ప్రపంచ ఆహార భద్రతకు అమెరికా భారీ సాయం.. మళ్లీ చర్చకు వచ్చిన కశ్మీర్ అంశం

author img

By

Published : Sep 22, 2022, 7:20 AM IST

un general assembly

ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆహార సంక్షోభాన్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2.9 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. ఐరాస సర్వప్రతినిధి సభలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. మరోవైపు, ఐరాస సర్వప్రతినిధి సభలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌. భారత్‌-పాక్‌ల నడుమ ఇంతవరకూ శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సుమారు రూ.23,184 కోట్ల (2.9 బిలియన్‌ డాలర్ల) మానవతా సాయం ప్రకటించారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి బుధవారం మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. తీవ్ర ఆహార సంక్షోభంలో చిక్కుకున్న ప్రజలకు ఈ నిధులు సాంత్వన కలిగిస్తాయన్నారు.

ఉక్రెయిన్‌పై అత్యంత పాశవిక యుద్ధానికి పాల్పడటం ద్వారా.. ఐరాస మూల సిద్ధాంతాలను రష్యా నిస్సిగ్గుగా ఉల్లంఘించిందని బైడెన్‌ విరుచుకుపడ్డారు. "ఉక్రెయిన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రష్యా ఏడు నెలలుగా యుద్ధం సాగిస్తూ అక్కడి పౌరులను చిత్రహింసలకు గురిచేస్తోంది. అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగస్వామి అయిఉండి కూడా.. అణు దాడుల పేరుతో పుతిన్‌ బాధ్యతారాహిత్య బెదిరింపులకు దిగుతున్నారు. ఉక్రెయిన్‌ భూభాగాలను విలీనం చేసుకునేందుకు అక్కడ బూటకపు రెఫరెండం చేపడుతున్నారు. మాస్కో దురాక్రమణను అన్ని దేశాలూ ఖండించాలి" అని బైడెన్‌ పేర్కొన్నారు.

అణు ఒప్పందం పునరుద్ధరణకు సిద్ధం: రైసీ
అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు తాము సిద్ధమని.. అయితే అమెరికా తన హామీలు, షరతులకు కట్టుబడి ఉంటుందా? అన్నదే తమ అనుమానమని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం నుంచి అమెరికాయే ఏకపక్షంగా వైదొలగిందన్నారు. ఈ మేరకు ఆయన సర్వప్రతినిధి సభను ఉద్దేశించి మాట్లాడారు.

భారత్‌, చైనాలు సర్దుబాటు మార్గాన్ని అన్వేషించాలి: జైశంకర్‌
చైనా, భారత్‌లు తమ ప్రయోజనాలను కాంక్షించి పరస్పరం సర్దుబాటు చేసుకునేందుకు అనువైన మార్గాన్ని అన్వేషించాలని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. అలా జరగని పక్షంలో- ఈ రెండు ఆర్థిక వ్యవస్థలతో కూడిన ఆసియా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి మాట్లాడుతూ- ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో చైనా కాన్సులేట్‌ను ప్రారంభించవచ్చా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఉభయ దేశాల నడుమ ప్రస్తుతం సాధారణ సంబంధాలు లేవని జైశంకర్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ ప్రధాని డెనిస్‌ ష్మేహాల్‌తో ఆయన భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌, రష్యాలు హింసను విడనాడి.. దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న భారత వైఖరిని ఆయనకు వివరించారు.

కశ్మీర్‌ అంశాన్ని మళ్లీ ప్రస్తావించిన తుర్కియే..
తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌ మరోసారి భారత్‌ విషయంలో తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారు. ఐరాస సర్వప్రతినిధి సభలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన ఆయన, భారత్‌-పాక్‌ల నడుమ ఇంతవరకూ శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించారు. "భారత్‌, పాకిస్థాన్‌లకు 75 ఏళ్ల కిందటే స్వాతంత్యం లభించినా.. ఉభయ దేశాల నడుమ ఇప్పటివరకూ శాంతి, ఐకమత్యం లేదు. ఇది దురదృష్టకరం. కశ్మీర్‌లో శాశ్వతంగా శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నాం" అని ఎర్దోగన్‌ అన్నారు. దీనిపై భారత్‌ ఘాటుగా స్పందించింది. తుర్కియే అధ్యక్షుడు.. ఉభయ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికింది. కశ్మీర్‌ అంశంపై గతంలోనూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 2019లో కశ్మీర్‌ అంశాన్ని ఐరాస సర్వప్రతినిధి సభలో లేవనెత్తిన ఆయన.. 2020లో పాకిస్థాన్‌ పార్లమెంటులోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

మోదీ మాట సత్యం: మెక్రాన్‌
'ప్రస్తుత యుగం యుద్ధాలది కాదు' అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్న వ్యాఖ్యలు అక్షర సత్యాలని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ అన్నారు. మంగళవారం ఆయన ఐరాస జనరల్‌ అసెంబ్లీ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొన్న మోదీ.. పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేయాల్సిందిగా రష్యాను కోరిన మోదీ.. "ఈ యుగం యుద్ధాలది కాదు. ప్రజాస్వామ్యం, దౌత్యనీతి, చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలి" అని సూచించిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలను తాజాగా సమర్థించిన మెక్రాన్‌.. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తూర్పు, పశ్చిమ దేశాలు సంఘటితంగా పని చేయాల్సిన సమయమిదని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి: 'ప్రమాదం అంచున పాక్‌ పసిప్రాణాలు.. అత్తెసరు సాయం మాత్రమే..'

'మానవులు విశ్వవ్యాప్తం'.. అంతరిక్ష నివాసానికి నాసా ఏర్పాట్లు.. కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.