'జల సంస్కారం'... నీటి తొట్టెలోనే అంత్యక్రియలు.. ఇది పర్యావరణ హితం!

author img

By

Published : Sep 14, 2022, 2:08 PM IST

WATER CREMATION

Water cremation : అంత్యక్రియలంటేనే ఆచార వ్యవహారాలు, నమ్మకాలతో ముడిపడిన వ్యవహారం. కొందరు సమాధి చేస్తే, కొందరు దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. మరి జల సంస్కారం గురించి తెలుసా? అక్వామేషన్‌, వాటర్‌ క్రిమేషన్‌, కెమికల్‌ క్రిమేషన్‌, గ్రీన్‌ క్రిమేషన్‌.. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆల్కలైన్‌ హైడ్రాలిసిస్‌.. పేరేదైనా ఉద్దేశం ఒక్కటే. నీటితోనే భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించటం. ఈ సంవత్సరం ఆరంభంలో నోబెల్‌ పురస్కార గ్రహీత, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్చ్‌బిషప్‌ డెస్మండ్‌ టుటు అంత్యక్రియలు జరిగింది ఈ పద్ధతిలోనే. మన కాలపు అతిపెద్ద నైతిక సవాళ్లలో వాతావరణ మార్పు ఒకటని భావించే ఆయన సంప్రదాయ అంత్యక్రియలకు బదులు దీన్ని ఎంచుకోవటం అప్పట్లోనే ఆశ్చర్యపరచింది. పర్యావరణానికి హాని చేయని స్వచ్ఛ అంత్యక్రియగా పేరొందింది. క్రమంగా ప్రాచుర్యమూ పొందుతోంది.

Water cremation process: శరీరం పాంచ భౌతికం. మరణించిన తర్వాత కలిసేదీ పంచ భూతాల్లోనే. నేలలో పూడ్చినా, చితి మీద కాల్చినా చివరికి కలిసిపోయేది ప్రకృతిలోనే. మరి అది పర్యావరణానికి హాని చేయనిదైతే? వాతావరణ మార్పు ఇలాంటి ఆలోచనలనే రేకెత్తిస్తోంది. నిరంతరం వాతావరణ పరిరక్షణ గురించి పరితపించిన డెస్మండ్‌ టుటు నిర్ణయానికి కారణమూ ఇదే. ఇంతకీ అక్వామేషన్‌ ఎలా చేస్తారు? ముందుగా భౌతిక కాయాన్ని పొడవైన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పెట్టెలో పెట్టి సీల్‌ చేస్తారు. తర్వాత 95% నీరు, 5% సోడియం హైడ్రాక్సైడ్‌తో చేసిన వేడి ద్రావణాన్ని లోపలికి పంపిస్తారు. ఈ ద్రావణం భౌతిక కాయం చుట్టూ తిరుగుతూ కణజాలంలోని బంధాలను సడలిస్తుంది. చివరికి అమైనో ఆమ్లాలు, పెప్టయిడ్లు, లవణాలు, చక్కెరలు, సబ్బుల మిశ్రమంతో కూడిన శుద్ధ ద్రవం మాత్రం మిగులుతుంది. ఇది హైడ్రాలిసిస్‌ కేంద్రం డ్రెయిన్‌ ద్వారా బయటకు వచ్చేస్తుంది.

మిగిలిపోయిన ఎముకలను పొడి చేసి మృతుల బంధువులకు అప్పగిస్తారు. దహన క్రియల అనంతరం బూడిదను అప్పగించినట్టుగా అన్నమాట. ఇదంతా నాలుగు నుంచి ఆరు గంటల్లో పూర్తవుతుంది. ఈ ప్రక్రియలోనూ నేలలో పూడ్చిపెట్టినప్పటి మాదిరిగానే భౌతిక కాయం విచ్ఛిన్నమవుతుంది. కాకపోతే రసాయనాల వాడకంతో చాలా త్వరగా జరిగిపోతుంది. ఇది పూర్తిగా నీటితో ముడిపడినది కావటం వల్ల 'అగ్ని రహిత అంత్యక్రియ'గా, పర్యావరణ హితమైందిగా పేరు పొందుతోంది.

