అప్పుడు పక్కనబెట్టారు.. ఇప్పుడు ఆశలన్నీ యడ్డీపైనే.. భాజపాను పెద్దాయన గట్టెక్కిస్తారా?

author img

By

Published : Jan 11, 2023, 6:05 PM IST

Karnataka assembly election BJP

కర్ణాటకలో అధికారం నిలబెట్టుకునేందుకు భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దిగ్గజ లింగాయత్ నేత యడియూరప్పపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినప్పటికీ.. ఆయనకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది కమలం. యడ్డీ సైతం పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు.

2023లో 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటక అసెంబ్లీకి సైతం ఈ ఏడాదే ఎన్నికలు జరుగుతాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పార్టీ దిగ్గజం, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై గంపెడు ఆశలు పెట్టుకుంది. లింగాయత్ నేతగా ఆయన భాజపాను విజయతీరాలకు చేరుస్తారని పార్టీ ఆశిస్తోంది.

రాష్ట్రంలో లింగాయత్ వర్గానికి అధికార, విపక్షాలను నిర్ణయించే సత్తా ఉంది. రాష్ట్ర జనాభాలో 17 శాతం లింగాయత్​లు ఉన్నారు. వీరిలో అధిక భాగం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం వీరంతా భాజపాకు ఓటేస్తూ వస్తున్నారు. అందుకే, కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక యడ్డీనే సీఎం కుర్చీ ఎక్కించింది కమలదళం. అనంతరం, కొన్ని కారణాల వల్ల ఆ పదవి నుంచి తొలగించినా.. ఆయన్ను పూర్తిగా విస్మరించలేదు. యడ్డీకి వారసుడిగా లింగాయత్ వర్గానికే చెందిన బసవరాజ్ బొమ్మైని ఎంపిక చేసి.. వారికి తమ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో చాటిచెప్పింది.

"లింగాయత్ ఓట్లు మా పార్టీకి చాలా కీలకం. అందులో ఎలాంటి అనుమానం లేదు. అత్యంత జనాధారణ పొందిన లింగాయత్ నేతల్లో యడియూరప్ప ఒకరు. రాష్ట్రంలో పార్టీ గెలవాలంటే లింగాయత్ వర్గం మాకు అండగా ఉండాలి. వారి ఓట్ల కోసం మేం యడియూరప్పపైనే ఆధారపడి ఉన్నాం."
-ఓ భాజపా నేత

2021 జులై 28 వరకు కర్ణాటక సీఎంగా కొనసాగారు యడియూరప్ప. అనంతరం ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మై బాధ్యతలు చేపట్టారు. అయితే, 2022 ఆగస్టులో భాజపా సంస్థాగత మార్పులు చేపట్టింది. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న పార్లమెంటరీ బోర్డులో యడ్డీకి చోటు కల్పించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే యడ్డీకి భాజపా కీలక పదవి కట్టబెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు పార్టీ.. ఆయనపైనే ఆధారపడుతోందని అంటున్నారు.

"ముఖ్యమంత్రి పదవి వదులు కోవాలని యడియూరప్పను అడిగినప్పుడు ఆయన పార్టీని ఇబ్బంది పెట్టకుండా తప్పుకున్నారు. తనపై నమ్మకంతో పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణం అదే. ఆయన రాజకీయ చతురత పార్టీకి దక్షిణ భారతదేశంలో ఉపయోగపడుతుంది. అందువల్ల పార్లమెంటరీ బోర్డులో ఆయనకు స్థానం ఇవ్వడం అర్థం చేసుకోవచ్చు."
-కర్ణాటక భాజపా ఎంపీ

ఇటీవల గుజరాత్​లో అప్రతిహత విజయం అందుకుంది భాజపా. ఫలితాల తర్వాత సీనియర్ నేతలు రాజ్​నాథ్ సింగ్​తో పాటు యడియూరప్పను భాజపా శాసనపక్ష సమావేశానికి పరిశీలకునిగా పంపింది. ఇది యడ్డీకి పార్టీ ప్రాధాన్యం ఇస్తోందనే విషయాన్ని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, యడ్డీ సైతం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

"రాష్ట్రం గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటో ఆయనకు తెలుస్తాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటిస్తున్నారు. భాజపా జన సంకల్ప యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. సుమారు 25 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. యడియూరప్ప ఇచ్చే ఫీడ్​బ్యాక్​ను పార్టీ పెద్దలు కూడా సీరియస్​గానే తీసుకుంటారు."
-భాజపా ఆఫీస్​బేరర్

గతంలో మూడుసార్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన యడ్డీ.. వచ్చే నెలలో 80వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ఇక ఆయన రాజకీయ జీవితం చరమాంకానికి చేరినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే తన వారసులను రాజకీయాల్లో దించారు యడ్డీ. పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర ఎంపీగా పనిచేస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో చిన్న కుమారుడిని బరిలోకి దించాలని అనుకుంటున్నారు. దిల్లీ పెద్దలు సమ్మతిస్తే.. తనను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన శికారిపుర నుంచి బీవై విజయేంద్రను పోటీకి దించాలని యడ్డీ భావిస్తున్నారు.

అయితే, భాజపా రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కాస్త కష్టపడాల్సిందే. దక్షిణ కర్ణాటకలో కమలం పార్టీ బలహీనంగా ఉంది. రాష్ట్రంలో 14 శాతంగా ఉన్న వొక్కలిగ సామాజిక వర్గం అండదండలు.. విపక్ష జేడీఎస్​కు ఉన్నాయి. వొక్కలిగలు దేవెగౌడ పార్టీకే మద్దతు ఇస్తూ వస్తున్నారు. అశోక్ అశ్వత్​నారాయణ్, సీటీ రవి వంటి వొక్కలిగ నేతలు భాజపాలో కీలకంగా ఎదిగినా.. ఈ వర్గంలో యడియూరప్ప స్థాయి నాయకుడు లేని లోటు మాత్రం కాషాయ పార్టీని వేధిస్తోంది.

2018లో జరిగిన కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 104 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్- జేడీఎస్ కలిసి అధికారం ఏర్పాటు చేశాయి. అయితే, 2019లో కాంగ్రెస్-జేడీఎస్​కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి భాజపాలో కలిశారు. అనూహ్య పరిణామాల అనంతరం భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.