సుస్వరాల 'పాడుతా తీయగా'.. ఇక ఎస్పీ చరణ్ సారథ్యంలో

author img

By

Published : Nov 29, 2021, 6:48 AM IST

Updated : Nov 29, 2021, 7:21 AM IST

sp charan

ఎందరో గాయనీగాయకుల్ని వెలుగులోకి తీసుకొచ్చిన 'పాడుతా తీయగా' సరికొత్తగా టీవీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో డిసెంబరు 5 నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

'పాడుతా తీయగా' బాధ్యతలను స్వీకరించిన ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్.. తండ్రి స్థాయిలో కాకపోయినా ఆయన అభిమానులు మెచ్చుకునే స్థాయిలో షోను నిర్వహిస్తానని చెబుతున్నారు. మద్రాసులో పుట్టి పెరగడం వల్ల తమిళ ప్రభావం తనపై ఎక్కువగా ఉన్నప్పటికీ అచ్చ తెలుగులో 'పాడుతా తీయగా'ను కొనసాగిస్తానని అన్నారు. ఎస్పీబీతో పోలుస్తూ వచ్చే విమర్శలు సాధారంగా స్వాగతిస్తానంటోన్న చరణ్.. 'పాడుతా తీయగా' లక్ష్యం నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెబుతున్నారు.

పాడుతా తీయగా సింగింగ్ ప్రోగ్రాం

'పాడుతా తీయగా'.. ఎన్నో మధురమైన గళాలను సినీ సంగీత ప్రపంచానికి అందించిన వేదిక. ఈటీవీ ద్వారా ప్రతి ప్రేక్షకుడి హృదయ సాగరంలో సరిగమల ప్రవాహాన్ని పారించిన జీవనది లాంటి ఈ కార్యక్రమం మళ్లీ సరికొత్తగా ప్రేక్షకులకు పలుకరించేందుకు సిద్ధమైంది. అయితే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారన్న సందేహం సంగీత అభిమానుల మదిలో రకరకాలుగా ఉండేది. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ, నాన్న గానాన్నే కాదు.. ఆయన సంగీత గమనాన్ని కూడా వారసత్వంగా తీసుకున్నారు ఎస్పీ చరణ్. 'పాడుతా తీయగా' నిర్వహణ బాధ్యతలను భుజానికెత్తుకొని.. ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు.

sp charan
ఎస్పీ చరణ్

తెలుగు సంగీత ప్రపంచంలో నాటికి నేటికి మేటిగా నిలిచిన తెలుగింటి ధారావాహిక 'పాడుతా తీయగా'. దక్షిణాదిలో తొలిసంగీత ఆధారిత రియాల్టీ షోగా గుర్తింపు పొందిన పాడుతా తీయగా.. సంగీతాభిమానులకు సరికొత్త అనుభూతులను పంచుతూ ఆపాత మధురాల్లోని సరిగమల సారాన్ని, సాహిత్య సౌరభాలను వెదజల్లింది. దాదాపు 18 ఏళ్లపాటు 1100కు పైగా ధారావాహికలతో ఎంతో మంది ఔత్సాహిక గాయనీ గాయకులను మెరికల్లా తీర్చిదిద్ది కళామతల్లికి అందించింది. వెండితెర మురిసిపోయేలా చేసింది.

padutha theeyaga judges
పాడుతా తీయగా జడ్జిలు

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సమక్షంలో పాటల పోటీగా కాకుండా యువ గాయనీ గాయకులకు జీవిత పాఠాలు నేర్పిన ధారావాహికగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. అలాంటి పాడుతా తీయగా.. కరోనా రక్కసి కారణంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కోల్పోయి కొన్నిరోజులు మూగబోయింది. ఈ క్రమంలో ఎన్ని అంతరాయాలు, ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. సరిగమల ప్రవాహాన్ని పారించిన పాడుతా తీయగా.. శాశ్వతంగా మూగబోకూడదని ఈటీవీ సంకల్పించింది. మళ్లీ పాడుతా తీయగా షోను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మరి సారథ్య బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే సందేహం సగటు సంగీత అభిమానుల్లో నెలకొన్న వేళ.. అందుకు సరైన వారసుడు ఎస్పీ చరణేనని తేల్చింది. ఎస్పీబీ ఆకాంక్షను కొనసాగిస్తూ.. పాడుతా తీయగా బాధ్యతలను ఎస్పీ చరణ్​కు అప్పగించింది.

డిసెంబర్ 5 నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నాం 12 గంటల నుంచి 1 గంట వరకు ఈటీవీలో 'పాడుతా తీయగా' ప్రసారం కానుంది.

ఇది చదవండి: సరికొత్తగా 'పాడుతా తీయగా'.. డిసెంబరు 5నుంచి ప్రారంభం

Last Updated :Nov 29, 2021, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.