FILM CHAMBER: సినీ పరిశ్రమ పెద్దలతో రేపు తలసాని సమావేశం

author img

By

Published : Jul 19, 2021, 9:04 PM IST

FILM CHAMBER

కరోనా వల్ల ఆర్థికంగా కుదేలైన తెలుగు చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సినీ పరిశ్రమలోని పెద్దలతో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

కొన్నాళ్లుగా థియేటర్లు నష్టాల బాటనే నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ప్రేక్షకులు సినిమా హాళ్లకు రాకపోవడం వల్ల ఆ నష్టం మరింత ఎక్కువైంది. దాంతో ఎగ్జిబిటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జీవో నంబరు 75 (23-6-2017)ను పునః పరిశీలించాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు 'సేవ్‌ సినిమా సేవ్‌ థియేటర్‌' నినాదంతో ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. థియేటర్‌ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ లేఖలో పేర్కొంటూ, తగిన షరిష్కారం చూపాలని కోరింది.

లేఖలోని అంశాలు

  1. G.O. Ms. No.75, dt. 23-06-2017ని పునః పరిశీలించాలి.
  2. సినిమా హాళ్లకు వచ్చే ప్రధాన ఆదాయ మార్గం పార్కింగ్‌ ఫీజు. దశాబ్దాలుగా థియేటర్లు పార్కింగ్‌కు కొంత ఫీజు వసూళ్లు చేశాయి. ప్రస్తుతం థియేటర్లలో పార్కింగ్‌ను ఉచితం చేయడం వల్ల నష్టం వాటిల్లుతోంది. పైగా పార్కింగ్‌ సిబ్బందికి జీతం ఇవ్వాల్సిందే. కొవిడ్‌ నేపథ్యంలో శానిటైజర్లు తదితర వాటిని సమకూర్చాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని నామమాత్రపు పార్కింగ్‌ ఫీజుకు అనుమతించాలి.
  3. గతేడాది లాక్‌డౌన్‌ నుంచి థియేటర్లన్నీ మూతబడ్డాయి. అయినా కనీస విద్యుత్తు ఛార్జీలు భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మినిమమ్‌ డిమాండ్‌ ఛార్జీలను మాఫీచేసి, ఎగ్జిబిటర్ల వ్యాపారాన్ని గాడిన పడేలా చేయాలి.
  4. గత రెండేళ్ల ప్రాపర్టీ ట్యాక్స్‌ను రద్దు చేస్తే లాక్‌డౌన్‌ కారణంగా వాటిల్లిన నష్టాల్ని పరోక్షంగా తీర్చినట్టవుతుంది.
  5. స్టేట్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (ఎస్‌.జి.ఎస్‌.టి)ను తొలగించాలి.

స్పందించిన ప్రభుత్వం

లేఖపై స్పందించిన ప్రభుత్వం... కరోనా మహామ్మారి వల్ల ఆర్థికంగా కుదేలైన తెలుగు చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సినీ పరిశ్రమలోని దర్శక నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మాసబ్ ట్యాంక్​లోని తన కార్యాలయంలో జరిగే సమావేశానికి వారందరిని రావల్సిందిగా సూచించారు.

తక్కువ బడ్జెట్​లో నిర్మించే చిత్రాలకు రాయితీతో పాటు థియేటర్ నిర్వహణ, విద్యుత్ ఛార్జీలు రద్దు చేయడం, జీఎస్టీ, స్థిరాస్తి పన్నుల నుంచి మినహాయింపు, పార్కింగ్ ఛార్జీలు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సినీపెద్దల విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం... సంబంధిత అధికారులు, సినీ ప్రముఖులతో కలిసి ప్రత్యేకంగా సమీక్షించనుంది.

ఉత్తర్వులు వస్తే..

ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు... విద్యుత్, నిర్వాహణ ఛార్జీల విషయంలో ప్రకటించిన రాయితీ ఉత్తర్వులు వచ్చాక... హాళ్లు తెరవాలని భావిస్తున్నారు. ఉత్తర్వులు వస్తే సినిమా ప్రదర్శనలు కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే జులై 30న పలువురు నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన తిమ్మరుసు 30న విడుదల చేయాలని నిర్ణయించారు. మరికొన్ని సినిమాలు కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

ఇదీ చూడండి: THEATERS OPEN: సినిమాహాళ్లను తెరవడంపై కొనసాగుతోన్న సందిగ్ధత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.