హిందూ ఆలయాలపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : May 24, 2023, 10:25 AM IST

Updated : May 24, 2023, 10:37 AM IST

pm-modi in australia

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై మాట్లాడారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఘటనలను సహించకూడదని స్పష్టం చేశారు. మరోవైపు, భారత్​లో జరగనున్న వన్డే ప్రపంచకప్​ను చూసేందుకు రావాలని ఆసీస్ ప్రధానిని మోదీ ఆహ్వానించారు.

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ఆ దేశ ప్రధాని ముందు ప్రస్తావించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే చర్యలను సహించకూడదని స్పష్టం చేశారు. గతంలోనూ ఈ విషయంపై ఆసీస్ ప్రధానితో తాను చర్చించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అలాంటి ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్​కు కృతజ్ఞతలు తెలిపారు. అల్బనీస్​తో ద్వైపాక్షిక చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

"ఆస్ట్రేలియాలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి అల్బనీస్, నేను గతంలోనూ చర్చలు జరిపాం. వేర్పాటువాద శక్తుల గురించి చర్చించాం. ఈరోజు కూడా ఆ అంశాలపై మేం సమాలోచనలు చేశాం. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీయడాన్ని సహించకూడదు. వేర్పాటువాద శక్తులపై ఆస్ట్రేలియా ప్రధాని కఠిన చర్యలు తీసుకున్నారు. ఇకపైనా గట్టి చర్యలు తీసుకుంటామని ప్రధాని అల్బనీస్ నాకు హామీ ఇచ్చారు."
-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

ఆస్ట్రేలియాతో సంబంధాలు టీ20 మోడ్​లోకి ప్రవేశించాయని మోదీ చెప్పుకొచ్చారు. ఒక్క ఏడాదిలోనే.. ఆ దేశ ప్రధానితో తాను ఆరుసార్లు సమావేశమైనట్లు గుర్తు చేశారు. భారత్​లో జరగనున్న వన్డే ప్రపంచకప్​ను చూసేందుకు రావాలని అల్బనీస్​ను మోదీ ఆహ్వానించారు. ఆ సమయంలో దేశంలో దీపావళి సంబరాలు సైతం చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారని పేర్కొన్న మోదీ.. ఇరుదేశాల మధ్య వారు జీవ వారధిగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అల్బనీస్​ను తన స్నేహితుడిగా అభివర్ణించారు మోదీ.

pm-modi in australia
అల్బనీస్​తో మోదీ
pm-modi in australia
అల్బనీస్​తో మోదీ

"నా మిత్రుడు, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్.. రెండు నెలల క్రితమే భారత్​లో పర్యటించారు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాకు వచ్చాను. ఏడాది కాలంలో మా మధ్య జరుగుతున్న ఆరో సమావేశం ఇది. ఇరుదేశాల మధ్య బలమైన, లోతైన సంబంధాలకు ఈ సమావేశాలు అద్దం పడుతున్నాయి. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే.. మన సంబంధాలు టీ20 మోడ్​లోకి ప్రవేశించాయి."
-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

బెంగళూరులో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్​ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని అల్బనీస్ ప్రకటించారు. భారత్​లో కొత్తపుంతలు తొక్కుతున్న డిజిటల్ ఎకానమీని ఆస్ట్రేలియా వాణిజ్యంతో అనుసంధానం చేసేందుకు కాన్సులేట్ జనరల్ ఉపయోగపడుతుందని చెప్పారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే 'సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం' (సీఈసీఏ)పై వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని ఇరుదేశాల ప్రధానులు ఉద్ఘాటించారు. తాజా చర్చల్లో రెండు ఒప్పందాలు ఖరారు అయినట్లు తెలిపారు. భారత్- ఆస్ట్రేలియా గ్రీన్ హైడ్రోజన్ టాస్క్​ఫోర్స్ ఏర్పాటులో కీలక ముందడుగు పడిందని ఇరుదేశాధినేతలు పేర్కొన్నారు.

pm-modi in australia
అల్బనీస్​తో మోదీ
pm-modi in australia
ఆస్ట్రేలియా ప్రతినిధులతో మోదీ చర్చలు
Last Updated :May 24, 2023, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.