కరోనాను ఆసరాగా చేసుకుని హ్యాకింగ్.. జాగ్రత్త సుమా!

author img

By

Published : Sep 25, 2021, 5:03 PM IST

Android User mallware

ఆండ్రాయిడ్​ యూజర్లను ప్రస్తుతం కలవరపెడుతున్న అంశం హ్యాకింగ్. కొత్త మాల్​వేర్​తో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందులోనూ ఈ దాడులు ఆండ్రాయిడ్​ ఫోన్​ ఉపయోగించే వారిపై మాత్రమే జరుగుతుండడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. తొలుత సాధారణ ఫోన్​లతో ప్రారంభమై.. నేడు స్మార్ట్​ఫోన్లు, ఐఫోన్ల వరకు విస్తరించింది. ఈ క్రమంలోనే చాలామంది భద్రత విషయంలో రాజీపడకుండా వేలకు వేలు ఫోన్లపై కుమ్మరించి మరీ కొనుక్కుంటారు. వాస్తవానికి భద్రత విషయంలో స్మార్ట్​ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తుంది యాపిల్​ అయినా.. ఎక్కువమంది కొనుగోలు చేసేది మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్లే. దీనినే ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు​ సైబర్​ నేరగాళ్లు. దీని కోసం ప్రత్యేక మాల్​​వేర్​ను తయారు చేసి లింక్​ల రూపంలో ఫోన్​లకు పంపుతున్నారు. వాటిని క్లిక్​ చేస్తే మీ సమాచారం సర్వం హ్యాకర్​ చేతిలోకి వెళ్లిపోతుంది.

ఆండ్రాయిడ్​ యూజర్లే టార్గెట్​..

ప్రపంచవ్యాప్తంగా సుమారు 73 శాతం మంది ఆండ్రాయిడ్​ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. హ్యాకర్లు వీరినే లక్ష్యంగా చేసుకుని సైబర్​ దాడులకు దిగుతున్నారు. ఇదే విషయాన్ని టెక్​ నిపుణులు కూడా చెప్తున్నారు. ఆండ్రాయిడ్​ ఫోన్లు ఎక్కువగా భద్రతాలోపాలకు గురవుతున్నట్లు నార్డ్​ వీపీఎన్​ నిపుణులు పేర్కొన్నారు. అయితే వీటిని అధిగమించేందుకు ఆండ్రాయిడ్​ తగు చర్యలు చేపట్టినా.. హ్యాకర్లు ఏదో విధంగా దాడికి పాల్పడుతున్నట్లు చెప్తున్నారు.

కొవిడ్​ను ఆసరాగా చేసుకుని..

కొవిడ్​ను ఆసరాగా చేసుకుని ఆండ్రాయిడ్​ యూజర్లకు లింక్​లు పంపుతున్నారు సైబర్​ నేరగాళ్లు. ఇవి టెక్ట్స్​ మెసేజ్​ల రూపంలో వస్తుంటాయి. కొవిడ్​కు సంబంధించిన బూస్టర్​ డోసు లేదా టీకాలు తీసుకునేందుకు షెడ్యూల్​ చేసినట్లు ఆ మెసేజ్​ సారాంశం ఉంటుంది. దానిని ఆమోదించేందుకు ఇచ్చిన లింక్​పై క్లిక్​ చేయాలని ఉంటుంది. దానిని క్లిక్​ చేస్తే 'మీరు అడోబ్​ ఫ్లాష్​ ప్లేయర్​ను అప్​డేట్​ చేసుకోవాలి' అని చూపిస్తుంది. పొరపాటున దానిని అప్​డేట్​ చేస్తే ట్యాంగిల్​బోట్​ అనే మాల్​వేర్​ మీ ఫోన్​లోకి ప్రవేశిస్తుంది. అదే జరిగితే మీ ఫోన్​ హ్యాకర్​ చేతిలోకి వెళ్లినట్లే.

ఏ టూ జెడ్​ హ్యాకర్​ చేతిలోనే..

ట్యాంగిల్​ బోట్​ మాల్​వేర్​ మీ ఫోన్​లోకి ప్రవేశించిన తరువాత మీ స్మార్ట్​ఫోన్​లో ఉన్న ప్రతిదీ హ్యాకర్​ చేతిలోకి వెళ్లిపోతుంది. మీ ఫోన్​లో ఉండే ప్రతి ఒక్క ఫొటోను వారు చూడగలుగుతారు. ప్రైవేట్​గా ఉంచుకున్న చాటింగ్​లు, దాచుకున్న ఫొటోలు, వీడియోలు బట్టబయలు అవుతాయి. మీ మైక్రోఫోన్​ వారి అధీనంలోకి వెళ్లిపోతుంది. మీకు తెలియకుండానే మీ ఫోన్​ కెమెరా ఆన్​ అవుతుంది. ఫొటోలు తీస్తుంది. మీకు వచ్చిన మెసేజ్​లు అన్నింటినీ హ్యాకర్​ చూడగలుగుతాడు. మీ నెంబర్​ నుంచి ఇష్టం వచ్చిన వారికి ఎలాంటి మెసేజ్​ను అయినా పంపిస్తాడు. మీ ఫోన్​ ఇంటర్​నెట్​ను కూడా అదుపుచేస్తాడు. మీ బ్యాంక్​ లాగిన్​, పాస్​వర్డ్​లు కూడా వారికి తెలిసిపోతాయి. పక్కాగా చెప్పాలంటే ఫోన్​ మాత్రమే మీ చేతిలో ఉంటుంది. విషయం అంతా హ్యాకర్​ చేతిలో ఉంటుంది.

ఆండ్రాయిడ్​ హెచ్చరిస్తుంది.. కానీ..

ఇలాంటి మాల్​వేర్​ ఫోన్​లోకి డౌన్​లోడ్​ అయ్యేటప్పుడు ఆండ్రాయిడ్​ మనకు హెచ్చరికలు పంపుతుంది. ఇది అన్నోన్ సోర్స్​ నుంచి వస్తుందని.. దీనిని డౌన్​లోడ్​ చేసుకోవడం మంచిది కాదని చెప్తుంది. కానీ మనమే దానిని ఫోన్​లో ఇన్​స్టాల్​ అయ్యేలా చేస్తాం. మరో విషయం ఏంటంటే ఒకసారి ఇన్​స్టాల్​ అయితే దీనిని ఫోన్​ నుంచి తొలగించడం చాలా కష్టం.

ఇదీ చూడండి: ఆండ్రాయిడ్​లో కొత్త ఫీచర్​.. కనుసైగతో మొబైల్​ను శాసించండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.