స్టార్ నటీనటుల వారసులే.. బాలనటులుగా!

author img

By

Published : Aug 29, 2021, 11:50 AM IST

child artists

'అల్లు అర్జున్‌ గారాల పట్టి.. అల్లు అర్హ తెరంగేట్రం చేస్తోందట' అన్న వార్త ఈమధ్య మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ ఓ హాట్‌ టాపిక్‌ అయిపోయింది. నిజానికి ఇలా హీరోలూ, హీరోయిన్లూ, డైరెక్టర్ల పిల్లలూ బాలనటులుగా చెయ్యడం ఈమధ్య బాగా పెరిగింది. అంతమంది ఎవరున్నారబ్బా అంటారా.. మీరే చూడండి.

'శాకుంతలం'తో తొలి అడుగు సినిమాల్లోకి రాకపోయినా ఇప్పటికే చిన్నారి అర్హకు సోషల్‌ మీడియాలో బోలెడు ఫాలోయింగ్‌ ఉంది. అందుకే.. "అల్లు కుటుంబం నుంచి నాలుగో తరం వచ్చేస్తోందని చెప్పడానికి గర్వంగా ఉంది. అల్లు అర్హ 'శాకుంతలం' సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతోంది" అంటూ ఈమధ్య అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించడం ఆలస్యం ఈ పాపతో పాటు ఆ సినిమాకూ భారీ క్రేజ్‌ వచ్చేసింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత ప్రధానపాత్రలో రూపొందిన ఈ చిత్రంలో అర్హ - యువరాజు భరతుడి పాత్రలో నటించింది. అంటే త్వరలోనే అల్లు అర్హ నటనను చూడొచ్చన్నమాట.

child artists
అల్లు అర్హ

'రాజా ది గ్రేట్‌'.. రవితేజ కొడుకు!

మామూలుగా బాల నటులుగా చెయ్యడం ఒక ఎత్తైతే.. కళ్లులేని పాత్రను పోషించడం మరో ఎత్తు. 'రాజా ది గ్రేట్‌' సినిమాలో చిన్నప్పటి రవితేజగా నటించిన మహాధన్‌ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవితేజ కొడుకంటే ఆ మాత్రం టాలెంట్‌ ఉండకుండా ఉంటుందా.. కాబట్టే, ఆ పాత్రకోసం నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి మహాధన్‌ను తీసుకోవాలని నిర్ణయించుకుని తర్వాత రవితేజను ఒప్పించారట.

child artists
రాజేంద్ర ప్రసాద్​ మనవరాలు సాయి తేజస్విని, రవితేజ కొడుకు మహాధన్​

తాతకు తగ్గ మనవరాలు..

'మహానటి' సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా తెలివి, మంకుతనం, ధైర్యం, ప్రతిభ, జాలి, అల్లరి.. ఇలా ఎన్నో కోణాలున్న పాత్రలో నటించి మెప్పించింది చిన్నారి సాయి తేజస్విని. సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కి పోటీ కూడా ఇచ్చింది. ఆ చిన్నారి ఆయన మనవరాలే మరి. ఆ చిత్రం తర్వాత 'సరిలేరు నీకెవ్వరు', 'సిరివెన్నెల'.. లాంటి సినిమాల్లోనూ నటించింది. అన్నట్లూ 'మహానటి' సినిమాలో సావిత్రి, జెమినీ గణేశన్‌ల కూతురుగా నటించిన పాప గాయని స్మిత కూతురు 'షివి'.

క్రాక్‌ సినిమాలో బుడత ఎవరంటే..

'క్రాక్‌' సినిమాలో రవితేజ, శృతి హాసన్‌ల కొడుకుగా నటించి వాల్‌ పోస్టర్లలో కూడా భాగం పంచుకుని అందరి దృష్టిలో పడ్డాడు మాస్టర్‌ సాత్విక్‌. ఆ సినిమాలో ఈ బుడతడి అల్లరీ, సెటైర్లూ చూస్తే నవ్వాపుకోవడం కష్టమే. ఈ చిన్నారి, క్రాక్‌ దర్శకుడు గోపీచంద్‌ మలినేని వారసుడు. సినిమాలో హీరో కొడుకు పాత్రకోసం బయటి నుంచి బాల నటుల్ని వెతికే పనిలేకుండా తన కొడుకునే పెట్టేశాడట గోపీచంద్‌.

గౌతమ్‌ మహేశ్​గా..

మహేశ్​బాబు 'వన్‌ నేనొక్కడినే' సినిమాలో చిన్నప్పటి మహేశ్​ పాత్రలో నటించిన ఆయన కుమారుడు గౌతమ్‌కు మంచి మార్కులే పడ్డాయి. అప్పటికి గౌతమ్‌ వయసు ఆరేళ్లే. పైగా ఆ పాత్ర విభిన్నమైన భావాలను పలికించాల్సి ఉంటుంది. దాంతో దర్శకుడు సుకుమార్‌ 'గౌతమ్‌ను ఆ పాత్రకు తీసుకుందాం' అన్నప్పుడు మహేశ్​, నమ్రత కాస్త ఆలోచించారట. కానీ తర్వాత ఒప్పుకున్నారట. దాన్లో గన్‌ఫైర్‌ అవుతున్న సౌండ్లకు గౌతమ్‌ భయపడతాడేమో అని ఆ సన్నివేశాన్ని సౌండ్‌లేకుండా చిత్రీకరించారట.

child artists
మహేశ్​ బాబు కొడుకు గౌతమ్​

అటు మామ ఇటు నాన్న..

'భలే భలే మగాడివోయ్‌' సినిమాలో నానీ చిన్నప్పటి పాత్ర కూడా మతిమరుపుతో తెగ నవ్వు తెప్పిస్తుంది. అందులో నటించిన పిల్లాడు హీరో సుధీర్‌ బాబు కొడుకూ.. మహేశ్​బాబు మేనల్లుడూ.. అయిన చరిత్‌ మానస్‌. ఈ చిన్నారి 'విన్నర్‌', 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాల్లోనూ చేశాడు. చరిత్‌ తమ్ముడు దర్శన్‌ కూడా 'గూఢచారి' చిత్రంలో నటించాడు.

child artists
మీనా కుమార్తె నైనిక, హీరో సుధీర్‌ బాబు కొడుకు చరిత్​ మానస్​

అచ్చం అమ్మలానే..

బాలనటిగానూ హీరోయిన్‌గానూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది మీనా. ఆమె కూతురు నైనిక కూడా అదే బాటలో నడుస్తోంది. తమిళ నటుడు విజయ్‌ హీరోగా చేసిన 'పోలీసోడు' సినిమాలో అతడి కూతురుగా కనిపించిన పాప తనే. ఆ తర్వాత 'భాస్కర్‌ ఒరు రాస్కెల్‌' అనే సినిమాలో అరవింద్‌ స్వామితోనూ నటించింది నైనిక. ప్రస్తుతం తల్లితో కలిసి ఓ సినిమాలో చెయ్యబోతోందట.

ఇదీ చూడండి: అల్లు అర్హ ఎంట్రీ ఫిక్స్.. 'శాకుంతలం' చిత్రంతో తెరపైకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.