ్​కు వెళ్లేటప్పుడు ఎంత ఏకాగ్రతతో వెళ్లామన్నదే ముఖ్యం.

  • ప్రస్తుతం పురుషుల కంటే మహిళల ఎక్కువగా పతకాలు తీసుకువస్తున్నారు. దీనిని మీరు ఎలా చెబుతారు?

మనం దేనిలో తక్కువ కాదు.. మనం కూడా ఎందులోనైనా ముందుకెళ్లచ్చు అనే భావన కలిగింది. మనమీద మనకు నమ్మకముంటే ఎన్నో సాధించవచ్చు.

  • కోచ్​ పార్క్​ శిక్షణ ఎలా ఉంది. గత కోచ్​ కంటే బాగానే ఉందా?

ప్రతి కోచ్​ కూడా భిన్న మనస్తత్వాలతో ఉంటారు. పార్క్​ గారి వద్ద నేను ఏడాదిన్నర నుంచి శిక్షణ పొందుతున్నాను. ఆయన శ్రమ, అంకితభావం ఎంతో ఉంది. ఆయన కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు.

  • ఈ విజయంలో కోచ్​ పార్క్​ పాత్ర ఉందని చెప్పుకోవచ్చా?

తప్పకుండా ఉంది. ఆయన వంద శాతం తన వంతు పాత్ర ఆయన పోషించారు. కోచింగ్​ విషయంలో ఆయన వందశాతం కృషి చేసినప్పుడు... ప్లేయర్​గా నేను కూడా వంద శాతం ఇవ్వాలి. ఆయన వంద శాతం కృషి చేశారు.

  • ఒలింపిక్స్​లో రెండు పతకాలు సాధించారు.. పెళ్లి చేసుకోబోతున్నారా?

ఇప్పుడే కాదు.

ఇదీ చదవండి: PV SINDHU: 'దేశానికి పతకం అందించడం నా అదృష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.