130 ఏళ్ల కిందటే..
అక్వామేషన్‌ ప్రక్రియను అమోస్‌ హెర్బర్ట్‌ హ్యాన్సన్‌ అనే ఆంగ్ల రైతు అభివృద్ధి చేశారు. దీనికి ఆయన 1888లోనే పేటెంట్‌ పొందారు. అయితే దీనికి అంత్యక్రియలతో ఎలాంటి సంబంధం లేదు. దేశీయ పద్ధతిలో జంతు కళేబరాల నుంచి ఎరువులను తయారు చేయాలన్నది ఆయన ఉద్దేశం. కాస్టిక్‌ పొటాష్‌ వంటి క్షారాన్ని నీటిలో కలిపి, అందులో జంతు కళేబరాలను వేసి.. వేడి చేస్తూ తిప్పితే 8-9 గంటల్లో జెలటిన్‌, జిగురు వంటి పదార్థం ఏర్పడుతుందని ఆయన గుర్తించారు. దీంతో మంచి ఎరువును తయారు చేయొచ్చని కనుగొన్నారు. ఇది రైతులకు గొప్ప వరంగా ఉపయోగపడింది.

మరో వందేళ్లు గడిచాక అల్బనీ మెడికల్‌ కాలేజీ ఉద్యోగులు దీన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. పరిశోధనల కోసం ఉపయోగించిన జంతువులను సురక్షితంగా విసర్జించటానికిది తోడ్పడగలదని ప్రతిపాదించారు. తమ పరిశోధనలు ఫలించటంతో 1994లో పేటెంట్‌ తీసుకున్నారు. ఇందుకోసం యంత్రాలూ తయారుచేశారు. వీటికి టిష్యూ డైజెస్టర్‌ అని పేరు పెట్టారు. ఇదీ జంతు కళేబరాలను విచ్ఛిన్నం చేయటానికి ఉద్దేశించిందే. బయో-రెస్పాన్స్‌ సొల్యూషన్స్‌, రెసోమేషన్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలు ముందుకొచ్చాకే అక్వామేషన్‌ ప్రక్రియ అంత్యక్రియలకు వాడుకోవటం ఆరంభమైంది.

అరుదే అయినా..
అక్వామేషన్‌ ప్రక్రియ అరుదే అయినా క్రమంగా వాడకం పెరుగుతోంది. పదేళ్ల క్రితం అమెరికాలో ప్రజావసరాలకు దీన్ని వాడుకోవటానికి అనుమతించారు. ప్రస్తుతం అక్కడ కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత సంవత్సరంలో 2వేల వరకు అక్వామేషన్‌ అంత్యక్రియలు జరిగాయి. గణాంకాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇది పెద్ద ముందడుగేనని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియలో తొలి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇవి 5 శాతానికి చేరుకోవటానికి వందేళ్లు పట్టింది. కానీ అనంతరం 50 ఏళ్లలోనే 50 శాతానికి పైగా పెరిగింది. మున్ముందు ఇది మరింత విస్తరించగలదనీ ఆశిస్తున్నారు.

పర్యావరణ హితంగా..
అక్వామేషన్‌ ప్రక్రియలో మిగిలే ద్రవాన్ని నగర మురుగునీటి వ్యవస్థలో కలపటం సురక్షితమేనని పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికిది మురుగునీటిని మరింత బాగా శుధ్ధి చేయటానికీ తోడ్పడుతుంది. ఎందుకంటే మురుగునీటిలోని వ్యర్థాలను విడగొట్టే బ్యాక్టీరియాకు ఈ ద్రవం మంచి పోషకంగా ఉపయోగపడుతుంది. ఎలాంటి కాలుష్యం వెలువడకపోవటం వల్ల ఇది పర్యావరణానికీ మేలే. శరీరంలో కీమోథెరపీ మందుల వంటివి ఉన్నా త్వరగా విచ్ఛిన్నమైపోతాయి. కొన్నిచోట్ల పెద్ద చెక్కపెట్టెల్లో భౌతిక కాయాన్ని పెట్టి పూడ్చేస్తుంటారు. ఇందుకోసం కొన్ని రసాయనాలు, పదార్థాలూ వాడుతుంటారు.

అమెరికాలో సంప్రదాయ అంత్యక్రియల కోసం ఏటా 3 కోట్ల అడుగుల చెక్కలు.. 2,700 టన్నుల రాగి, ఇత్తడి.. 1.5 లక్షల టన్నుల స్టీలు, 16.4 లక్షల టన్నుల కాంక్రీటు వాడుతున్నారని అంచనా. ఇక దహనక్రియల మూలంగా అక్కడ 3.6 లక్షల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ వాతావరణంలోకి వెలువడుతోంది. పాదరసం వంటి విష పదార్థాలూ గాల్లో కలుస్తుంటాయి. అక్వామేషన్‌తో ఇలాంటి దుష్ప్రభావాలేవీ ఉండవు. దహనక్రియలకు అవసరమయ్యే శక్తిలో 10 శాతమే దీనికి అవసరమవుతుంది. ఎలాంటి ఉద్గారాలు వెలువడవు. కాబట్టి పర్యావరణ హిత అంత్యక్రియగా ఇది స్థిరపడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.