పాకిస్థాన్‌లోనూ 'అఖండ' గురించి మాట్లాతున్నారు: బాలకృష్ణ

author img

By

Published : Jan 13, 2022, 9:35 AM IST

Akhanda Movie

పాకిస్థాన్‌లోనూ 'అఖండ' గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఒకరకంగా ఈ సినిమా 'పాన్‌ వరల్డ్‌'గా అయిపోయిందని చెప్పారు. అఖండ మూవీ విజయోత్సవ వేడుకలో ఈ మేరకు మాట్లాడారు బాలయ్య.

Akhanda Movie: "ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? సినిమాని చూస్తారా? అన్న భయాలు వెంటాడుతున్న సమయంలో.. నిర్మాత ధైర్యం చేసి డిసెంబర్‌ 2న 'అఖండ' చిత్రాన్ని విడుదల చేశారు. ప్రేక్షక దేవుళ్లు సినిమాని అభిమానించి.. ఆదరించారు. తిరునాళ్లకు వెళ్లినట్లు చూడటానికి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడిది 'పాన్‌ వరల్డ్‌' సినిమా అయిపోయింది. పాకిస్థాన్‌లోనూ 'అఖండ' గురించి మాట్లాడుకుంటున్నారు" అని అన్నారు నందమూరి బాలకృష్ణ.

Akhanda Movie Review: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమే 'అఖండ'. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. "అఖండ' విడుదలతోనే సంక్రాంతి మొదలైంది. మేము ఈ సినిమా చేసేటప్పుడు 'సింహా', 'లెజెండ్‌' విజయాల గురించి ఆలోచించలేదు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితం దేవుడు చూసుకుంటాడనుకున్నాం. ఇప్పుడీ 'అఖండ' విజయం దేవుడు ఇచ్చిందే. ఈ చిత్రంలో వినోదం, విజ్ఞానం రెండూ ఉన్నాయి. ఇండస్ట్రీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లాలని కోరుకుంటున్నా. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం చిత్ర పరిశ్రమకు ఉండాలి. ఈ విషయంలో పెద్దా, చిన్నా అనే తారతమ్యం ఉండకూడదు. అన్ని సినిమాలు ఆడాలి. తమన్‌ అద్భుతమైన సంగీతమిచ్చారు. సినిమా కోసం నటులు, సాంకేతిక నిపుణుల నుంచి తనకు కావాల్సింది రాబట్టే దర్శకుడు బోయపాటి. యావత్‌ భారతదేశం గర్వించే దర్శకుడాయన. కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనా చెదరని చిరునవ్వుతో నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఎంతో సహనంగా ఉన్నారు. చలన చిత్ర రంగం ఉన్నంత వరకు 'అఖండ' లాంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి" అన్నారు"

  • దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "ఇది డబుల్‌ సక్సెస్‌ మీట్‌. దీన్ని బ్లాక్‌ బస్టర్‌ హిట్‌, మాస్‌ జాతర అని అంటున్నారు. వాటన్నింటి కంటే ఇది ఎక్కువే. డబ్బు రావడం వేరు. ధైర్యం రావడం వేరు. ఈ చిత్రంతో అందరికీ ధైర్యం వచ్చింది. 'అఖండ'కి కచ్చితంగా సీక్వెల్‌ ఉంటుంది" అన్నారు.
  • నటుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. "అఖండ'లో నా గెటప్‌ చూసి ఇంట్లో వాళ్లూ భయపడ్డారు. మేకప్‌తో ఇంటికెళ్తే.. ఎవరో వచ్చారని వెళ్లిపోయేవారు. వరదరాజులుగా ఈ పాత్రకు ఇంత పేరు రావడానికి బోయపాటే కారణం" అన్నారు. "గత కొన్నేళ్లలో.. ఇలా డిసెంబర్‌లో విడుదలై సంక్రాంతి వరకు కొన్ని వందల థియేటర్లలో నడుస్తున్నది 'అఖండ' మాత్రమే. బయట ప్రపంచం ఎలా ఉన్నా సినిమాని తెలుగు ప్రేక్షకులు బతికిస్తార"న్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో నటుడు అయ్యప్ప శర్మ, ఛాయాగ్రాహకుడు రామ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నా ఎనర్జీ సీక్రెట్ అదే.. అందుకే ఇలా: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.